Polavaram Project: పోలవరానికి అదనంగా రూ.12,911 కోట్లు
పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం అదనంగా రూ.12,911.15 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులిచ్చింది.
కేంద్ర ఆర్థిక శాఖ పచ్చజెండా
మంత్రిమండలి ముందుకు నోట్.. త్వరలో ఆమోదం
41.15 మీటర్ల ఎత్తుకు నీరు నిలిపేందుకే
తొలి దశ అని ఉత్తర్వుల్లో ప్రస్తావించని ఆర్థికశాఖ
లైడార్ సర్వేతో 41.15 మీటర్ల పరిధిలో పెరిగిన నిర్వాసితులు
వారి పునరావాసానికి నిధులివ్వని కేంద్రం
ఈనాడు, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం అదనంగా రూ.12,911.15 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుని ఉత్తర్వులిచ్చింది. కేంద్ర జల్శక్తి శాఖ మంత్రిమండలి ముందు తీర్మానం ప్రతిపాదించి.. ఆమోదం పొందాలని సూచించింది. కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం డైరెక్టర్ సోమవారం ఈ ఆదేశాలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు డ్యాం 45.72 మీటర్ల ఎత్తున నీరు నిలబెట్టేలా నిర్మించాలి. 41.15 మీటర్ల ఎత్తుకు నీరు నిలబెట్టేందుకు ఎంత ఖర్చవుతుందో.. ఆ మేరకు ఇంకెన్ని నిధులు అవసరమో అవి మంజూరు చేస్తున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. తొలి దశ కింద ఈ నిధులు ఇస్తున్నట్లు కానీ, మలి దశ రూపంలో మళ్లీ నిధులిచ్చే ప్రతిపాదన ఉన్నట్లు కానీ వాటిలో ఎక్కడా ప్రస్తావించలేదు.
పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుకు నిర్మించడానికి రూ.10,911.15 కోట్లకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించినా కేంద్ర జల్శక్తి శాఖ మరికొన్ని వివరాలు కోరింది. దీంతో ఈ ఏడాది మే నెల ప్రారంభంలో తాజా లెక్కలు రూపొందించారు. డయాఫ్రం వాల్ మరమ్మతులు, ప్రధాన డ్యాంలో పడ్డ అగాధాలు పూడ్చేందుకు అవసరమయ్యే నిధుల అంచనా కూడా కలిపి రూ.16,952.07 కోట్లు అవసరమని తేల్చి పోలవరం అథారిటీకి, కేంద్ర జల్శక్తి శాఖకు సమర్పించారు. ఈ లోపునే పాత అంచనాల మేరకు రూ.10,911.15 కోట్లను పరిగణనలోకి తీసుకున్నారు. దాంతో పాటు పోలవరంలో డయాఫ్రం వాల్ మరమ్మతులు, పాక్షిక డయాఫ్రం వాల్ నిర్మాణానికి, ప్రధాన డ్యాం ప్రాంతంలో ఏర్పడ్డ పెద్ద పెద్ద అగాధాల పూడ్చివేతకు అంచనా వేసిన రూ.2,000 కోట్లు కూడా కలిపి రూ.12,911.15 కోట్లకు కేంద్ర ఆర్థికశాఖ వ్యయ నియంత్రణ విభాగం ఆమోదించడం విశేషం.
విభాగాలవారీ పరిమితి ఎత్తివేత
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఇంతవరకు రెండుసార్లు పెట్టుబడి వ్యయం ఆమోదించారు. 2010-11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లకు తొలిసారి ఆమోదించారు.
* తర్వాత 2013-14 ధరల ప్రకారం రూ.20,398.81 కోట్లకు సాగునీటి వ్యయంగా కేంద్ర ఆర్థికశాఖ ఆమోదించగా మంత్రిమండలి పచ్చజెండా ఊపింది.
* ప్రస్తుతం ఆ అంచనా ధరలను పరిగణనలోకి తీసుకుని మాత్రమే కేంద్రం నిధులు ఇస్తోంది. ఇందులో ప్రధాన డ్యాం, కుడి కాలువ, ఎడమ కాలువ, భూసేకరణ, పునరావాసం కింద ఏయే విభాగానికి ఎంత నిధులు ఆమోదం పొందాయో ఆ ప్రకారమే ఇస్తోంది.
* ఒక విభాగం కింద ఆమోదం పొందిన పరిమితి మేరకు నిధులివ్వడం పూర్తయితే.. ఆ విభాగం కింద అదనపు బిల్లులు సమర్పించినా డీపీఆర్లో ఆమోదం లేదంటూ పక్కన పెడుతున్నారు.
* తాజాగా ఆమోదించిన విధానం ప్రకారం అదనంగా ఇవ్వబోయే రూ.12,911.15 కోట్లకు ఇలాంటి పరిమితి విధించబోమని కేంద్ర ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. ఈ అదనపు నిధులు ఏ విభాగం పరిధిలోనైనా ఖర్చు చేసుకునేందుకు వీలు కల్పిస్తున్నారు.
* రూ. 47,725.24 కోట్ల మొత్తానికి కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపి, మంత్రిమండలి ముందుంచి ఆమోదిస్తే నిధులు ఇచ్చేందుకు వీలయ్యేది. అన్ని దశలు దాటిన ఆ డీపీఆర్ను ఆర్థికశాఖ ఆమోదించలేదు. ప్రస్తుతం 41.15 మీటర్ల స్థాయికి నీళ్లు నిలబెట్టేందుకు అవసరమయ్యే నిధులు అంటూ రూ.12,911.15 కోట్లకు ఆమోదించింది. 45.72 మీటర్ల స్థాయికి ప్రాజెక్టు నిర్మించి తొలుత 41.15 మీటర్లకు నీరు నిలబెడతామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇవి తొలిదశ నిధులే అంటోంది. అయితే కేంద్రం తన తాజా ఆదేశాల్లో ఎక్కడా తొలిదశ అని ప్రస్తావించలేదు.
తొలిదశలో పునరావాసానికి ఇంకా నిధులు కావాలి
పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల స్థాయిలో నీళ్లు నిలబెట్టాలంటే భూసేకరణ, పునరావాసానికి ఇప్పుడు లెక్కించిన మొత్తం కాకుండా అదనంగా రూ.5,127 కోట్లు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. తొలి దశలో 41.15 మీటర్ల స్థాయికి నీరు నిలబెడితే మరో 36 గ్రామాలు, 16,642 కుటుంబాలు తొలిదశ నిర్వాసితుల జాబితాలోకే వస్తాయని తాజా లైడార్ సర్వేలో తేలినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఆ నిధులూ కావాలని తాజా అంచనాల్లో కోరింది. ఇప్పుడు కేంద్రం 41.15 మీటర్ల స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అంటూ మంజూరు చేసిన నిధుల్లో ఆ అదనపు మొత్తం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.