చిన్న పొరపాటుకూ భారీ మూల్యమే

రైలు ప్రయాణం సాఫీగా సాగేందుకు సిగ్నలింగ్‌ వ్యవస్థ అత్యంత కీలకమైనది. అందులో చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం ఉండకూడదు.

Updated : 04 Jun 2023 10:39 IST

సిగ్నలింగ్‌లో అనుక్షణం అప్రమత్తత అవసరం
అత్యధిక సెక్షన్లలో ఐబీ విధానమే
పరిమితంగానే ఆటోమేటిక్‌ విధానం

ఈనాడు- అమరావతి: రైలు ప్రయాణం సాఫీగా సాగేందుకు సిగ్నలింగ్‌ వ్యవస్థ అత్యంత కీలకమైనది. అందులో చిన్న పొరపాటుకు కూడా ఆస్కారం ఉండకూడదు. ఏ మాత్రం నిర్లక్ష్యం ప్రదర్శించినా భారీ ప్రాణ, ఆస్తి నష్టం తప్పదు. సాధారణంగా రైలు ఒక స్టేషన్‌ పరిధిలోకి వచ్చినప్పుడు హోం సిగ్నల్‌, స్టేషన్‌ దాటి వెళ్తున్నప్పుడు డిస్పాచ్‌ సిగ్నల్‌, రైల్వే గేట్లు ఉన్నచోట గేట్‌ సిగ్నల్స్‌ ఉంటాయి. వీటన్నింటినీ నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. అలాగే ఓ ప్రయాణికుల రైలు స్టేషన్‌లో ఆగాల్సినప్పుడు.. ఆ స్టేషన్‌ పరిధిలోని హోం సిగ్నల్‌ వద్ద గంటకు 40 కి.మీ. వేగంతో ప్రవేశించి స్టార్టర్‌ వద్ద ఉండే సిగ్నల్‌ వరకు వచ్చి ఆగుతుంది. ఆ రైలు బయలుదేరినప్పుడు స్టార్టర్‌ వద్ద సిగ్నలిస్తే.. అక్కడి నుంచి బయలుదేరి, డిస్పాచ్‌ సిగ్నల్‌ దాటి స్టేషన్‌ పరిధి నుంచి వెళ్లిపోతుంది. ఓ రైలు ఒక స్టేషన్‌లో బయలుదేరి తర్వాత స్టేషన్‌ను దాటిన తర్వాత.. మొదటి స్టేషన్‌ నుంచి మరొక రైలు బయలుదేరేందుకు సిగ్నల్‌ ఇస్తారు. దీనిని యాక్సిల్‌ కౌంటింగ్‌ విధానం అంటారు. అంటే ఓ రైలు ఒక స్టేషన్‌ నుంచి ఎన్ని యాక్సిల్స్‌లో బయలుదేరిందో, తర్వాత స్టేషన్‌ను కూడా అన్నే యాక్సిల్స్‌తో దాటాలి. అప్పుడే వెనుక వచ్చే మరో రైలుకు మార్గం సుగమమవుతుంది. దీన్ని ఇంటర్మీడియట్‌ బ్లాక్‌ (ఐబీ) సిగ్నలింగ్‌ విధానం అంటారు. ఇందులో రెండు స్టేషన్ల మధ్య ఒక సిగ్నలింగ్‌ ఉంటుంది. మన రాష్ట్రంలోని దువ్వాడ నుంచి గూడూరు వరకు ఉన్న మార్గంలో దాదాపు అన్ని సెక్షన్లలో ఐబీ విధానమే ఉంది. దీంతో రెండు స్టేషన్ల మధ్య దూరం ఎక్కువగా ఉన్నచోట.. అది దాటే వరకు వెనుక వచ్చే రైలుకు సిగ్నల్‌ ఇవ్వరు. ఉదాహరణకు రాజమండ్రి నుంచి గోదావరి నదిపై ఉన్న రైల్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జి మీదుగా కొవ్వూరు స్టేషన్‌ దాటేందుకు ప్రయాణికుల రైలుకు 15-17 నిమిషాల సమయం పడుతుంది. గూడ్స్‌కు 20 నిమిషాలపైనే పడుతుంది. అప్పటి వరకు వెనుక వచ్చే రైళ్లు రాజమండ్రిలో ఆగాల్సిందే.

విజయవాడలో ఆటోమేటిక్‌ విధానం

డివిజన్‌ కేంద్రమైన విజయవాడ వద్ద ఐబీ సిగ్నలింగ్‌ స్థానంలో కొత్తగా ఆటోమేటిక్‌ విధానం అమల్లోకి తెచ్చారు. గన్నవరం స్టేషన్‌ నుంచి విజయవాడ మీదుగా కృష్ణా కెనాల్‌ స్టేషన్‌ వరకు దీనిని ఏర్పాటు చేశారు. దీనిలో ఓ స్టేషన్‌ నుంచి మరో స్టేషన్‌ మధ్య రెండు ఐబీలు ఉంటాయి. ఇందులో ఓ రైలు రెండో ఐబీ సిగ్నల్‌ దాటగానే, వెనుక మరో రైలు వచ్చేందుకు సిగ్నల్‌ లభిస్తుంది. ఈ విధానాన్ని రాజమండ్రి- కొవ్వూరు స్టేషన్ల మధ్య కూడా ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరయ్యాయి. త్వరలో అక్కడ కూడా అమలు చేయనున్నారు.

లూప్‌ లైన్‌ ఎందుకు?

ప్రయాణికుల రైళ్లతో పోల్చితే గూడ్స్‌ రైళ్ల సగటు వేగం చాలా తక్కువ. అందువల్ల ప్రయాణికుల రైళ్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా గూడ్స్‌ రైళ్లను వివిధ స్టేషన్లలో ప్రధాన లైన్‌కు పక్కన ఉండే లూప్‌ లైన్‌లో నిలిపి ఉంచుతారు. ఆ స్టేషన్‌లో ప్రధాన లైన్‌ మీదుగా ప్రయాణికుల రైళ్లు వెళ్లిన తర్వాత, గూడ్స్‌ రైలును లూప్‌ లైన్‌ నుంచి మెయిన్‌ లైన్‌లోకి వెళ్లి ప్రయాణించేలా సిగ్నల్‌ ఇస్తారు. ఇలా లూప్‌ లైన్‌లో గూడ్స్‌ రైలు నిలిచి ఉండగా, ప్రధాన లైన్‌లో వెళ్లాల్సిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌.. లూప్‌ లైన్‌లోకి వెళ్లడంతో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు