వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల కస్టడీ పిటిషన్‌పై ముగిసిన వాదనలు

వాణిజ్య పన్నుల శాఖలో తమ చర్యల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారన్న కేసులో అరెస్టయిన నలుగురు ఉద్యోగుల కస్టడీ పిటిషన్‌పై కోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి.

Published : 06 Jun 2023 05:07 IST

ఈనాడు - అమరావతి: వాణిజ్య పన్నుల శాఖలో తమ చర్యల ద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొట్టారన్న కేసులో అరెస్టయిన నలుగురు ఉద్యోగుల కస్టడీ పిటిషన్‌పై కోర్టులో సోమవారం వాదనలు ముగిశాయి. తుది ఉత్తర్వులు మంగళవారం వెలువడనున్నాయి. ఈ కేసుకు సంబంధించి జీఎస్టీ అధికారులు మెహర్‌కుమార్‌, సంధ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ చలపతి, ఆఫీస్‌ సబార్డినేట్‌ సత్యనారాయణలను విజయవాడ పటమట పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న నిందితులను నాలుగు రోజుల కస్టడీకి ఇవ్వాలని పటమట సీఐ కాశీవిశ్వనాథ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై 2వ ఏసీఎంఎం కోర్టులో న్యాయాధికారి సునందమ్మ ఎదుట ప్రభుత్వం తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ నాగిరెడ్డి, నిందితుల తరఫున ఉమేష్‌ చంద్ర వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి.. ఉత్తర్వుల నిమిత్తం మంగళవారానికి వాయిదా వేశారు.

బెయిల్‌ పిటిషన్‌ దాఖలు

జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న నిందితులకు బెయిల్‌ ఇవ్వాలని 2వ ఏసీఎంఎం కోర్టులో వారి తరఫున న్యాయవాది ఉమేష్‌ చంద్ర బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై కౌంటరు దాఖలు చేసేందుకు రెండు రోజుల సమయం ఇవ్వాలని ఏపీపీ కోరారు. దీంతో తదుపరి వాదనల నిమిత్తం న్యాయాధికారి సునందమ్మ 8వ తేదీకి వాయిదా వేశారు.


‘రికవరీ సొమ్ము జమకు ఖాతా వివరాలు పంపాలి’

ఈనాడు, అమరావతి: పవర్‌మెక్‌ సంస్థ నుంచి రికవరీ కింద వసూలు చేసిన రూ. 18 కోట్లు పంపేందుకు బ్యాంక్‌ ఖాతా వివరాలను పరిశ్రమల శాఖకు తెలియచేయాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ను సోమవారం ఆదేశించింది. గత నెలాఖరులో పరిశ్రమల శాఖ.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యాలయానికి రాసిన లేఖలో రూ.18 కోట్ల రికవరీ డబ్బును పంపేందుకు బ్యాంక్‌ ఖాతా వివరాలు ఇవ్వాలని కోరింది. ఇదే విషయమై వైద్య ఆరోగ్య శాఖ నుంచి కూడా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఆదేశాలు వెళ్లాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని