చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు

కేరళ భూభాగాన్ని తాకిన అనంతరం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి.

Published : 10 Jun 2023 05:22 IST

మరో మూడు, నాలుగు రోజుల్లో రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలకు

ఈనాడు, విశాఖపట్నం: కేరళ భూభాగాన్ని తాకిన అనంతరం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణశాఖ శుక్రవారం తెలిపింది. రానున్న 24 గంటల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు, బంగాళాఖాతంలోకి విస్తరించే అవకాశం ఉంది. మరో 48 గంటల్లో ఈశాన్య రాష్ట్రాల్లోని మిగిలిన ప్రాంతాలు, పశ్చిమబెంగాల్‌, సిక్కింలోని కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాయి. మరో మూడు, నాలుగు రోజుల్లో అనంతపురం మీదుగా రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాలను తాకనున్నాయి. మరో వైపు ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడింది. ఈ ప్రభావంతో పశ్చిమబెంగాల్‌, ఒడిశా ప్రాంతాల్లో ఓ మోస్తరుగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరో 24 గంటల వరకు ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో వడగాలుల ప్రభావం ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు ఉరుములతో కూడిన జల్లులు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ వడగాలులు వీస్తాయి. వేడి, తేమతో కూడిన అసౌకర్యం కలిగించే వాతావరణం నెలకొంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు 30-40 కి.మీ.ల వేగంతో వీచే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని