ఎంఎస్‌ఎంఈల పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)ల పర్యవేక్షణ కోసం పరిశ్రమల శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, దీనికి ఒక కార్యదర్శిని నియమించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 06 Jun 2023 05:12 IST

కార్యదర్శి స్థాయి అధికారి నేతృత్వం
విశాఖ సదస్సులో కుదిరిన ఎంఓయూల అమలుపై ప్రత్యేక దృష్టి  
పరిశ్రమల శాఖ సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశాలు
ఈనాడు - అమరావతి

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)ల పర్యవేక్షణ కోసం పరిశ్రమల శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని, దీనికి ఒక కార్యదర్శిని నియమించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. విశాఖలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో శాఖల వారీగా కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై ఆయన అధికారులతో సోమవారం సమీక్షించారు. ‘ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే ఎంఎస్‌ఎంఈలకు ప్రభుత్వం మార్గదర్శకంగా వ్యవహరించాలి. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న ఉత్పత్తుల తయారీకి అవసరమైన సాంకేతికతను ఎంఎస్‌ఎంఈలకు అందించాలి. ఉత్పత్తులను అంతర్జాతీయంగా విక్రయించేలా బహుళజాతి సంస్థలతో అనుసంధానం కావాలి. దీనికోసం నిర్వాహకుల్లో నైపుణ్యాన్ని పెంచాలి. ఇందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి’ అని సూచించారు. ‘విశాఖలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలన్నీ 2024 ఫిబ్రవరి నాటికి పనులు ప్రారంభించేలా చూడాలి. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐటీ), ఐటీ ఆధారిత సేవలకు విశాఖ హబ్‌ కావాలి. దీనికోసం ప్రముఖ సంస్థలతో నిరంతరం సంప్రదింపులు కొనసాగించాలి. ఆహార శుద్ధి, పశుసంవర్థక, పర్యాటక రంగాలకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలను కార్యరూపంలోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టాలి. టమాటా, ఉల్లిపాయల వంటి ఉత్పత్తులకు సంబంధించి డిమాండ్‌లో తరచూ వ్యత్యాసం వస్తోంది. ఇలాంటి పంటల ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు పనులు వేగవంతం చేయాలి’ అని అధికారులను ఆదేశించారు.

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ ఒప్పందాల్లో 85% కార్యరూపంలోకి!: ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసులు, ఎలక్ట్రానిక్స్‌ రంగంలో రూ. 44,963 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 88 ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇందులో 85 శాతం కార్యరూపంలోకి వచ్చాయన్నారు. ‘విశాఖ సదస్సు ద్వారా కుదిరిన 387 ఒప్పందాల్లో.. పరిశ్రమల శాఖకు సంబంధించినవి 100 ఉన్నాయి. ఇప్పటికే కార్యరూపంలోకి వచ్చిన 13 ఒప్పందాల ద్వారా రూ. 2,739 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2024 జనవరిలోగా 38 కంపెనీలు, మార్చిలోగా మరో 30 కంపెనీలు ఉత్పత్తి ప్రారంభిస్తాయి. విశాఖ సదస్సులో 25 విద్యుత్‌ ప్రాజెక్టులకు సంబంధించి కుదిరిన ఒప్పందాల్లో.. 8 ప్రాజెక్టులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది. మరో 8 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధమయ్యాయి. అంతకు ముందు 20 విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం ఒప్పందాలు కుదుర్చుకోగా.. అందులో ఆరింట్లో పనులు త్వరలో ప్రారంభమవుతాయి. మరో 11 ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లు పూర్తయ్యాయి. వాటి ద్వారా రూ. 8.85 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి’ అని వివరించారు. 2022లో రాష్ట్రానికి రూ. 45,217 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. 2022-23లో రూ. 1.6 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి చేశామని చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు