చిన్న పనులకు వెంటనే బిల్లులు చెల్లించాలంటే ఎలా?

‘పురపాలక సంఘాల్లో చేసే చిన్న పనులకు గుత్తేదారులు వెంటనే బిల్లులు చెల్లించాలంటే ఎలా? ప్రభుత్వ పనులకు బిల్లులు సాధారణంగా ఆలస్యంగానే వస్తాయి.

Updated : 06 Jun 2023 06:24 IST

పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌

ఈనాడు, అమరావతి: ‘పురపాలక సంఘాల్లో చేసే చిన్న పనులకు గుత్తేదారులు వెంటనే బిల్లులు చెల్లించాలంటే ఎలా? ప్రభుత్వ పనులకు బిల్లులు సాధారణంగా ఆలస్యంగానే వస్తాయి. టెండర్లు వేయడానికి ముందుకు రానిచోట పనులను ప్యాకేజీలుగా చేసి ఆరు నెలలు బిల్లులు రాకపోయినా ఫర్వాలేదనుకునే పెద్ద గుత్తేదారులకు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ పేర్కొన్నారు. ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో సోమవారం ‘15 సార్లు పిలిచినా గుత్తేదారుల గప్‌చుప్‌’ శీర్షికతో వెలువడిన కథనంపై సచివాలయంలో ఆయన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, కమిషనర్‌ కోటేశ్వరరావులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.

‘పనులకు గుత్తేదారులు టెండర్లు వేయకపోవడానికి అనేక ఇతర కారణాలుంటాయి. పురపాలక సాధారణ నిధులతో చేసిన 1,926 పనులకు రూ.258.20 కోట్లు, 14, 15 ఆర్థిక సంఘం నిధులతో చేసిన 768 పనులకు మరో రూ.169.42 కోట్ల్ల బిల్లులు ఇప్పటివరకు చెల్లించాం. విద్యుత్తు, టెలిఫోన్‌ ఛార్జీలు, సచివాలయ భవనాలకు అద్దెలు, ఇతరత్రా కలిపి మొత్తం రూ.510.46 కోట్లు సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చెల్లింపులు జరిగాయి. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు సర్వసభ్య సమావేశాల్లో ప్రస్తావిస్తున్న సమస్యలపై అక్కడి పుర, నగరపాలక సంస్థలు సమాధానం చెప్పాలి. తాగునీరు, పారిశుద్ధ్యం, మురుగునీటి శుద్ధి, పచ్చదనం వంటి విషయాల్లో పట్టణ స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తోంది. ఆస్తి మూలధన విలువ ఆధారంగా ఆస్తిపన్ను విధించే అంశంలో మేం చేసిందేమీ లేదు. అది కేంద్ర ప్రభుత్వ పాలసీ. పాత బకాయిలపై వడ్డీ మాఫీ కారణంగా రూ.3 వేల కోట్ల వరకు ప్రజలకు ప్రయోజనం కలిగింది. మాఫీ ప్రకటించక ముందు ప్రజలు చెల్లించిన వడ్డీని ఆస్తిపన్నుకి సర్దుబాటు చేసే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటాం’ అని మంత్రి సురేశ్‌ వెల్లడించారు.

యూజర్‌ ఛార్జీలపై మీకొచ్చిన ఇబ్బందేమిటి?: శ్రీలక్ష్మి

ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తున్నందుకు ప్రజలు యూజర్‌ ఛార్జీలు చెల్లిస్తున్నపుడు మీకొచ్చిన (మీడియా) ఇబ్బంది ఏమిటి?అని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి వ్యాఖ్యానించారు.  ‘యూజర్‌ ఛార్జీలు ఎంత వసూలు చేయాలో పుర, నగరపాలక సంస్థలే నిర్ణయించాయి. ప్రజలకు యూజర్‌ ఛార్జీలు భారమవుతున్నాయని వారానికోసారి చెత్త తీయాలా? కార్యక్రమాన్ని ప్రారంభించక ముందు నాటికి, ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. చెత్త సేకరణకు ప్రజల ఇళ్ల వద్దకు వాహనాలు వెళుతున్నాయి. ఇలాంటి స్వచ్ఛ కార్యక్రమాల వల్లే జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ మిగతా రాష్ట్రాలకు విధించినట్లుగా.. మన రాష్ట్రానికి అపరాధ రుసుం విధించలేదు. కొత్త ఆస్తి పన్ను విధానం వంటి అనేక సంస్కరణలు అమలు చేస్తున్నందునే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రూ.645 కోట్లు ఇచ్చింది’ అని ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని