కుట్టుకూలి ఎప్పుడిస్తారో?

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఇస్తున్న ప్రభుత్వం.. వాటి కుట్టుకూలి డబ్బును మాత్రం ఇవ్వడం లేదు.

Published : 09 Jun 2023 05:08 IST

ఏకరూప దుస్తులిచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వం
విద్యార్థులకు గతేడాది బకాయిలు రూ.64 కోట్లు

ఈనాడు, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఇస్తున్న ప్రభుత్వం.. వాటి కుట్టుకూలి డబ్బును మాత్రం ఇవ్వడం లేదు. మూడు జతల దుస్తులు ఇస్తున్నామని చెబుతూ.. కుట్టుకూలి ఎగవేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 2022-23 సంవత్సరానికి 45,14,687 మందికి ఏకరూప దుస్తులు అందజేశారు. వాటిని కుట్టించుకునేందుకు కూలి ఇవ్వాల్సి ఉండగా.. అవి ఇప్పటికీ విద్యార్థులకు అందలేదు. ఇప్పుడు విద్యా కానుక కింద మళ్లీ దుస్తులు ఇవ్వబోతోంది. నిబంధనల ప్రకారం ఏకరూప దుస్తులతో పాటే విద్యార్థులకు కుట్టుకూలి ఇవ్వాలి. 1-8 తరగతులకు జతకు రూ.40 చొప్పున రూ.120, తొమ్మిది, పదో తరగతుల వారికి జతకు రూ.80 చొప్పున రూ.240 చెల్లించాలి. ఈ ఏడాది ఒక్కో జతకు రూ.10 చొప్పున కుట్టుకూలి పెంచుతామని సమగ్ర శిక్ష అభియాన్‌ ప్రకటించింది. పాత డబ్బులే ఇవ్వకుండా ఇప్పుడు పెంపు చేశామని గొప్పలు చెబుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాదికి సంబంధించి మొత్తం రూ.64.56 కోట్ల నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటికోసం విద్యార్థుల తల్లిదండ్రులకు ఎదురుచూపులు తప్పడం లేదు. మరోవైపు ఈ ఏడాది 39,95,992 మందికి ఏకరూప దుస్తులు ఇవ్వబోతున్నారు. వాటిని కుట్టించుకునేందుకు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు సొంత డబ్బునే ఖర్చు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని