డోలాయమానంలో డిగ్రీ చదువు

డిగ్రీ ప్రవేశాలలో ఉన్నత విద్యామండలి జాప్యం చేస్తోంది. ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలై 40 రోజులు దాటినా ప్రవేశాల ప్రకటన విడుదల కాలేదు.

Updated : 07 Jun 2023 05:14 IST

ప్రవేశాల కౌన్సెలింగ్‌లో తీవ్ర జాప్యం

ఈనాడు, అమరావతి: డిగ్రీ ప్రవేశాలలో ఉన్నత విద్యామండలి జాప్యం చేస్తోంది. ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదలై 40 రోజులు దాటినా ప్రవేశాల ప్రకటన విడుదల కాలేదు. తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్‌ కొనసాగుతుండగా.. ఇక్కడ నోటిఫికేషన్‌ ఎప్పుడన్న దానిపైనే ఇంతవరకూ స్పష్టత లేదు. గతేడాది సైతం డిగ్రీ ప్రవేశాల్లో తీవ్ర జాప్యం చేశారు. గతేడాది నవంబరు చివరి వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఈసారి తొందరగా ప్రవేశాలు చేపట్టాలని కళాశాలల యాజమాన్యాలు వినతులు ఇస్తున్నా పట్టించుకోవట్లేదు. ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ ప్రవేశాలు పూర్తయ్యాక సాధారణ డిగ్రీ ప్రవేశాలు చేపట్టాలని భావించడంతో జాప్యం కొనసాగుతోంది. సాధారణ డిగ్రీలో చేరాలనుకునేవారికి ముందుగా ప్రవేశాలు నిర్వహిస్తే తరగతులు ప్రారంభమవుతాయి. కౌన్సెలింగ్‌ ఆలస్యం కావడంతో గతేడాది వేసవి సెలవులు ఇవ్వలేదు. మరోపక్క విద్యార్థుల చేరికలు తగ్గిపోయాయి. కానీ, ఉన్నత విద్యామండలి మాత్రం మౌనం వీడట్లేదు. కౌన్సెలింగ్‌ జాప్యంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు తాము ప్రత్యేకంగా కౌన్సెలింగ్‌ చేసుకుంటామని కోరుతున్నాయి. ప్రవేశాల్లో జాప్యం జరిగితే విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు, డీమ్డ్‌, ప్రైవేటు వర్సిటీలకు వెళ్లిపోతున్నారని అధ్యాపకులు చెబుతున్నారు. గతేడాది డిగ్రీలో 3,46,777 సీట్లు ఉంటే 1,42,478 మాత్రమే భర్తీ అయ్యాయి.

సింగిల్‌ సబ్జెక్టు సిలబస్‌ ఎక్కడ?

2023-24 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానం తీసుకొస్తున్నారు. దీని సిలబస్‌ను ఉన్నత విద్యామండలి ఇంకా ఆన్‌లైన్‌లో పెట్టలేదు. కొత్త విధానం, సిలబస్‌తో పాఠాలు చెప్పేందుకు అధ్యాపకులు సన్నద్ధం కావాలి, విద్యార్థులకూ అవగాహన రావాలి. ఉన్నత విద్యామండలి మొదటి సెమిస్టర్‌ వరకు ప్రత్యేకంగా సిలబస్‌ను సిద్ధం చేసింది. రెండో సెమిస్టర్‌ కోసం కసరత్తు చేస్తోంది. దీంతో సిలబస్‌ను ఆన్‌లైన్‌లో పెట్టడంలో జాప్యం చేస్తోంది.

* ఇప్పటివరకూ భాష సబ్జెక్టులు డిగ్రీలో మూడు సెమిస్టర్లలో ఉండగా.. సింగిల్‌ సబ్జెక్టు విధానంలో మొదటి ఏడాది మాత్రమే ఉంటాయి. తర్వాత సింగిల్‌ మేజర్‌, మైనర్‌ సబ్జెక్టులే ప్రధానంగా ఉంటాయి.

* కొత్త విధానానికి ఏడాది ముందునుంచే కసరత్తు చేస్తే సకాలంలో సిలబస్‌ విడుదల చేయొచ్చు. హడావుడిగా నిర్ణయాలు తీసుకోవడం, తక్కువ సమయంలో సిలబస్‌ రూపొందించాల్సి రావడంతో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రవేశాలు అయ్యేసరికి సిలబస్‌ అందిస్తే సరిపోతుందనే ఉద్దేశంతో ఉన్నత విద్యామండలి ఉంది. కానీ, కొత్త సిలబస్‌పై అధ్యాపకులకు అనేక సందేహాలు ఏర్పడతాయి. వాటిపై అభ్యంతరాలు తెలిపేందుకు సమయం ఉండాలని కోరుతున్నారు.

* 54 సింగిల్‌ మేజర్‌, 53 మైనర్‌ సబ్జెక్టుల్లో అవకాశం కల్పిస్తామని ఉన్నత విద్యామండలి ఇప్పటికే ప్రకటించింది. ఈ సబ్జెక్టులకు అర్హత కలిగిన అధ్యాపకులు ప్రైవేటులో ఉన్నారా దానిపై ఎవరూ దృష్టిపెట్టడం లేదు. కోర్సులను ప్రవేశపెట్టినా.. అర్హులైన అధ్యాపకులు లేకపోతే విద్యార్థులకు నైపుణ్యాలు అలవడవు.

* ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకుల కొరత వల్ల పరిమితంగానే మేజర్‌, మైనర్‌ సబ్జెక్టులను ప్రవేశపెడుతున్నారు. పూర్తిస్థాయిలో అన్ని సబ్జెక్టులూ పెడితే అధ్యాపకులను సర్దుబాటు చేయడం కష్టమవుతుంది. ప్రైవేటులో మాత్రం డిమాండు ఉన్న సబ్జెక్టులను ప్రవేశపెడుతున్నారు. ఇక్కడ అర్హులైన అధ్యాపకులు ఉన్నారా.. లేదా అని తనిఖీ చేసే వ్యవస్థ లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని