చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయడానికే కస్టడీ

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబును విచారించేందుకు ‘పోలీసు కస్టడీ’కి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం వాదించారు.

Updated : 21 Sep 2023 10:03 IST

సీఐడీ పిటిషన్‌ను తోసిపుచ్చండి
ప్రతీకారం తీర్చుకోవడానికే చంద్రబాబును ఇరికించారు
ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాదుల వాదనలు
నేడు నిర్ణయం వెల్లడిస్తామన్న  న్యాయాధికారి

ఈనాడు, అమరావతి: ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో నమోదు చేసిన కేసులో తెదేపా అధినేత చంద్రబాబును విచారించేందుకు ‘పోలీసు కస్టడీ’కి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం వాదించారు. అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చాలని కోరారు. పోలీసు కస్టడీ పేరుతో విచారణ చేసి, ఆ వివరాలను ఎంపిక చేసుకున్న ఛానళ్ల ద్వారా ప్రచారం చేసి ప్రజల్లో చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయాలనే లక్ష్యంతో దర్యాప్తు సంస్థ వ్యవహరిస్తోందన్నారు.

చంద్రబాబును అరెస్టుచేసిన సీఐడీ.. కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేసిందన్నారు. ఆ వీడియోలను ఇప్పటికే ప్రచారం చేశారన్నారు. ఏళ్లతరబడి దర్యాప్తు చేస్తున్నామంటున్న సీఐడీ.. ఇప్పటికే సాక్ష్యాధారాలను సేకరించి ఉండాలని, ఆ ఆధారాలే లేకపోతే పిటిషనర్‌ను ఎందుకు అరెస్టుచేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఎలా చూసినా చంద్రబాబును పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. బుధవారం విచారణలో ఇరువైపు వాదనలు ముగిశాయి. పోలీసు కస్టడీ వ్యవహారంపై గురువారం ఉదయం 11, 11:30 సమయంలో నిర్ణయాన్ని వెల్లడిస్తానని ఏసీబీ కోర్టు న్యాయాధికారి బి.సత్య వెంకట హిమబిందు ప్రకటించారు.

విచారిస్తే తప్పేముంది: అదనపు ఏజీ

సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, ప్రత్యేక పీపీ వివేకానంద వాదనలు వినిపించారు. అరెస్టు అనంతరం పూర్తిస్థాయిలో విచారించడానికి తగిన సమయం లేదన్నారు. పోలీసు కస్టడీలో విచారణ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. విచారణకు సహకరించాలని ఇద్దరికి నోటీసు ఇస్తే విదేశాలకు వెళ్లిపోయారని, షెల్‌ కంపెనీలకు మళ్లించిన ప్రజాధనం ఎవరికి చేరింది అనేది ఇంకా తేల్చాల్సి ఉందని చెప్పారు. ఇది రూ.371 కోట్ల ప్రజాధనం వ్యవహారం అన్నారు. వాస్తవాలు వెలికితీయాలంటే పోలీసు కస్టడీలో విచారణ అవసరం అన్నారు. దర్యాప్తులో గ్యాప్‌లను వెలికితీసేందుకు పోలీసు కస్టడీ అవసరమని తెలిపారు. ఓసారి జ్యుడిషియల్‌ రిమాండు కోరామన్న కారణంతో పోలీసు కస్టడీ కోరకూడదనే నిబంధన లేదని గుర్తుచేశారు. ఏసీబీ కోర్టుకు విచారణ పరిధి లేదంటూనే మరోవైపు ఇక్కడే పిటిషన్లు దాఖలు చేస్తున్నారన్నారు. అరెస్టు చేశాక హెలికాప్టర్‌లో విజయవాడ తీసుకెళ్తామని చెబితే చంద్రబాబు నిరాకరించి, రోడ్డుమార్గానే వెళదామన్నారని తెలిపారు.

దర్యాప్తు అధికారి ఒక్కరోజులో ఆలోచనను మార్చుకున్నారు

చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్‌ వాదనలు వినిపించారు. ‘చంద్రబాబును అరెస్టుచేసి 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచాల్సిన దర్యాప్తు అధికారులు 36 గంటలు వారివద్దే ఉంచుకున్నారు. విచారణ వీడియోలను కొన్ని ఛానళ్లకు లీక్‌ చేశారు. ఆ వివరాలు ఇప్పటికీ ప్రజాబాహుళ్యంలో ఉన్నాయి. ఈ నెల 10న ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరుస్తూ జ్యుడిషియల్‌ రిమాండుకు ఆదేశించాలని కోరారు. ఒక్క రోజులో అలోచనను మార్చుకున్న దర్యాప్తు అధికారి 11వ తేదీన పోలీసు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌ వేశారు. ఇలా ఒక్కరోజులోనే మాట మార్చడం వెనక దర్యాప్తు అధికారి దురుద్దేశం ఉన్నట్లు స్పష్టమవుతోంది. చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయడం కోసం పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టు అనుమతి కోరుతున్నారు. ఇప్పటికే సీఐడీ ప్రెస్‌మీట్లు పెట్టింది. చంద్రబాబును ప్రశ్నిస్తున్నట్లు వీడియోలను విడుదల చేసింది. ఇలాంటి చర్యలన్నింటికీ న్యాయస్థానానికి సీఐడీ సమాధానం చెప్పాలి. కోర్టుతో సీఐడీ ఆటలాడుతోంది.

రాత్రికి రాత్రే నిందితుల జాబితాలో చంద్రబాబు పేరు

ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా చంద్రబాబును ఈ కేసులో ఇరికించారు. ఆయన పాత్ర ఉంటే 2021 నుంచి దర్యాప్తు చేస్తున్నవారు ఒక్కసారైనా నోటీసు ఇవ్వలేదు, విచారణకు పిలవలేదు. రాత్రికి రాత్రే ఆయన పేరును నిందితుల జాబితాలో చేర్చి బస్సును చుట్టుముట్టి అరెస్టు చేశారు. ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా ఇదంతా చేస్తోంది. పలు కేసుల్లో చంద్రబాబును నిందితుడిగా చేరుస్తున్నారు. అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్‌ 17ఏ ప్రకారం గవర్నర్‌ ఆమోదం లేకుండా చంద్రబాబుపై దర్యాప్తు చేయడానికి వీల్లేదు, అరెస్టు చేయడానికీ వీల్లేదు. సీఐడీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది.

చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం లేదు

నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల విషయంలో 2021 డిసెంబరు 9న సీఐడీ పలువురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసింది. ఇప్పటివరకు పలువురిని అరెస్టు చేసింది. వారు బెయిలు పొందారు. ఇప్పటివరకు నిందితులందరూ దర్యాప్తు సంస్థతోనే ఉన్నారు. దర్యాప్తునకు సహకరించారు. ఇప్పటి వరకు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లేదు. అలాంటప్పుడు ఆయనను పోలీసు కస్టడీలో విచారించి తేల్చేదేముంటుంది?

యాంత్రిక ధోరణిలో కస్టడీకి ఇవ్వడానికి వీల్లేదు

యాంత్రిక ధోరణిలో పోలీసు కస్టడీకి ఇవ్వడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వార్థ ప్రయోజనాల కోసం న్యాయస్థానాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి చర్యలను న్యాయస్థానాలు కట్టడి చేయాలి. ఈ కేసులో పోలీసు కస్టడీకి ఎందుకివ్వాలో సీఐడీ సంతృప్తికరమైన సమాధానం ఇవ్వలేకపోతోంది. కస్టడీ సూత్రాలకు లోబడి న్యాయస్థానం నిర్ణయించాలి. అంతేతప్ప ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకునే విషయంలో న్యాయస్థానం భాగస్వామి కాకూడదు.

ప్రశ్నించడం సీఐడీ హక్కేమీ కాదు

సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబును నిందితుడిగా చేర్చామని చెబుతున్న సీఐడీ.. ఇప్పుడెందుకు పోలీసు కస్టడీ కోరుతోంది? ప్రశ్నించేందుకు తమకు అప్పగించాలని సీఐడీ చెబుతోంది. ప్రశ్నించడం అనేది సీఐడీకి పుట్టుకతో వచ్చిన హక్కేమీ కాదు. షెల్‌ కంపెనీలకు నిధులు మళ్లించారనేది 2021 నుంచి చేస్తున్న ఆరోపణ. అయినా ఇప్పటివరకూ ఈ వ్యవహారాన్ని తేల్చలేదు. దర్యాప్తులో తేడాలున్నాయి (గ్యాప్‌లు), వాటిని సరిదిద్దుకోవాలి కాబట్టి పోలీసు కస్టడీకి ఇవ్వాలని ఏఏజీ చెప్పడం హాస్యాస్పదం.

వీడియోలు లీక్‌ చేసి దర్యాప్తు అధికారి  కోర్టుధిక్కరణకు పాల్పడ్డారు

న్యాయస్థానం సీఆర్‌పీసీ సెక్షన్‌ 167 నిబంధనల మేరకు ఓసారి జ్యుడిషియల్‌ కస్టడీకి ఆదేశించింది. అదే నిబంధన ఆధారంగా పోలీసు కస్టడీకి ఆదేశించలేదు. చంద్రబాబును విచారిస్తున్న వీడియోలను తీసి ప్రతిష్ఠను దిగజార్చడానికే పోలీసు కస్టడీ కోరుతున్నారు. దర్యాప్తు అధికారి ఇప్పటికే వీడియోలను లీకుచేసి కోర్టుధిక్కరణకు పాల్పడ్డారు. ఇలాంటి కేసులను వాస్తవానికి ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల ప్రత్యేక న్యాయస్థానం విచారించాలి. ఏసీబీ కోర్టుకు పరిధి లేదు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని పోలీసు కస్టడీ పిటిషన్‌ను కొట్టేయండి’ అని సీనియర్‌ న్యాయవాదులు కోరారు.

వీడియోల లీక్‌పై ఏం సమాధానం చెబుతారు?

చంద్రబాబును ప్రశ్నిస్తున్న వీడియోలు బయటకు రావడంతో, దానికి ఏం సమాధానం చెబుతారని న్యాయాధికారి ప్రశ్నించారు. సీఐడీ ప్రత్యేక పీపీ వివేకానంద బదులిస్తూ అవి నిరాధార ఆరోపణలన్నారు. వీడియోలు తీసింది ఎవరనేది ప్రశ్నార్థకం అన్నారు. చంద్రబాబుతో పాటు కుటుంబసభ్యులు, హెల్పర్లు, న్యాయవాదులు ఉన్నారన్నారు. ఆ వాదనపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎంపిక చేసుకున్న వ్యక్తుల ద్వారా సీఐడీ వీడియోలు తీయించిందన్నారు. వీడియోలో ఎవరున్నారనే విషయాలను పెన్‌డ్రైవ్‌ ద్వారా కోర్టుకు అందజేస్తామన్నారు.

కాల్‌ రికార్డుల పిటిషన్‌పై కౌంటర్‌ వేయండి

చంద్రబాబును నంద్యాలలో అరెస్టుచేసిన సందర్భంగా సీఐడీ అధికారులు ఎవరితో మాట్లాడారు, సమాచారాన్ని ఎవరికి చేరవేశారో వెల్లడి కావాలంటే ఆ అధికారుల సెల్‌ఫోన్‌ కాల్‌ రికార్డులను భద్రపరచాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు ఏసీబీ కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌లో కౌంటర్‌ వేయాలని సీఐడీని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ పిటిషన్‌పై ఈ నెల 22న విచారణ చేస్తానన్నారు. మరోవైపు చంద్రబాబును ఇతర కేసుల్లో సీఐడీ నిందితుడిగా చేర్చి వాటిలో విచారించేందుకు అనుమతించాలని పీటీ వారంట్‌ దాఖలుచేసిన విషయం తెలిసిందే. వీటిపై గురువారం విచారణ చేస్తానని న్యాయాధికారి పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని