కక్షసాధింపు అంటే ఇదీ..!
కక్ష సాధింపు అంటే ఇదీ..! కొందర్నే లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడటం అంటే ఇదీ..! నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటులో లేని స్కాంని ఊహించుకుంటూ, అదే నిజమని ప్రజల్ని నమ్మించేందుకు సీఐడీ ఎంత పసలేని వాదన వినిపిస్తోందో, అది ఎంత లోపభూయిష్టంగా ఉందో... విషయం లోతుల్లోకి వెళితే స్పష్టంగా కళ్లకు కడుతుంది.
లేని స్కిల్ స్కాం నిజమని భ్రమ కలిగించేలా సీఐడీ వాదనలు
ఒకప్పటి ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థేనా అని సర్వత్రా చర్చ
కేసులో ఎక్కడా కనిపించని అధికారుల ప్రస్తావన
లోపభూయిష్టంగా సీఐడీ దర్యాప్తు
ఈనాడు, అమరావతి: కక్ష సాధింపు అంటే ఇదీ..! కొందర్నే లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడటం అంటే ఇదీ..! నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటులో లేని స్కాంని ఊహించుకుంటూ, అదే నిజమని ప్రజల్ని నమ్మించేందుకు సీఐడీ ఎంత పసలేని వాదన వినిపిస్తోందో, అది ఎంత లోపభూయిష్టంగా ఉందో... విషయం లోతుల్లోకి వెళితే స్పష్టంగా కళ్లకు కడుతుంది. సీఐడీ వంటి ఒకప్పటి ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థేనా ఇలాంటి అడ్డగోలు వాదన చేస్తోంది? అన్న అనుమానం కలుగుతుంది. సీఐడీ చెప్పే ఒక మాటకూ మరో మాటకూ పొంతన లేదు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకి సంబంధించిన ప్రతి దశలోనూ హేమాహేమీలైన సీనియర్ అధికారుల పాత్ర, ప్రమేయం ఉన్నా... కేసులో ఎక్కడా వారి ప్రస్తావన లేదు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకి చర్యలు తీసుకోవలసిందిగా ఉన్నత విద్యాశాఖకు నోట్ఫైల్ పంపిందే... అప్పటి ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి గిరిధర్. విధాన, ఆర్థికపరమైన నిర్ణయాల్లో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు సహా అత్యంత సీనియర్ అధికారులు, ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేస్తున్న నీలం సాహ్నీ, ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజేయకల్లం, ప్రస్తుత ప్రభుత్వంలోను కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రేమచంద్రారెడ్డి, పీవీ రమేష్, సునీత వంటి అధికారులు క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రాజెక్టు అమలు పర్యవేక్షణ కమిటీలో ఈ ప్రభుత్వానికి అత్యంత ఇష్టుడైన అజయ్జైన్, ఎస్.ఎస్.రావత్, ఎం.రవిచంద్ర, ఉదయలక్ష్మి ఉన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఎంపిక కమిటీలో అజయ్జైన్, రావత్, ఉదయలక్ష్మి ఉన్నారు. అప్పటి ఆర్థిక శాఖ కార్యదర్శి సునీత స్వయంగా గుజరాత్ వెళ్లి నైపుణ్య కేంద్రాల్ని పరిశీలించి వచ్చారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటులో నిధుల దుర్వినియోగం జరిగినట్టుగా సీఐడీ చేస్తోన్న ప్రచారాన్ని కాసేపు వాస్తవమే అనుకుంటే... మరి ఆ ప్రక్రియలో అత్యంత కీలక భూమిక వహించిన ఈ సీనియర్ అధికారులెవరూ దానికి బాధ్యులవరా? కేవలం ప్రతిపక్ష నాయకులే సీఐడీకి కనిపిస్తారా? వారిపైనే కేసులు పెట్టడమేంటి? అజేయకల్లం, ప్రేమచంద్రారెడ్డి వంటి అధికారుల పేర్లు సీఐడీ ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదు? నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్ని రూ.55 కోట్లతో మొదట పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేయాలని అప్పటి ఆర్థికశాఖ కార్యదర్శి సునీత ఫైల్లో రాశారని... కానీ దాన్ని పెడచెవిన పెట్టి రూ.270 కోట్లు పీడీ ఖాతాకి విడుదల చేశారని సీఐడీ పేర్కొంది. అదే సునీత... గుజరాత్ వెళ్లి సీమెన్స్ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల్ని చూసి వచ్చాక... ‘‘నేను ఎల్డీ కాలేజీలో చూశాను. అక్కడ వ్యవస్థ బాగానే ఉంది. అయితే అక్కడ పెట్టిన యంత్రాలు కొత్తవా, కాలం చెల్లినవా అన్నది నైపుణ్యాభివృద్ధి విభాగం సరిచూసుకోవాలి’’ అని ఫైల్లో రాసిన విషయాన్ని సీఐడీ దాచిపెడుతోంది. సునీత అంతా బాగుందని రాశాకే పీడీ ఖాతాలోని రూ.270 కోట్లను ఆర్థికశాఖ విడుదల చేసింది.
అలాగే... ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటుకి సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ, తర్వాత కేబినెట్ ర్యాటిఫికేషన్ తీసుకునేలా అప్పటి ఉన్నతాధికారులే ప్రతిపాదించారని, ఆ దస్త్రంపై వారందరూ సంతకాలు చేశాకే, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సంతకం చేశారన్న విషయాన్ని సీఐడీ కావాలనే ఎక్కడా ప్రస్తావించడం లేదు. ఆ అంశాన్ని ర్యాటిఫికేషన్కు పెట్టాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదా? ముఖ్యమంత్రిదా? బంట్రోతు నుంచి ఐఏఎస్ అధికారుల వరకు చేయాల్సిన పనులన్నిటికీ ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నది సీఐడీ ఉద్దేశమా? నైపుణ్యాభివృద్ధి శాఖ కార్యదర్శి, ఎపీఎస్ఎస్డీసీ ఎండీ హోదాలో డిజైన్టెక్ సంస్థకు మొత్తం నిధులు విడుదల చేసింది ప్రేమచంద్రారెడ్డి. ఘంటా సుబ్బారావు చేతుల మీదుగా ఒక్క రూపాయీ విడుదల కాలేదు. కానీ ఘంటా సుబ్బారావుపై కేసుపెట్టి అరెస్ట్ చేసిన సీఐడీ... ప్రేమచంద్రారెడ్డిని నిందితుడిగా చేర్చలేదు సరికదా, ఎక్కడా ఆయన పేరు కూడా ప్రస్తావించలేదు.
అధికారుల నిర్ణయాలకు... ముఖ్యమంత్రిదా బాధ్యత?
అధికారులు తీసుకునే నిర్ణయాలకు, ఇచ్చే జీవోలన్నిటికీ ముఖ్యమంత్రి బాధ్యులవుతారా? అన్ని పనులూ ముఖ్యమంత్రే చేస్తే ఇక అఖిలభారత సర్వీసుల అధికారులెందుకు? నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకి సంబంధించిన పరిణామాల్ని గమనిస్తే ఎవరి పాత్రేంటో స్పష్టంగా అర్థమవుతుంది.
- నైపుణ్యాభివృద్ధిపై అప్పటి సీఎస్ ఐ.వై.ఆర్.కృష్ణారావు 2014 జులై 2న మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు. దానిలో మానవ వనరుల అభివృద్ధి, పురపాలక, కార్మిక శాఖల మంత్రులు సభ్యులు. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నీలం సాహ్నీ కన్వీనర్గా ఉన్నారు.
- తెదేపా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఎంప్లాయిమెంట్ కౌన్సెలింగ్, గైడెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం భావిస్తున్నారని, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి గిరిధర్ 2014 జులై 23న ఒక నోట్ పంపారు. అది కార్యరూపం దాల్చకపోవడంతో గిరిధర్ మరో నోట్ పంపారు. దాన్ని ఉన్నత విద్యాశాఖ సర్క్యులేట్ చేసింది. ఏపీఎస్స్డీసీ ఏర్పాటు చేస్తూ, ఎండీ, సీఈఓగా ఘంటా సుబ్బారావుని నియమిస్తూ జారీ చేసిన ముసాయిదా ఉత్తర్వుల్ని ఆమోదం కోసం పంపిస్తున్నామని, తర్వాత దాన్ని కేబినెట్లో పెట్టి అనుమతి తీసుకోవాలని ఆ నోట్లోని 24వ పేరాలో పేర్కొన్నారు. ఆ దస్త్రం ఆర్థికశాఖకు వెళ్లింది. దానికి సూత్రప్రాయ అనుమతి ఇవ్వవచ్చునని అజేయకల్లం అభిప్రాయపడ్డారు. దాన్ని ఐ.వై.ఆర్.కృష్ణారావు ఆమోదించారు. పేరా 24లోని అంశాన్ని ఆమోదించవచ్చని మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి రాశారు. దానిపై అప్పటి సీఎం కూడా సంతకం పెట్టారు.
- అప్పట్లో మానవ వనరుల అభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్నీ ఆ దస్త్రాన్ని ఆర్థికశాఖకు పంపారు. అజేయకల్లం నుంచి అనుమతి వచ్చాక ఆమె 2014 సెప్టెంబరు 10న జీవో నెం.47 జారీ చేశారు. కంపెనీల చట్టంలోని సెక్షన్ 8 కింద లాభాపేక్ష లేని కంపెనీగా ఏపీఎస్ఎస్డీసీని రిజిస్టర్ చేసేందుకు... మెమొరాండం ఆఫ్ ఆసోసియేషన్, ఆర్టికిల్స్ ఆఫ్ అసోసియేషన్లకు ఆమోదం తెలుపుతూ ఆమె జీవో నెం.48 కూడా జారీ చేశారు. ఏపీఎస్ఎస్డీసీని రిజిస్టర్ చేసేందుకు ఖర్చుల నిమిత్తం ఉన్నత విద్యాశాఖకు అజేయకల్లం రూ.11.17 లక్షలు విడుదల చేశారు. దానికి అప్పటి ఆర్థికశాఖ కార్యదర్శిగా ఉన్న ప్రేమచంద్రారెడ్డి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్ఓ) ఇచ్చారు.
- ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు నిర్ణయాన్ని కేబినెట్ ర్యాటిఫై చేయాలని ఉన్నత విద్యాశాఖ, ఆర్థికశాఖలు దస్త్రంలో పేర్కొన్నా... నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసే ముందు, నిధులు విడుదల చేసే ముందు కేబినెట్ ర్యాటిఫికేషన్ తీసుకోలేదు. ఉన్నత విద్య, ఆర్థికశాఖల ముఖ్య కార్యదర్శులుగానీ, ప్రధాన కార్యదర్శిగానీ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. ఏపీఎస్ఎస్డీసీని కంపెనీగా రిజిస్టర్ చేశారు.
- ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటులో నలుగురు సీనియర్ అధికారులు ఐ.వై.ఆర్.కృష్ణారావు, అజేయకల్లం, నీలంసాహ్నీ, ప్రేమచంద్రారెడ్డిల పాత్ర కీలకం. జీవో, నిధులు విడుదల చేయకముందే దానికి కేబినెట్ ర్యాటిఫికేషన్ పొందేలా చూడాల్సింది అధికారులే కదా? అని తెదేపా వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
వాస్తవాల్ని వక్రీకరించి... మాజీ సీఎంపై సీఐడీ అభాండాలు
నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్థికశాఖ అధికారులపై అప్పటి సీఎం ఒత్తిడి తెచ్చారన్నది సీఐడీ ప్రధానంగా చేస్తున్న దుష్ప్రచారం
దానికి అప్పటి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్, సునీత నోట్ఫైల్స్పై రాసిన కొన్ని అంశాల్ని తనకు అనుకూలంగా మలుచుకుని చెబుతోంది. కానీ వారు ఏ సందర్భంలో అలా రాశారో పరిశీలిస్తే సీఐడీ వాదనలోని డొల్లతనం అర్థమవుతుందని కొందరు అధికారులు చెబుతున్నారు.
- ప్రాజెక్టు వ్యయంలో 90 శాతాన్ని సీమెన్స్ సంస్థ గ్రాంట్గా ఇచ్చేలా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10% నిధులు వెచ్చించేలా రూపొందించిన ప్రాజెక్టు ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం 2015 ఫిబ్రవరి 9న ఆమోదం తెలిపింది. దానికి రూ.370.78 కోట్ల బడ్జెట్ విడుదల చేయాలని ఆర్థికశాఖకు నైపుణ్యాభివృద్ధి శాఖ 2015 మార్చి 2న ప్రతిపాదన పంపింది. ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి అజేయకల్లం దానికి ఆమోదం తెలిపారు. ఆ దస్త్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా కార్మిక, ఆర్థికశాఖల మంత్రులకు, అక్కడి నుంచి ముఖ్యమంత్రికి వెళ్లి ఆమోదం పొందింది. ఆ ప్రతిపాదనకు శాసనసభ ఆమోదం తెలిపింది.
- నైపుణ్యాభివృద్ధిశాఖకు రూ.2 కోట్లు, రూ.25 కోట్లు చొప్పున అదనపు బడ్జెట్గా ఆర్థికశాఖ విడుదల చేసింది.
- తొలి విడతలో రూ.270 కోట్ల విడుదలకు సంబంధించిన ప్రతిపాదన 2015 సెప్టెంబరు 8న అప్పటి ఆర్థికశాఖ కార్యదర్శి సునీత వద్దకు వెళ్లగా... ఏపీ మోడల్ ఇన్నోవేటివ్గా, భిన్నంగా ఉందని చెబుతూనే, మొదట రూ.55 కోట్లతో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టి, ఫలితాలు ఎలా ఉన్నాయో చూడాలని రాశారు.
- 2015 సెప్టెంబరు 5న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో... నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ప్రాజెక్టులో జాప్యం జరుగుతోందని, వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించిన మినిట్స్ని ఘంటా సుబ్బారావు తనకు అందజేశారని, సీఎస్తో తాను మాట్లాడానని, సీఎం, సీఎస్ల నిర్ణయాలను పరిగణనలోకి తీసుకుని నిధులు విడుదల చేస్తున్నట్టు రమేష్ కుమార్ పేర్కొన్నారు. దానికి ఆయన చాలా షరతులు పెడుతూ... పీడీ ఖాతాకు రూ.270 కోట్లు విడుదల చేసేందుకు ఆమోదం తెలిపారు. అప్పటికి ఏ కంపెనీకీ నిధులు విడుదల చేయలేదు.
- 2015 అక్టోబరు 21న నైపుణ్యాభివృద్ధిశాఖ కార్యదర్శిగా ప్రేమచంద్రారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. 2015 నవంబరు 5, 6 తేదీల్లో సునీత, ఘంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణతో కలిసి ఆయన గుజరాత్లో పర్యటించి అక్కడ సీమెన్స్ సంస్థతో కలసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నైపుణ్య ప్రాజెక్టుల్ని పరిశీలించారు. తమ కమిటీ నివేదికను జతపరుస్తూ, రూ.270 కోట్లు విడుదల చేయాలని ఆర్థికశాఖను కోరారు.
- పీడీ ఖాతా నుంచి రూ.270 కోట్ల నిధుల విడుదలకు సంబంధించిన దస్త్రం గుజరాత్ నుంచి తిరిగి వచ్చిన వారం రోజులకు... 2015 నవంబరు 13న సునీత వద్దకు వచ్చింది. ‘నేను ఒక్క ఎల్డీ కళాశాలను పరిశీలించాను. అక్కడి వ్యవస్థ బాగానే ఉంది. యంత్రాలు పాతవా, కొత్తవా అని నిర్ధారించుకోవాలి’’ అని రాశారు.
- కళాశాలల ఎంపిక, విద్యార్థులకు సంబంధించి 5 షరతులను విధిస్తూ.. రూ.185 కోట్లు విడుదల చేస్తామని, మిగిలిన మొత్తాన్ని 2015 డిసెంబరు లేదా 2016 జనవరి 15న విడుదల చేస్తామని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ పేర్కొన్నారు. ఆయన సూచనల మేరకు... సునీత 2015 నవంబరు 21న రూ.185 కోట్లు విడుదల చేశారు.
- షరతుల్ని ఏ మేరకు అమలు చేస్తున్నారో నివేదిక ఇవ్వాలని 2015 డిసెంబరు 26న సునీత మళ్లీ పట్టుపట్టగా... ప్రేమచంద్రారెడ్డి అంశాలవారీగా వివరణాత్మక నివేదిక అందజేశారు. అప్పటికీ ఇంకా నైపుణ్య కేంద్రాల్ని ఎక్కడ ఏర్పాటు చేసేదీ ఖరారు చేయకుండా నిధులు ఎలా విడుదల చేస్తామని అభ్యంతరం చెప్పారు. నైపుణ్య కేంద్రాల ఎంపిక పూర్తయ్యాక 2016 ఫిబ్రవరి 18న మిగతా నిధులు విడుదల చేశారు. చివరి విడత నిధులు రూ.34.25 కోట్లు 2016 మార్చి 27న విడుదలయ్యాయి.
- ఇవన్నీ పరిశీలిస్తే ఏ దశలోనూ ముఖ్యమంత్రి ఒత్తిడి, ప్రమేయం ఉన్నట్టు కనిపించడం లేదు కదా అని తెదేపా ప్రశ్నిస్తోంది. ఆర్థికశాఖ అన్ని జాగ్రత్తలూ తీసుకునే నిధులు విడుదల చేసిందని అర్థమవుతోందని పేర్కొంటోంది.
నిధులు విడుదల చేసింది ప్రేమచంద్రారెడ్డే..!
ప్రేమచంద్రారెడ్డి డబ్బులు విడుదల చేయలేదని, ఆయనపై బాస్ ఘంటా సుబ్బారావు ఒత్తిడి చాలా ఉందని సీఐడీ ప్రచారం చేస్తోంది.
అది అసంబద్ధమైన ఆరోపణని తెదేపా పేర్కొంటోంది. సుబ్బారావు అదనపు కార్యదర్శి మాత్రమేనని, ప్రేమచంద్రారెడ్డే ఆయనకు బాస్ అని, ఆయనే నిధులు విడుదల చేశారని చెబుతోంది.
- ఘంటా సుబ్బారావు టెక్నోక్రాట్. ఏపీఎస్ఎస్డీసీ ఏర్పాటు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు సంబంధించి ఆయనది కేవలం పర్యవేక్షక పాత్రే. సీమెన్స్ ప్రాజెక్ట్ ఆర్థిక వ్యవహారాలతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదు.
- సుబ్బారావు స్థానంలో ఎల్.ప్రేమచంద్రారెడ్డిని నైపుణ్యాభివృద్ధిశాఖ కార్యదర్శిగా 2015 అక్టోబరు 21న జీవో నెం.3184 ద్వారా ప్రభుత్వం నియమించింది.
- ఏపీఎస్ఎస్డీసీ ఎండీ, సీఈఓగానూ సుబ్బారావు స్థానంలో ప్రేమచంద్రారెడ్డిని నియమిస్తూ 2015 నవంబరు 9న ప్రభుత్వం జీవో నెం.3354 విడుదల చేసింది.
- నైపుణ్యాభివృద్ధిశాఖ కార్యదర్శి హోదాలో ప్రేమచంద్రారెడ్డి నాలుగు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఐఏఎస్ అధికారి సునీత, సుబ్బారావు, లక్ష్మీనారాయణలతో కలసి గుజరాత్లోని నైపుణ్య కేంద్రాల్ని ఆయన పరిశీలించారు. అప్పటి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ సూచన మేరకు ప్రాజెక్టుని సీఐటీడీతో మదింపు చేయించారు. రెండు విడతల్లో నిధులు విడుదల చేస్తామంటూ సీమెన్స్, డిజైన్టెక్ సంస్థలకు స్టాంప్ పేపర్లపై ఆయన అంగీకారపత్రం రాసిచ్చారు. 90:10 నిష్పత్తిలో నిధులు వెచ్చించడంతోపాటు, ప్రాజెక్టులో ఎవరి పాత్ర ఏంటి¨ అన్న విషయాలన్నీ దానిలో స్పష్టంగా ఉన్నాయి. ఆర్థిక శాఖ నుంచి డిజైన్టెక్కు నిధులు విడుదల చేయించి, ఆ ప్రాజెక్టులో సీమెన్స్ సంస్థను కొనసాగింపజేసేందుకు ఆయన చాలా కృషి చేశారు.
2022లో దస్త్రాలు మాయమైతేపాత ప్రభుత్వానిదా బాధ్యత?
నిధుల విడుదలకు సంబంధించిన కీలక దస్త్రాలు మాయమయ్యాయని, నిధుల్ని స్వాహా చేసే కుట్రలో భాగంగానే దస్త్రాల్ని మాయం చేశారని సీఐడీ ఆరోపిస్తోంది.
వైకాపా ప్రభుత్వం 2019లో ఏర్పాటైంది. 2022లో దస్త్రాలు మాయమైతే దానికి బాధ్యత ఈ ప్రభుత్వానిదా? గత ప్రభుత్వానిదా? దస్త్రాలు మాయమైతే ఇప్పటి వరకు ఒక్క అధికారిపైనా చర్యలెందుకు తీసుకోలేదు?
మూడు సెట్ల దస్త్రాలు మాయమయ్యాయని సీఐడీ చెబుతోంది. వాటిలో రూ.370 కోట్ల బడ్జెట్ను నైపుణ్యాభివృద్ధి సంస్థకు కేటాయిస్తూ 2015 జులై 27న జారీ చేసిన జీవో ఒకటి. ఆర్థికశాఖ కార్యదర్శి సునీత అభ్యంతరాల్ని కాదని, అప్పటి ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పి.వి.రమేష్ రూ.270 కోట్లకు బీఆర్ఓ ఇచ్చారని చెబుతున్న దస్త్రం రెండోది. మూడోది ఈ-ఫైల్స్కి సంబంధించింది. ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు. ఇ-ఫైల్స్ని ఎప్పుడైనా తీసుకోవచ్చన్నది అధికారులు చెబుతున్న మాట.
నైపుణ్యాభివృద్ధి వ్యవహారంలో నిధులు దుర్వినియోగమయ్యాయని సీఐడీ చెబుతోందే వాస్తవమైతే... సంబంధిత అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోవడంలేదు? వారి పేర్లు ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదు? ఇ-ఆఫీసు ఫైల్స్ మాయమయ్యాయని సీఐడీ, ఆర్థిక శాఖలు ఎలా చెబుతాయి?
అప్పటి ముఖ్యమంత్రిపైనే సీఐడీ అభియోగాలు మోపింది కాబట్టి... వారి వాదన సమర్థించుకోవడానికి సీఎం కార్యాలయంలోని దస్త్రాలు, సంతకాలు మాయమయ్యాయని ఆరోపించినా అర్థముంది. కానీ అజేయకల్లం, రమేష్ కుమార్, సునీతల ఆధ్వర్యంలో పనిచేసిన ఆర్థికశాఖలో దస్త్రాలు ఎలా మాయమయ్యాయి?
పి.వి.రమేష్, సునీతల నోటింగ్స్తో ఉన్న షాడో ఫైల్స్ సామాజిక మాధ్యమాల్లో ఎలా చక్కర్లు కొడుతున్నాయి? వాటిని ప్రచారంలో పెట్టింది ఎవరు? ఏ ప్రయోజనం కోసం అదంతా చేస్తున్నారు?
ఆర్థికశాఖలోని షాడో ఫైల్స్ ప్రజలకు సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉన్నాయి. కానీ ఏపీఎస్ఎస్డీసీకి బీఆర్ఓ, నిధుల విడుదలకు సంబంధించి ఆర్థికశాఖలోని ఇ-ఫైల్స్ మాత్రం మాయమయ్యాయట? ఇంతకంటే విడ్డూరం ఏముంటుంది? అని తెదేపా వారు ప్రశ్నిస్తున్నారు.
- సీఐటీడీ రిపోర్టు రాకముందే నిధులు విడుదల చేశారన్నది సీఐడీ చేస్తున్న మరో ఆరోపణ. సీఐటీడీతో మదింపు చేయించాలన్నది ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ సూచన మాత్రమే. అది తప్పనిసరి కాదు.
- నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగమే నిజమైతే ప్రేమచంద్రారెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో ఎందుకు లేదని తెదేపా ప్రశ్నిస్తోంది.
ఐఏఎస్ అధికారి డిప్యుటేషన్, పోస్టింగ్పై నిర్ణయం అప్పటి సీఎస్దే
ఉత్తర్ప్రదేశ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారిణి అపర్ణను కుట్రలో భాగంగానే డిప్యుటేషన్పై తీసుకొచ్చి నైపుణ్యాభివృద్ధి సంస్థకు డిప్యూటీ సీఈఓగా నియమించారని, ప్రాజెక్టు విలువను ఉన్నదానికంటే బాగా పెంచడంలో ఆమె భర్త కీలక పాత్ర పోషించారని సీఐడీ ఆరోపిస్తోంది.
ఏపీ ప్రభుత్వానికి డిప్యుటేషన్పై వచ్చేందుకు ఆమె పెట్టుకున్న దరఖాస్తు నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావుకి వచ్చిందని, ‘‘ఆమె ప్రొఫైల్ బాగుంది. నైపుణ్యాభివృద్ధి మిషన్లోకి ఆమెను తీసుకోవచ్చు. ఫైల్ ప్రాసెస్ చేయొచ్చు’’ అని ఆమె అప్లికేషన్పైనే ఐ.వై.ఆర్. రాశారని తెదేపా చెబుతోంది. ఫైల్ ప్రాసెస్ జరిగి సంబంధిత మంత్రి ద్వారా ముఖ్యమంత్రికి వెళ్లింది. 2015 జులై 8న జీవో విడుదలైంది. 2015 జులై 17న అపర్ణ విధుల్లో చేరారు. ‘‘ఆమెను ఏపీఎస్ఎస్డీసీ డిప్యూటీ సీఈఓగా నియమించవచ్చు. ఉత్తర్వులు జారీ చేసి, ఆ తర్వాత అనుమతి తీసుకోండి’’ అని ఆమె జాయినింగ్ రిపోర్టుపైనే ఐ.వై.ఆర్. రాశారని, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆమోదం కోసం దస్త్రం వెళ్లిందని, దానిపై ఆయన 2015 జులై 28న సంతకం చేశారని తెదేపా చెబుతోంది.
- ‘ఆమె ఉద్యోగంలో చేరిన నెల రోజులకు ప్రేమచంద్రారెడ్డి కార్యదర్శిగా, ఎండీగా బాధ్యతలు చేపట్టారు. విధానపరమైన నిర్ణయాలు, నిధుల విడుదల ఆయన చేతుల మీదుగానే జరిగాయి. విధాన నిర్ణయాల్లో అపర్ణకు ప్రధానమైన పాత్రేమీ లేదు.’’ అని తెదేపా చెబుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
CM Jagan: పిల్లల కళ్లజోళ్ల మీదా ఆయన బొమ్మే
జగన్ ప్రచార కాంక్షకు మరో ఉదాహరణ. పిల్లలకు ఇచ్చే కళ్లజోళ్ల మీద కూడా ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫొటోలు దర్శనమిచ్చాయి. -
AP Officers: ప్రభుత్వం మారితే మా పరిస్థితేంటి?
‘అధికారాంతమునందు చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్..’ అని కవివాక్కు. ఇది ప్రభుత్వ పెద్దలకే కాదు... వారి అండ చూసుకొని విర్రవీగిన అధికారులకూ వర్తిస్తుంది. -
Chandrababu: సభలు, సమావేశాల్లో పాల్గొనొచ్చు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈనెల 20న ఇచ్చిన పూర్తిస్థాయి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు డిసెంబరు 8కి వాయిదా వేసింది. -
అనగనగా అవుకు.. పూర్తికాకుండానే టముకు
అనగనగా అదొక అవుకు టన్నెల్. గాలేరు నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా కొండలను తొలచి నిర్మిస్తున్నారు. ఎప్పుడో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక టన్నెల్ను తవ్వి (రెండు చిన్న డైవర్షన్ ఛానళ్లతో) 10వేల క్యూసెక్కుల నీటిని గండికోట జలాశయానికి తరలించేలా నిర్మించారు. -
Margadarsi Chit Fund Case: లుక్ఔట్ సర్క్యులర్ కోర్టు ధిక్కరణ కాదా?
ఎలాంటి కఠిన చర్యలూ చేపట్టరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా.. మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా లుక్ఔట్ సర్క్యులర్(ఎల్ఓసీ)ను ఎలా జారీ చేశారని ఏపీ సీఐడీని తెలంగాణ హైకోర్టు నిలదీసింది. -
ప్రతి గ్రామానికీ నాణ్యమైన విద్యుత్
ప్రతి గ్రామానికి, రైతుకు నాణ్యమైన విద్యుత్ను అందించేలా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని సీఎం జగన్మోహన్రెడ్డి తెలిపారు. -
ఇంటర్ విద్యార్థుల ఘర్షణ.. శిరోముండనం చేయించిన కళాశాల యాజమాన్యం!
నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఘర్షణ జరిగి సోమవారం రాత్రి సీనియర్, జూనియర్ విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. -
అడిగేదెవరని.. అడ్డే లేదని!
ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఉపకులపతి(వీసీ)గా ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి తన పదవీకాలంలో ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా పలు నియామకాలు చేపట్టారని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలుమ్ని అసోసియేషన్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. -
చదువూ లేదు.. కొలువూ రాదు!
పేదల పక్షపాతిని అని పదేపదే చెప్పుకొనే సీఎం జగన్... బీద బిడ్డలు ఎక్కువగా చదివే పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)ను గాలికొదిలేశారు. చాలా ఐటీఐల్లో బోధన సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. -
Vizag: సాగర సర్పం.. కాటేస్తే కష్టం
విశాఖ నగర పరిధి సాగర్నగర్ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు మంగళవారం ఓ విషపూరిత పాము చిక్కింది. -
ఇక్కడ ఓటుంటేనే గుంతలు పూడుస్తాం
ఓటరు కార్డులను ప్రామాణికంగా తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టాలనే విచిత్ర ఆలోచన చంద్రగిరి నియోజకవర్గ అధికార పార్టీ నేతలకు వచ్చింది. -
ఆ తీర్పును తెలుగు చేసి పోలీసులకు పంపండి
లలితకుమారి వర్సెస్ ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని రాష్ట్రంలోని పోలీసు అధికారులకు మరోసారి పంపాలని రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. -
నిరుపయోగంగా ఏకరూప దుస్తులు
-
ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్కు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. -
మౌనంగా విన్నారు.. వెళ్లారు
ఓటర్ల జాబితా పరిశీలకుడు, ఏపీ పొల్యూషన్ బోర్డు మెంబర్ సెక్రటరీ బి.శ్రీధర్ తొలి విడత జిల్లా పర్యటన గంటన్నర వ్యవధిలో ముగిసింది. ప్రధాన రాజకీయ పక్షాలు, అధికారులు చెప్పింది మౌనంగా విన్నారు. -
ఎస్ఆర్ఎం వీసీ మనోజ్ కుమార్కు ప్రతిష్ఠాత్మక ‘భాస్కర’ అవార్డు
ఏపీ-ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య మనోజ్ కుమార్ అరోడాకు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన ‘భాస్కర’ అవార్డు లభించింది. -
ఇదేం అస్తవ్యస్త ఇసుక విధానం?
ఇసుక తవ్వకాలపై రాష్ట్రప్రభుత్వ విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల లారీ యజమానులు మండిపడ్డారు. -
బ్రిటిష్ పాలనను తలదన్నేలా రాష్ట్రంలో నిర్బంధకాండ
-
వైకాపా నాయకులు వేధిస్తున్నారని.. అయిదుగురు వాలంటీర్ల రాజీనామా
‘వైకాపా నాయకుల వేధింపులు భరించలేకున్నాం. పని కూడా చేయలేకపోతున్నాం’ అని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట సచివాలయానికి చెందిన అయిదుగురు వాలంటీర్లు రాజీనామా చేశారు. -
వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం
రాష్ట్రంలో కరవు మండలాలను ప్రకటించాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం భాజపా కిసాన్ మోర్చా చేపట్టిన వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. -
అంగట్లో బోగస్ సర్టిఫికెట్లు
సచివాలయ పశుసంవర్ధక శాఖ సహాయకులుగా విధులు నిర్వర్తించేందుకు అవసరమైన నకిలీ ధ్రువపత్రాలు బహిరంగ మార్కెట్లో పెద్దఎత్తున లభ్యమవుతుండటం కలకలం రేపుతోంది.


తాజా వార్తలు (Latest News)
-
Amazon Q: చాట్జీపీటీకి పోటీగా అమెజాన్ ‘క్యూ’
-
Rules Ranjann ott: ఓటీటీలో కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’
-
Gautam Gambhir: రోహిత్ అలా చెప్పాల్సింది కాదు..: గంభీర్
-
Flight: భార్యాభర్తల గొడవతో.. విమానం దారి మళ్లింది..!
-
AP High Court: సజ్జల, సీఎస్కు ఏపీ హైకోర్టు నోటీసులు
-
Cabinet Meet: డ్వాక్రా మహిళలకు డ్రోన్లు.. మరో ఐదేళ్లు ఉచిత రేషన్: కేబినెట్ కీలక నిర్ణయాలు