మార్గదర్శిని దెబ్బతీయడమే అసలు లక్ష్యం

మార్గదర్శి సంస్థను అప్రతిష్ఠపాలు చేయాలన్న దుర్బుద్ధితో.. చిట్‌ఫండ్‌పై తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టి కొంతకాలంగా వేధిస్తున్న సీఐడీ.. మరోమారు విచారణ పేరుతో హడావుడి చేసింది.

Updated : 07 Jun 2023 06:25 IST

ఏడు గంటల పాటు ఎండీ శైలజాకిరణ్‌ను విచారించిన సీఐడీ
మళ్లీ మళ్లీ అవే ప్రశ్నలు.. పొంతన లేని అంశాలు
ఈనాడు - హైదరాబాద్‌

మార్గదర్శి సంస్థను అప్రతిష్ఠపాలు చేయాలన్న దుర్బుద్ధితో.. చిట్‌ఫండ్‌పై తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టి కొంతకాలంగా వేధిస్తున్న సీఐడీ.. మరోమారు విచారణ పేరుతో హడావుడి చేసింది. సంస్థ ఎండీ శైలజాకిరణ్‌ను మంగళవారం సుమారు ఏడు గంటలపాటు విచారించింది. వేధింపులే లక్ష్యంగా సీఐడీ అధికారుల తీరు ఉన్నట్లు కనిపించింది. అడిగిన ప్రశ్నలే మళ్లీ మళ్లీ అడగడం.. పొంతన లేని అంశాల గురించి ప్రస్తావించడం వారి దురుద్దేశాన్ని వెల్లడించింది. తొలుత విచారణ నిమిత్తం 40 ప్రశ్నలు అడుగుతామని చెప్పినా.. అధికారులు రోజంతా కేవలం 8 ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారు. పలుమార్లు అవే ప్రశ్నలతో తికమక పెట్టే ప్రయత్నం చేసినా శైలజాకిరణ్‌ నింపాదిగా సమాధానాలు చెప్పారు.

మార్గదర్శి విశ్వసనీయతను దెబ్బతీసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ క్రమంలో చిట్‌ఫండ్‌కు చెందిన రూ.793.5 కోట్ల విలువైన సొమ్మును ఎటాచ్‌ చేసేందుకు ఇటీవలే జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అయినా చందాదారుల్లో సంస్థపై నమ్మకం ఇసుమంతైనా సడలకపోవడంతో తాజాగా మరోసారి విచారణ పేరుతో పన్నాగానికి తెరలేపింది. చిట్‌ఫండ్‌ సంస్థపై నమోదు చేసిన కేసు దర్యాప్తు పేరిట ఇప్పటికే సంస్థ ఎండీ శైలజాకిరణ్‌ను ఒకసారి విచారించిన సీఐడీ... హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసంలో మంగళవారం మరోసారి విచారణ జరిపింది. ఏపీ సీఐడీ ఎస్పీలు అమిత్‌ బర్దార్‌, హర్షవర్ధన్‌ రాజు, అదనపు ఎస్పీ రవివర్మ, దర్యాప్తు అధికారి రవికుమార్‌ నేతృత్వంలో 20 మంది సభ్యుల బృందం మంగళవారం ఉదయం 10.30 సమయంలో ఆమె నివాసానికి చేరుకుంది.

సీఐడీ అధికారులు తమ వెంట డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులనూ తీసుకొచ్చారు.లోపలికి రాగానే ఈ విషయాన్ని గుర్తించిన మార్గదర్శి సిబ్బంది.. అందుకు అభ్యంతరం తెలిపారు. ఈ కేసుతో డీఆర్‌ఐ అధికారులకు ఏం సంబంధముందని నిలదీశారు. అయితే తమ దర్యాప్తునకు సహకారం కోసమే డీఆర్‌ఐ అధికారులను తీసుకొచ్చామని సీఐడీ అధికారులు వెల్లడించారు. తర్జనభర్జన అనంతరం సీఐడీ అధికారుల అభ్యర్థనను మార్గదర్శి సిబ్బంది అంగీకరించారు. సాయంత్రం దాదాపు 5.45 వరకూ విచారణ కొనసాగింది. సీఐడీ అడిగిన అన్ని ప్రశ్నలకూ శైలజాకిరణ్‌ స్పష్టమైన సమాధానాలిచ్చారు. అనంతరం ఆమె వాంగ్మూలాన్ని దాదాపు మూడు గంటలపాటు సీఐడీ నమోదు చేసింది. 8.45 గంటల సమయంలో సీఐడీ బృందం వెనుదిరిగింది.


విచారణకు సహకరించారు
- రవికుమార్‌, దర్యాప్తు అధికారి

విచారణ అనంతరం శైలజాకిరణ్‌ నివాసం బయట సీఐడీ దర్యాప్తు అధికారి రవికుమార్‌ మీడియాతో మాట్లాడారు. విచారణకు మార్గదర్శి ఎండీ పూర్తిస్థాయిలో సహకరించారని తెలిపారు. ఆమె ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. విచారణ ఇంకా జరగాల్సి ఉందని చెప్పారు. తదుపరి విచారణ తేదీని తర్వాత వెల్లడిస్తామన్నారు.


రోజంతా విషం చిమ్మిన సాక్షి మీడియా

మార్గదర్శి చిట్‌ఫండ్‌ ఎండీ శైలజాకిరణ్‌ విచారణ ఉదంతంపై సాక్షి మీడియా ఏపీ సీఐడీ విచారణను అడ్డుపెట్టుకుని మంగళవారం ఉదయం నుంచి విషం చిమ్ముతూనే ఉంది. సీఐడీ విచారణతో నిమిత్తం లేకుండా తనదైన శైలిలో దుష్ప్రచారం చేసింది. చిట్‌ఫండ్‌ వ్యాపారంపై కనీస అవగాహన లేకుండా అడ్డగోలుగా ఆరోపణలు చేసింది.

* పత్రికా ప్రమాణాలు, విలువలు అంటే ఏమాత్రం సరిపడని సాక్షి.. దర్యాప్తు కొలిక్కి రాకుండానే ‘మార్గదర్శి చిట్‌ఫండ్‌ చందాదారుల నగదు దారి మళ్లింపుపై విచారణ’ అంటూ నిరాధార ఆరోపణలు చేసింది. ‘నిబంధనల ఉల్లంఘనపై ఆధారాలు ముందుంచి ప్రశ్నిస్తున్న సీఐడీ’ అంటూ కట్టుకథలు అల్లింది.

* నిధుల మళ్లింపు అంశమే సీఐడీ విచారణలో ప్రస్తావనకు రాకున్నా రామోజీ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు సీఐడీ గుర్తించిందని అసత్యప్రచారం చేసింది. అంతటితో ఆగకుండా ‘రూ.793 కోట్ల ఆస్తుల్ని సీఐడీ ఎటాచ్‌ చేసింది. మిగిలిన నగదు అంతా ఎక్కడ దాచారు..? ఏయే కంపెనీలకు దారి మళ్లించారు..?’ అంటూ విచారిస్తున్నారని అడ్డగోలుతనం ప్రదర్శించింది. విదేశీ పెట్టుబడుల నేపథ్యంలోనూ శైలజాకిరణ్‌ను ప్రశ్నిస్తున్నట్లు ప్రసారం చేసి దుర్బుద్ధిని బయటపెట్టుకుంది.

* 60 ఏళ్లకు పైగా పటిష్ఠ ఆర్థిక భద్రతతో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థ నేడు చందాదారులకు డబ్బు చెల్లింపులు చేసే స్థితిలో లేదని అన్యాయమైన, అసత్య ఆరోపణలు గుప్పించిన సాక్షి... కళ్లున్న కబోది. చందాదారుల నుంచి వసూలు చేసిన వాయిదాలను చిట్‌ పాడుకున్న చందాదారులకు క్రమం తప్పకుండా చెల్లించడంలో మార్గదర్శిది తిరుగులేని ఆర్థిక క్రమశిక్షణ అన్న విషయాన్ని కావాలనే విస్మరించింది. చందాదారులను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా ఆ మీడియా విషం కక్కింది.

* ‘శైలజాకిరణ్‌ పూర్తిస్థాయిలో విచారణకు సహకరించారు.. అన్ని ప్రశ్నలకూ సంతృప్తికర సమాధానాలిచ్చారు’ అని విచారణ అనంతరం దర్యాప్తు అధికారి రవికుమార్‌ స్వయంగా మీడియాకు వెల్లడించినా... ‘శైలజాకిరణ్‌ సీఐడీ అధికారులకు సహకరించనట్లుగా తెలుస్తోంది’ అంటూ అసత్య ప్రచారం చేసింది.

* ‘ఉదయం 10.30 నుంచి దాదాపు 5 గంటలకు పైగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు..’ అంటూ వాస్తవ విరుద్ధ అంశాలతో సాక్షి మీడియా యథావిధిగా దుర్బుద్ధి చాటుకుంది. చిట్‌ఫండ్‌ నిర్వహణపై కనీస అవగాహన కూడా లేకుండా నోటికొచ్చినట్లు ఆరోపణలు చేసింది.

* ఒకవైపు ఎండీ శైలజాకిరణ్‌ స్టేట్‌మెంటును నమోదుచేస్తూ ఉంటే ఆమె నివాసంలో సీఐడీ సోదాలు జరుగుతున్నట్లు సాక్షి మీడియా బరితెగించి దుష్ప్రచారానికి ఒడిగట్టింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని