‘పవర్‌మెక్‌’ నుంచి రూ.18 కోట్ల వసూళ్లపై ఇంకా పిల్లిమొగ్గలే!

విశాఖలోని ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ నిర్మాణ పనులకు టెండరు పొందిన పవర్‌మెక్‌ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తం చెల్లింపుల వ్యవహారం మలుపులు తిరుగుతూనే ఉంది.

Updated : 03 Jun 2023 05:47 IST

పోలీసులకు ఫిర్యాదు ఇచ్చి రెండేళ్లు
తాజాగా పరిశ్రమల శాఖ మధ్యవర్తిత్వం

ఈనాడు, అమరావతి: విశాఖలోని ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌ నిర్మాణ పనులకు టెండరు పొందిన పవర్‌మెక్‌ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అధిక మొత్తం చెల్లింపుల వ్యవహారం మలుపులు తిరుగుతూనే ఉంది. తాము ఆ సంస్థ ద్వారా చెల్లింపులయ్యేలా చర్యలు తీసుకుంటామని, బ్యాంకు ఖాతా వివరాలు పంపాలని పరిశ్రమల శాఖ గత నెల 24న వైద్య ఆరోగ్య శాఖకు లేఖ రాసింది. మెడ్‌టెక్‌ జోన్‌ పనులతో జాతీయ ఆరోగ్య మిషన్‌కు సంబంధం లేదు. దీనికి భిన్నంగా ఈ పనుల కోసం పవర్‌మెక్‌ అండ్‌ బీఎస్‌సీపీఎల్‌ కన్సార్షియానికి పనులు అప్పగించాలని అప్పట్లో జాతీయ ఆరోగ్య మిషన్‌ డైరెక్టర్‌గా ఉన్న పూనం మాలకొండయ్య 2018 నవంబరు 19న అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జాతీయ ఆరోగ్య మిషన్‌ మరుసటి రోజే రూ.52,78,48,436 కోట్లు ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌కు, అక్కడినుంచి పవర్‌మెక్‌కు చెల్లించేసింది. మెడ్‌టెక్‌ జోన్‌ తన ఆడిట్‌ నివేదికలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించింది. ఒకే పని కోసం జాతీయ ఆరోగ్య మిషన్‌ నుంచి, రాష్ట్ర ప్రభుత్వ పరిధి మెడ్‌టెక్‌ జోన్‌ నుంచి పవర్‌మెక్‌ బిల్లులు పొందింది. దీనిపై వివాదం మొదలవడంతో జాతీయ ఆరోగ్య మిషన్‌ నిధుల్లో రూ.34 కోట్లను 2018 డిసెంబరు 10న పవర్‌మెక్‌ తిరిగి జమ చేసింది. మిగిలిన రూ.18 కోట్లు మాత్రం ఇప్పటివరకు ఆరోగ్య మిషన్‌ ఖాతాకు చేరలేదు.

పోలీసులకు ఫిర్యాదు

పవర్‌మెక్‌ నుంచి రూ.18 కోట్లు వెనక్కు రాకపోవడంపై జాతీయ ఆరోగ్య మిషన్‌ అధికారులు 2021 మేలో విజయవాడ పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికీ తీసుకెళ్లారు. ఫిర్యాదు ఇచ్చి రెండేళ్లు దాటింది. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖకు పరిశ్రమల శాఖ అదనపు కార్యదర్శి లేఖ రాశారు. తాము పవర్‌మెక్‌కు చెల్లించాల్సిన బిల్లులనుంచి రికవరీ చేసి రూ.18 కోట్లు చెల్లింపయ్యేలా చూస్తామని తెలిపారు. గతంలో మెడ్‌టెక్‌ జోన్‌ వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఉండేది. కొద్దికాలం కిందట పరిశ్రమల శాఖ పరిధిలోకి మార్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని