YS Avinash Reddy: అవినాష్‌రెడ్డి అరెస్ట్‌.. విడుదల

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని సీబీఐ ఇటీవల అరెస్ట్‌ చేసి, రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులను తీసుకొని వెంటనే విడుదల చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 09 Jun 2023 12:27 IST

ఈ నెల 3న సీబీఐ కార్యాలయానికి వచ్చినప్పుడే..
గోప్యంగా ఉంచిన సీబీఐ, అవినాష్‌

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎనిమిదో నిందితుడు, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని సీబీఐ ఇటీవల అరెస్ట్‌ చేసి, రూ.5 లక్షల చొప్పున రెండు పూచీకత్తులను తీసుకొని వెంటనే విడుదల చేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ గత నెల 31న హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు గత శనివారం (3న) సీబీఐ కార్యాలయంలో అవినాష్‌రెడ్డి విచారణకు హాజరైన క్రమంలోనే అరెస్ట్‌, విడుదల జరిగాయి. వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా అవినాష్‌రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసినప్పటి నుంచి నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత విచారణకు హాజరైన అవినాష్‌రెడ్డి.. తండ్రి వైఎస్‌ భాస్కరరెడ్డి అరెస్ట్‌ అనంతరం తననూ అరెస్ట్‌ చేస్తారన్న ఆందోళనతో ఏదో ఒక సాకు చెబుతూ విచారణకు గైర్హాజరవుతూ వచ్చారు. ఇందులో భాగంగానే గత నెల 16 నుంచి విచారణకు హాజరుకాకుండా తల్లి కర్నూలు ఆసుపత్రిలో ఉన్నారంటూ చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో సీబీఐ బృందం కర్నూలు వెళ్లి అరెస్టు చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆసుపత్రి ముందు అవినాష్‌ అనుచరులు పెద్దఎత్తున మోహరించడంతో సీబీఐ స్థానిక ఎస్పీ సాయం కోరింది. శాంతిభద్రతల కారణం చూపుతూ పోలీసులు సాయం చేయడానికి నిరాకరించడంతో సీబీఐ వెనుదిరగాల్సి వచ్చింది. మరోవైపు హైకోర్టుకు వేసవి సెలవులు ఉండటంతో ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారించేలా హైకోర్టును ఆదేశించాలంటూ అవినాష్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేసవి సెలవుల్లో తెలంగాణ హైకోర్టు అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌పై సుదీర్ఘ వాదనలను విని గత నెల 31న తీర్పు వెలువరించింది. షరతులతో కూడిన ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఒకవేళ అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌ చేయాల్సి వస్తే పూచీకత్తులు తీసుకొని వెంటనే విడుదల చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అవినాష్‌రెడ్డి సీబీఐ కార్యాలయానికి విచారణ నిమిత్తం వచ్చినప్పుడు సాంకేతికంగా అరెస్ట్‌ చేసి, పూచీకత్తులు తీసుకుని విడుదల చేసింది. అయితే అరెస్ట్‌, విడుదల విషయాన్ని అటు సీబీఐ గానీ, ఇటు అవినాష్‌రెడ్డి గానీ వెల్లడించకుండా గోప్యత పాటించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి విషయంలోనూ సీబీఐ అధికారులు ఇదే విధానాన్ని అనుసరించారు. దస్తగిరికి న్యాయస్థానం 2021 అక్టోబరు 22న షరతులతో ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ క్రమంలో అక్టోబరు 23న సీబీఐ అధికారులు ఆయన్ను అరెస్ట్‌ చూపి, రూ.20 వేల పూచీకత్తు తీసుకొని వెంటనే విడుదల చేశారు. మరోవైపు అవినాష్‌రెడ్డికి హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలంటూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ జరగాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని