సంక్షిప్త వార్తలు (5)

అరకొరగా ప్రకటించిన రాయితీలు.. ఉద్యోగుల్లో ఆగ్రహాన్ని చల్లార్చలేవని, ప్రభుత్వం వారిని దగా చేసిందని ఏపీ పంచాయతీరాజ్‌ డిప్లమో ఇంజినీర్ల సంఘం సలహాదారు హనుమంతరావు మండిపడ్డారు.

Updated : 08 Jun 2023 05:17 IST

‘ఉద్యోగులను దగా చేసిన ప్రభుత్వం’

ఈనాడు, అమరావతి: అరకొరగా ప్రకటించిన రాయితీలు.. ఉద్యోగుల్లో ఆగ్రహాన్ని చల్లార్చలేవని, ప్రభుత్వం వారిని దగా చేసిందని ఏపీ పంచాయతీరాజ్‌ డిప్లమో ఇంజినీర్ల సంఘం సలహాదారు హనుమంతరావు మండిపడ్డారు. ఐఆర్‌ ఇవ్వకుండా పీఆర్సీని నియమించడం పెద్ద మోసమని బుధవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ‘2014 జూన్‌ 2 నాటికి అయిదేళ్లు పూర్తయిన కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులరైజ్‌ చేయాలనడం అనేకమంది జీవితాలను ఛిద్రం చేయడమే. 1/3 వంతు కాంట్రాక్టు ఉద్యోగులకే న్యాయం జరగనుంది. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల ఊసే లేదు. 11వ పీఆర్సీ బకాయిలు నాలుగేళ్లలో 16 వాయిదాల్లో ఇవ్వడం ఎక్కడా లేదు. జీపీఎస్‌తో ఉద్యోగులకు జీవిత భద్రత ఉండదు. ప్రభుత్వానికి దాసోహం అన్న ఉద్యోగ సంఘాల నాయకులు చరిత్రహీనులుగా మిగిలిపోతారు ఉద్యోగులను మోసం చేసిన జగన్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి’ అని హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.


నేడు గుంటూరులో ఏపీ జేఏసీ ప్రాంతీయ సదస్సు

గుంటూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: ఏపీ జేఏసీ అమరావతి చేపడుతున్న మూడో దశ ఉద్యమ ప్రణాళికలో భాగంగా నాలుగో ప్రాంతీయ సదస్సు గుంటూరు రెవెన్యూ కల్యాణ మండపంలో గురువారం నిర్వహించనున్నామని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా ఛైర్మన్‌ కనపర్తి సంగీతరావు, ప్రధాన కార్యదర్శి పి.ఎ.కిరణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే మూడు ప్రాంతీయ సదస్సులను నిర్వహించామన్నారు. గురువారం ఉదయం 8.30 గంటలకు గుంటూరులోని నగరంపాలెం నుంచి ప్రదర్శన ప్రారంభమై రెవెన్యూ కల్యాణ మండపానికి చేరుకుంటుందన్నారు. 9.30 గంటలకు సభ ప్రారంభమవుతుందని తెలిపారు.


50% పింఛను, డీఏ ఇవ్వడం సంతోషం: ఏపీ ఎన్జీవో

ఈనాడు, అమరావతి :ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఏపీ వైద్య విధానపరిషత్‌ ఉద్యోగులకు 010 పద్దు కింద జీతాల చెల్లింపు, జీపీఎస్‌ అమలు తదితర అంశాలకు కేబినెట్‌లో ఆమోదం తెలిపినందుకు ఏపీ ఎన్జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, శివారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 50% పింఛను, డీఏ ఇవ్వడం సంతోషమే కాని ఉద్యోగి నుంచి కాంట్రిబ్యూషన్‌ లేకుండా చేయాలని కోరారు. పీఆర్సీ, డీఏ బకాయిలను వాయిదాల్లో చెల్లించేందుకు జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించినందుకు ధన్యవాదాలు తెలిపారు.


డీఈఈసెట్‌ 12న

ఈనాడు, అమరావతి: డీఈఎల్‌ఈడీ(డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌) కోర్సులో ప్రవేశాలకు డీఈఈసెట్‌ను ఈనెల 12న నిర్వహించనున్నట్లు కన్వీనర్‌ మేరీ చంద్రిక తెలిపారు. హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు.


రేబిస్‌ వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలి: కృష్ణబాబు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కుక్కల స్వైర విహారం ఎక్కువవుతున్నందున రేబిస్‌ వ్యాధి సోకకుండా హైరిస్క్‌ గ్రూపులో ఉన్న వారికి వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలని రాష్ట్ర జునోసిస్‌(జంతువులు, మనుషుల మధ్య సంక్రమించే వ్యాధులు) కమిటీ నిర్ణయించింది. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు అధ్యక్షతన వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలో బుధవారం జునోసిస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. కృష్ణబాబు మాట్లాడుతూ ‘మున్సిపల్‌ కార్మికులు, వెటర్నరీ సిబ్బంది, ఇతర హైరిస్క్‌ జాబితాలో ఉన్న వారికి రేబిస్‌ వ్యాక్సిన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టాలి.  ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రేబిస్‌ నిరోధక టీకాలు అందుబాటులో ఉంచాలి. పశువుల ఆసుపత్రుల్లో శునకాలకు వేసే వ్యాక్సిన్లు కూడా సిద్ధం చేయాలి. జునోటిక్‌ వ్యాధుల బారినపడిన వారి జీవనశైలిపై సిద్ధార్థ వైద్య కళాశాల, ఎన్టీఆర్‌ కాలేజ్‌ ఆఫ్‌ వెటర్నరీ సైన్స్‌స్‌కు చెందిన వైద్య బృందాలు అధ్యయనం చేయాలి. లెఫ్టోస్పిరోసిస్‌ వంటి వ్యాధుల ప్రభావంపై అధ్యయనం జరగాలి’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని