ఒప్పంద ఉద్యోగులకు వెన్నుపోటు

‘సీపీఎస్‌ రద్దు చేస్తాం. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తాం.. ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేస్తాం.. పొరుగుసేవల సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి న్యాయం చేస్తాం’ అంటూ ఎన్నికల ముందు ప్రతి సభలోనూ జగన్‌ హామీలతో ఊదరగొట్టారు.

Published : 08 Jun 2023 05:12 IST

క్రమబద్ధీకరణకు 2014 జూన్‌ 2  నాటికి అయిదేళ్ల సర్వీసు నిబంధన
అర్హత కోల్పోయిన వేల మంది ఉద్యోగులు
ఎన్నికల ముందు అందరికీ అని  ఊదరగొట్టి.. ఇప్పుడు కోతలు

ఈనాడు, అమరావతి: ‘సీపీఎస్‌ రద్దు చేస్తాం. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తాం.. ప్రభుత్వ శాఖల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల అర్హత, సర్వీసును పరిగణనలోకి తీసుకుని వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేస్తాం.. పొరుగుసేవల సిబ్బందికి సమాన పనికి సమాన వేతనం ఇచ్చి న్యాయం చేస్తాం’ అంటూ ఎన్నికల ముందు ప్రతి సభలోనూ జగన్‌ హామీలతో ఊదరగొట్టారు. మాట తప్పను.. మడమ తిప్పనంటూ చెప్పిన జగన్‌ ఇప్పుడు ఉద్యోగులను మోసం చేశారు. కాంట్రాక్టు, పొరుగుసేవల ఉద్యోగులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారు. ఉద్యోగుల అర్హత, సర్వీసు ఆధారంగా వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పి, ఇప్పుడు అతి తక్కువ మందిని క్రమబద్ధీకరించేలా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు జగన్‌ మాట నమ్మిన వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఇప్పుడు ఆందోళనకు గురయ్యే పరిస్థితి ఏర్పడింది. పొరుగునున్న తెలంగాణ ప్రభుత్వం 2014 జూన్‌ 2నాటికి ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తే.. రాష్ట్రంలో మాత్రం 2014 జూన్‌ 2నాటికి అయిదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారినే క్రమబద్ధీకరిస్తామనే నిబంధన పెట్టింది. దీంతో వేల మంది ఉద్యోగులు అర్హత కోల్పోయారు. 2009 జులై నుంచి డిసెంబరు వరకు చేరినవారు కూడా అనర్హులవుతున్నారు. ఎన్నికల ముందు ఎలాంటి నిబంధనలు చెప్పని జగన్‌ ఇప్పుడు కోతలు వేస్తున్నారని కాంట్రాక్టు ఉద్యోగులు మండిపడుతున్నారు. రెగ్యులర్‌ అవుతుందని ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నామని, కమిటీల పేరుతో కాలయాపన చేసి నాలుగేళ్ల తర్వాత కొందరికే అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీ నెరవేర్చామంటూనే క్రమబద్ధీకరించే ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించేసిందని వాపోతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం మొత్తం కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వారందరికీ నిరాశే

ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు విధించిన నిబంధనలతో ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీలు, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న  మరో 50 వేల మంది ఒప్పంద ఉద్యోగులకు నిరాశే మిగిలింది.

* విద్యా శాఖలోని 2 వేల మంది ఒప్పంద అధ్యాపకులు, 800 మంది సీఆర్‌టీలు క్రమబద్ధీకరణ అవకాశం కోల్పోయారు.

* పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 316 మంది ఒప్పంద అధ్యాపకులు ఉంటే వీరిలో 110 మంది మాత్రమే రెగ్యులరైజ్‌ అయ్యే అవకాశం ఉంది.

* ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలల్లో పని చేస్తున్న చాలా మంది క్రమబద్ధీకరణ పరిధిలోకి రావడం లేదు. చాలా విభాగాల్లో ఇదే దుస్థితి నెలకొంది. 

పొరుగుసేవల సిబ్బందికీ మొండిచెయ్యే

మరోవైపు పొరుగుసేవల సిబ్బందికి సమాన పనికి సమాన వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్‌ దాన్నీ అమలు చేయడం లేదు. ఈ హామీ నెరవేర్చాలని ఉద్యోగులు ఎన్ని వినతులిచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పీఆర్సీలో 32 శాతం జీతాలు పెంచమని చెప్పినా చేతులెత్తేసింది. పెరిగిన ధరల ప్రకారం వేతనాలివ్వాలని కోరుతున్నా వేతనాలు పెంచేందుకు ప్రభుత్వానికి చేతులు రావడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని