‘ఎనీవేర్‌’ రిజిస్ట్రేషన్‌ విధానం అమల్లో సవాళ్లు!

ఇతర ప్రాంతాల ఆస్తి వివరాలను సంబంధిత సబ్‌-రిజిస్ట్రార్లతో సంప్రదించకుండా ఆన్‌లైన్‌లోనే నిర్థారించుకుని రిజిస్ట్రేషన్‌ను చేసే ఎనీవేర్‌ విధానం అమలు సందిగ్ధంలో పడింది.

Updated : 07 Jun 2023 04:36 IST

ఆన్‌లైన్‌లో సాంకేతికంగా జరగని మార్పులు
పూర్వ పద్ధతిలోనే కొనసాగుతున్న రిజిస్ట్రేషన్‌లు

ఈనాడు-అమరావతి: ఇతర ప్రాంతాల ఆస్తి వివరాలను సంబంధిత సబ్‌-రిజిస్ట్రార్లతో సంప్రదించకుండా ఆన్‌లైన్‌లోనే నిర్థారించుకుని రిజిస్ట్రేషన్‌ను చేసే ఎనీవేర్‌ విధానం అమలు సందిగ్ధంలో పడింది. దీని అమల్లో నెలకొన్న ఇబ్బందులు దృష్ట్యా మరోమారు రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ పునఃపరిశీలన చేస్తోంది. కొత్త విధానానికి తగ్గట్లుగా ఆన్‌లైన్‌లో ఇప్పటివరకు మార్పులు జరగలేదు. కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నందున పునఃపరిశీలన చేయాల్సిందేనని పలువురు సబ్‌-రిజిస్ట్రార్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో జూన్‌ 1 నుంచి ఎనీవేర్‌ విధానం ఇంకా అమల్లోకి రాలేదు.

ఇవీ సమస్యలు:

* వ్యవసాయ భూముల్లో స్థిరాస్తి వెంచర్లు వేసి ప్లాట్లుగా విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇతరచోట్ల విక్రయాలు జరిగితే...అవి ప్లాట్లా? వ్యవసాయ భూమా? అనేది తెలియడం లేదు. దీని వల్ల మార్కెట్‌ విలువల ఖరారులో ఇబ్బందులు వస్తున్నాయి.

* కొన్ని స్థలాలు, భూములను కోర్టు ఆదేశాల (అటాచ్‌మెంట్‌) మేరకు చేయాలి. ఈ సమాచారం సంబంధిత సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి మాత్రమే వెళుతుంది. దీనిని వెంటనే సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోతే సమస్యలు వస్తాయి. ఈ సమాచారం లోపంతో కొత్త విధానంలో వెంటనే వాటి రిజిస్ట్రేషన్‌ జరిగే ప్రమాదం ఉంది.

* పూర్వార్జితాల డాక్యుమెంట్‌లో ఒకప్పుడు ఖాళీ స్థలంగా ఉన్నా.. కాలక్రమంలో అక్కడ నిర్మాణాలు వెలుస్తున్నాయి. దీనిని ఖాళీ స్థలంగా చూపించి రిజిస్ట్రేషన్‌ చేయిస్తే కొనుగోలుదారులు భవిష్యత్తులో నష్టపోయే ప్రమాదం ఉంది. నిర్మాణ ఇంటికి.. ఖాళీ స్థలానికి వసూలు చేసే స్టాంపు డ్యూటీలో వ్యత్యాసం ఉంటుంది.

* ఆస్తి రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన దస్తావేజులో తేడాలు ఉన్నట్లు అనుమానం వస్తే సబ్‌రిజిస్ట్రార్లు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలిస్తారు. చుట్టుపక్కల వారిని విచారిస్తారు. అలాగే నకిలీ దస్తావేజులతో తప్పుగా జరిగే రిజిస్ట్రేషన్‌లను అడ్డుకోవడం కష్టం. ఈ సమస్యల పరిష్కారంపై స్పష్టత రావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు