వివేకా హత్య కేసులో ఏ8 అవినాష్‌రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చింది. ఇప్పటికే అరెస్ట్‌ చేసిన వైఎస్‌ భాస్కరరెడ్డిని 7వ నిందితుడిగా పేర్కొంది.

Updated : 09 Jun 2023 06:53 IST

7వ నిందితుడిగా భాస్కరరెడ్డి
వీరిద్దరి సూచనలతోనే కుట్ర అమలు
దర్యాప్తును పక్కదారి పట్టించే యత్నం
ఆ రోజు ఉదయం 6.30కు ముందే వివేకా హత్య విషయం జగన్‌కు తెలుసు
సీబీఐ కౌంటరులో కీలక విషయాల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని 8వ నిందితుడిగా చేర్చింది. ఇప్పటికే అరెస్ట్‌ చేసిన వైఎస్‌ భాస్కరరెడ్డిని 7వ నిందితుడిగా పేర్కొంది. భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్‌లో సీబీఐ దాఖలు చేసిన కౌంటరులో ఈ మేరకు వెల్లడించింది. మౌఖిక, పత్ర సహిత, శాస్త్రీయ, వైద్యపరమైన ఆధారాల ప్రకారం.. గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలు హత్య పథకాన్ని అమలు చేయగా, సాక్ష్యాలను ధ్వంసం చేసి వివేకా గుండెపోటుతో మృతి చెందారని నమ్మించడంలో ప్రతిపాదిత నిందితులైన భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి, నిందితులు శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలు కలిసి కుట్రను ముందుకు తీసుకెళ్లారని సీబీఐ కోర్టుకు నివేదించింది. వివేకా హత్య వెనుక భాస్కరరెడ్డి, ఆయన కుమారుడు అవినాష్‌రెడ్డిల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపింది. వివేకా మరణ వార్తను వ్యక్తిగత సహాయకుడు ఎం.వి.కృష్ణారెడ్డి ఉదయం 6.15 గంటలకు వెల్లడించక ముందే ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలుసని మరోసారి స్పష్టం చేసింది.

భాస్కరరెడ్డి.. సహ నిందితులతో కలిసి కుట్రలో, సాక్ష్యాల ధ్వంసంలో పాల్గొన్నారని వెల్లడించింది. ఆయన కడప జిల్లాలో ప్రత్యేకించి పులివెందులలో సాక్షులను ప్రభావితం చేయగలరని పేర్కొంది. ఇతర నిందితులతో కలిసి దర్యాప్తును పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు చేయడం, సాక్షులను బెదిరించారనడానికి ఎన్నో ఉదంతాలున్నాయని వెల్లడించింది. అరెస్ట్‌ సమయంలో కడప ప్రాంతంలో జరిగిన నిరసన ప్రదర్శనలే ఆయనకు ఉన్న పలుకుబడి గురించి చెబుతాయంది. సాక్షులపై ఆయన ఉనికే ప్రభావం చూపగలదని, ఈ దశలో బెయిలు మంజూరు చేస్తే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇవే ఆరోపణలున్న శివశంకర్‌రెడ్డి దాఖలు చేసిన బెయిలును సుప్రీంకోర్టు కొట్టివేసిందని తెలిపింది. షరతులతో బెయిలు మంజూరు చేసినా ఫలితం లేదని, సాక్షులను ప్రభావితం చేసినా, ఆధారాలను తారుమారు చేసినా దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. విచారణలో భాస్కరరెడ్డి సహకరించలేదని, ఏప్రిల్‌ 16 నుంచి జైల్లో ఉన్నంత మాత్రాన ఆయనకు బెయిలు మంజూరు చేయాలనడం సరికాదంది. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్‌ను కొట్టివేయాలని కోరింది.

బెయిల్‌ను వ్యతిరేకించిన సునీత

వైఎస్‌ భాస్కరరెడ్డికి బెయిలు మంజూరు చేయరాదని సునీత కోరారు. వివేకా హత్య కేసు దర్యాప్తు ఇంకా జరుగుతోందని, ఈ దశలో బెయిలు ఇస్తే సాక్షులను, దర్యాప్తును ప్రభావితం చేస్తారన్నారు. కుట్రలో భాస్కరరెడ్డి ప్రమేయం ఉందని పలువురు ఇచ్చిన వాంగ్మూలాలను తన రాతపూర్వక వాదనల్లో పేర్కొన్నారు.

నేడు బెయిలు పిటిషన్‌పై తీర్పు

వివేకా హత్య కేసులో నిందితులైన భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ గురువారం సీబీఐ కోర్టులో హాజరుపరచింది. కోర్టు వీరి రిమాండ్‌ను ఈ నెల 16 వరకు పొడిగించింది. మరోవైపు భాస్కరరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది.


కౌంటరులో సీబీఐ పేర్కొన్న ప్రధాన అంశాలు

* వైఎస్‌ భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి తదితరులు కుట్రలో పాల్గొనడంతోపాటు సంఘటనా స్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేశారని దర్యాప్తులో తేలింది. దర్యాప్తును పక్కదోవ పట్టించడానికి నిందితులు లేదా వారి అనుచరులు సాక్షులను ప్రభావితం చేయడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారని తేలింది.

* వివేకా మరణవార్త బయటికి పొక్కక ముందే భాస్కరరెడ్డి, అవినాష్‌రెడ్డి ఇంటి వద్ద ఉదయ్‌కుమార్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలు ఉన్నారు. మూడో వ్యక్తి నుంచి సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి సాక్ష్యాలను ధ్వంసం చేయాలని ఎదురు చూశారు. అవినాష్‌రెడ్డి, శంకర్‌రెడ్డిలతో మాట్లాడానని, సాక్ష్యాల ధ్వంసం గురించి  వారు చూసుకుంటారని గంగిరెడ్డి వేకువజామున 5.30 గంటల ప్రాంతంలో సహనిందితులకు వెల్లడించారు. సంఘటనా స్థలంలో సాక్ష్యాల ధ్వంసం.. కుట్రలో అంతర్భాగమే.

* ఎన్‌.శివప్రకాశ్‌రెడ్డి ఉదయం 6.26కు అవినాష్‌రెడ్డికి ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వడంతో ఆయన శివశంకర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి, అనుచరులతో కలిసి రెండు, మూడు వాహనాల్లో వివేకా ఇంటికి బయలుదేరారు. గూగుల్‌ టేకౌట్‌ డేటా ప్రకారం ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉదయం 6 గంటలకే అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి 6.25కు అవినాష్‌ ఇంట్లో ఉండగా 6.27కు వివేకా ఇంటి బయట, 6.29 నుంచి 6.31 మధ్య ఇంటిలో ఉన్నట్లు తేలింది. 6.26కు అవినాష్‌రెడ్డికి సమాచారం అందగా నిముషంలోనే వివేకా ఇంటికి చేరుకున్నారు. ఇదే విషయం దస్తగిరి వాంగ్మూలంలో వెల్లడైంది.

* అవినాష్‌రెడ్డి ఇతరులతో చర్చించిన తరువాత సీఐ శంకరయ్యకు ఫోన్‌లో వివేకా మరణవార్తను చెప్పి, బందోబస్తుకు పోలీసులను పంపాలని కోరారు. వివేకా గుండెపోటుతో మృతి చెందినట్లు ప్రకటించడం కుట్రలో భాగమే. కేసు నమోదు చేయవద్దని, పోస్టుమార్టం కూడా అవసరం లేదని సీఐకి తొలుత చెప్పారు. సంఘటనా స్థలానికి పలువురు చేరుకున్నా లోపల గడియ వేసి భాస్కరరెడ్డి కొంత మందిని మాత్రమే అనుమతించారు.

*  కేసును సీబీఐకి అప్పగించిన తరువాత సునీల్‌యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలతో భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డిలను ఈశ్వరయ్య గార్డెన్‌లో కలిశామని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. సీబీఐకి కేసు అప్పగించారని ఇప్పుడు తమ పరిస్థితి ఏంటని అడిగితే ఏ సమస్యా ఉండదని, అన్నీ తామే చూసుకుంటామని, ఏమైనా డబ్బు అవసరమైతే అడగాలని వారు చెప్పినట్లు దస్తగిరి వాంగ్మూలమిచ్చారు.

* అప్రూవర్‌గా మారిన దస్తగిరిని సీబీఐకి, కోర్టుకు వాస్తవాలు చెప్పకుండా ప్రభావితం చేయడానికి.. భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డిలు భరత్‌యాదవ్‌, న్యాయవాది ఓబుల్‌రెడ్డిల ద్వారా ప్రయత్నించారు. వివేకా రక్తపు మడుగులో ఉన్న విషయాన్ని దాచిపెట్టి ఫిర్యాదు ఎలా ఇవ్వాలో ఎం.వి.కృష్ణారెడ్డికి చెప్పి శివశంకర్‌రెడ్డి పోలీసుస్టేషన్‌ నుంచి వెళ్లిపోయారు.

* కడప ఎస్పీ సమాచారం మేరకు.. భాస్కరరెడ్డిపై గతంలో పేలుడు పదార్థాల చట్టం సహా మూడు వేర్వేరు పోలీసు కేసులు ఉండగా, వాటిలో రెండింట్లో ఆయన నిర్దోషిగా బయటపడ్డారు. మరొకటి తప్పుడు కేసుగా తేలింది. అనుమానాస్పద పూర్వాపరాలున్న భాస్కరరెడ్డితోపాటు అవినాష్‌రెడ్డికి ఇతర నిందితులతో కలిసి వివేకా హత్య కుట్రలో ప్రమేయం ఉందని తెలుస్తోంది.

* ఎంపీ టికెట్‌ను తనకు కాకుండా షర్మిల, విజయమ్మలకు ఇవ్వాలని వివేకా ప్రయత్నించినందునే అవినాష్‌రెడ్డి తన అనుచరుల ద్వారా ఆయన్ను హత్య చేయించారని అనుమానం ఉన్నట్లు మొదటి అభియోగ పత్రంలోనే వెల్లడించాం. ఈ దిశగా ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. శివశంకర్‌రెడ్డి పాత్ర వెల్లడయ్యాక హత్య, సాక్ష్యాల ధ్వంసం వెనుక కుట్రను రెండో అభియోగపత్రంలో పేర్కొన్నాం.

* కంప్యూటర్‌ నిపుణురాలు దీప్తి వశిష్ఠ వాంగ్మూలం ప్రకారం చూస్తే..  గూగుల్‌ టేకౌట్‌ ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం సునీల్‌యాదవ్‌ 15వ తేదీ తెల్లవారుజామున 1.58కి భాస్కరరెడ్డి ఇంట్లో ఉన్నట్లు తేలింది.  

* దస్తగిరి విషయంలో నిష్పాక్షికంగానే వ్యవహరించాం. కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడం, తరువాత ముందస్తు బెయిలు మంజూరు చేయడంతో దస్తగిరిని అరెస్ట్‌ చేసినా పూచీకత్తులతో విడుదల చేశాం.

* శివశంకర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలు హాల్లోకి వచ్చి వివేకా గుండెపోటుతో చనిపోయినట్లుగా చర్చించడం, ఆయన మృతదేహానికి బ్యాండేజ్‌ కట్టడం అన్నీ దగ్గరుండి చేసినట్లు పనిమనిషి రాగిరి లక్ష్మీదేవి వాంగ్మూలం ద్వారా వెల్లడైంది. తాను గదిలో నుంచి వస్తుండగా అవినాష్‌రెడ్డి సీఐ శంకరయ్యతో కలిసి లోపలికి వెళుతున్నట్లు ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నారు.

* వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి సూచనల మేరకు ఇనయతుల్లా సంఘటనా స్థలాన్ని వీడియో తీశారు. వీడియో తీసినంత మాత్రాన సంఘటనా స్థలాన్ని ధ్వంసం చేయలేదనడం కోర్టును తప్పుదోవ పట్టించడమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని