ఇంటర్‌లోనూ బైజూస్‌ కంటెంట్‌

ఇంటర్మీడియట్‌లోనూ బైజూస్‌ కంటెంట్‌ ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని, తర్వాత దశలో ట్యాబ్‌ల పంపిణీకి కూడా సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి  జగన్‌ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.

Updated : 09 Jun 2023 06:06 IST

ట్యాబ్‌ల పంపిణీకి సన్నద్ధం కావాలి
విద్యాశాఖ సమీక్షలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌లోనూ బైజూస్‌ కంటెంట్‌ ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలని, తర్వాత దశలో ట్యాబ్‌ల పంపిణీకి కూడా సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి  జగన్‌ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి ప్రతీ మండలంలోనూ రెండు జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. ఇందులో ఒకటి బాలికలకు, రెండోది కో-ఎడ్యుకేషన్‌ ఉండాలన్నారు. నాడు-నేడు పథకం కింద అదనపు తరగతి గదులను నిర్మించాలని సూచించారు. అవసరమైన సిబ్బందిని కూడా నియమించాలన్నారు. గురువారం సీఎం క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మొదటి దశ నాడు-నేడు పూర్తి చేసుకున్న పాఠశాలల్లో ఆరు ఆపై తరగతుల్లో ఐఎఫ్‌పీ ప్యానళ్ల వినియోగంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలన్నారు. నాడు-నేడు కింద పనులు పూర్తయిన పాఠశాల్లో ఐఎఫ్‌పీ ప్యానళ్ల ఏర్పాటు.. ట్యాబ్‌ల పంపిణీతోపాటు 100శాతం స్థూల ప్రవేశ నిష్పత్తి సాధించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డ్రాపవుట్స్‌ను తగ్గించేందుకు సచివాలయాలు, వాలంటీర్ల సహకారం తీసుకోనున్నట్టు అధికారులు సీఎంకు చెప్పారు. ‘గోరుముద్ద, ఎస్‌ఎంఎఫ్‌, టీఎంఎఫ్‌లపై నిరంతరం ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటూ దాని ఆధారంగా చర్యలు తీసుకోవాలని.. మూడోపార్టీ పరిశీలన చేపట్టాలని సీఎం సూచించారు. సుమారు 45 వేల పాఠశాలల్లో ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకోగా..ఏపీ ఫైబర్‌నెట్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ద్వారా సెప్టెంబరు నెలాఖరునాటికి అన్ని పాఠశాలలకూ ఇంటర్‌నెట్‌ సదుపాయం కల్పించనున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. నాడు-నేడు రెండోదశ పనుల కోసం ఇప్పటివరకూ రూ.3,287.08 కోట్లు ఖర్చు చేశామని, 22,224 పాఠశాలల్లో చేపడుతున్న ఈ పనులు డిసెంబరు నాటికి పూర్తవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 2023-24 విద్యా క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించారు. జూన్‌ 12 నుంచి రాష్ట్రంలోని పాఠశాలలు తెరుచుకుంటాయి.

జూన్‌ 20న రాష్ట్రస్థాయి బహుమతులు

2023లో పది, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇవ్వనున్న ‘జగనన్న ఆణిముత్యాలు’ పురస్కారాలకు సంబంధించిన పతకాలను ముఖ్యమంత్రి పరిశీలించారు. జూన్‌ 20న రాష్ట్రస్థాయి అవార్డులను ముఖ్యమంత్రి అందజేస్తారు. అంతకుముందు జూన్‌ 15న నియోజకవర్గ స్థాయిలో, 17న జిల్లా స్థాయిలో అవార్డులను అందజేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని