బోధన తీరు మారాలి

బోధన తీరు మారాలని సైయెంట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌, ఐఐటీ కాన్పూర్‌ బోర్డు సభ్యుడు బి.వి.ఆర్‌.మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Published : 04 Jun 2023 05:15 IST

ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఖ్య పెరగాలి
సైయెంట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి

ఈనాడు, అమరావతి: బోధన తీరు మారాలని సైయెంట్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌, ఐఐటీ కాన్పూర్‌ బోర్డు సభ్యుడు బి.వి.ఆర్‌.మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. విద్యారంగం సాంకేతికత ఆధారంగా మారినందున అధ్యాపకులు పాఠాలు చెబుతాం..వినండి అని కాకుండా..ప్రశ్నలు, జవాబుల రూపంలో బోధన సాగిస్తే...విద్యార్థుల్లో నైపుణ్యాలు మరింత పెరుగుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విజయవాడలో శనివారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మోహన్‌రెడ్డి మాట్లాడారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా బోధన రంగంలోనూ మార్పులు తెచ్చేందుకు విశ్వవిద్యాలయాల ఉపకులపతులు కృషి చేయాలని సూచించారు. రానున్న పదేళ్లలో పది కోట్ల మంది చదువులు ముగించుకొని వస్తారని...వీరికి ఉద్యోగాలు లభించాలంటే...ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఖ్య బాగా పెరగాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈఓ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ..తిరుపతిలో ఏర్పాటుకానున్న నైపుణ్య వర్సిటీ ద్వారా విద్యార్థులకు రకరకాల కోర్సులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. డిగ్రీతోపాటు స్వల్పకాలిక కోర్సులు కూడా విద్యార్థులు పూర్తి చేసేలా మార్పులు తెస్తున్నామని చెప్పారు. నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో 20 విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, వీటికి అదనంగా మరో ఆరు ఏర్పాటుచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్యాశాఖ ప్రభుత్వ సలహాదారు సాంబశివారెడ్డి మాట్లాడుతూ అమ్మఒడి, వైఎస్సార్‌ కల్యాణమస్తు పథకాల వల్ల విద్యారంగంలో డ్రాప్‌ అవుట్స్‌ తగ్గుతున్నాయని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని