జీపీఎస్‌ అమల్లో తగ్గేదే లే!

ఉద్యోగుల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా.. ప్రభుత్వం పట్టించుకోకుండా.. గ్యారంటీడ్‌ పింఛను పథకం (జీపీఎస్‌) అమలుకే పచ్చజెండా ఊపింది. ఏపీజీపీఎస్‌ బిల్లు-2023ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Updated : 21 Sep 2023 06:56 IST

ఏపీజీపీఎస్‌ బిల్లుకు మంత్రివర్గం పచ్చజెండా
2014 జూన్‌ 2కి ముందు నియమితులైన కాంట్రాక్టు  ఉద్యోగుల క్రమబద్ధీకరణ
యూపీఎస్సీ ప్రిలిమినరీ, మెయిన్స్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఆర్థికసాయం
సీఎం, కుటుంబసభ్యులకు స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌తో భద్రత
బల్క్‌డ్రగ్‌ పార్క్‌ కాకినాడ నుంచి  నక్కపల్లికి తరలింపు
రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయాలు

ఈనాడు, అమరావతి: ఉద్యోగుల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా.. ప్రభుత్వం పట్టించుకోకుండా.. గ్యారంటీడ్‌ పింఛను పథకం (జీపీఎస్‌) అమలుకే పచ్చజెండా ఊపింది. ఏపీజీపీఎస్‌ బిల్లు-2023ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఏపీ వైద్యవిధాన పరిషత్‌ను వైద్యరంగంలో విలీనం చేయడం, పాఠశాలల్లో ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ (ఐబీ) సిలబస్‌ అమలు వంటి నిర్ణయాలు, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పలు బిల్లులను రాష్ట్ర కేబినెట్‌ ఆమోదించింది. సీఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో బుధవారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను సమాచార పౌరసంబంధాలశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విలేకర్లకు తెలిపారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ

  • 2014 జూన్‌ 2కు ముందు వివిధ ప్రభుత్వశాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ కోసం ఏపీ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ బిల్‌-2023కి ఆమోదం. దీనిద్వారా 10,115 మందిని క్రమబద్ధీకరిస్తారు.
  • ఏపీ వైద్యవిధాన పరిషత్‌ చట్టం రద్దుచేసి, దాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌గా మారుస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతారు. దీనివల్ల 11,633 మంది ఉద్యోగులకు మేలు.
  • రిటైర్‌ అయ్యేనాటికి ఇంటిస్థలం లేని ఉద్యోగులకు కచ్చితంగా ఇంటి స్థలం ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యతగా ఉండాలని నిర్ణయం. రిటైర్‌ అయ్యాక కూడా వారి పిల్లలకు ఆరోగ్యశ్రీ వర్తింపు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ప్రయోజనాలు అందేలా చూడాలి. వీటి విధివిధానాల కోసం కసరత్తు.

బడుల్లో ఇక ఐబీ సిలబస్‌

పాఠశాలల్లో ఇంటర్నేషనల్‌ బాకలారియెట్‌ (ఐబీ) సిలబస్‌ అమలు. ఈ మేరకు ఐబీతో విద్యాశాఖ లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్‌ (ఎల్‌ఓఐ)కి ఆమోదం. ఒకటో తరగతితో ఆరంభించి, తర్వాత మిగిలిన తరగతులకు విస్తరిస్తారు.

సీఎం, కుటుంబసభ్యులకు ఎస్‌ఎస్‌జీ భద్రత

అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే ఏపీ స్పెషల్‌ సెక్యూరిటీ గ్రూప్‌ (ఏపీఎస్‌ఎస్‌జీ) బిల్లుకు ఆమోదం. దీనిద్వారా సీఎం జగన్‌కు, ఆయన కుటుంబసభ్యలకు ఎస్‌ఎస్‌జీ ద్వారా భద్రత కల్పిస్తారు. ఇప్పటివరకు సీఎంకు ఆక్టోపస్‌ విభాగం ద్వారా భద్రత కల్పిస్తున్నారు. దీనిస్థానంలో ఎస్‌ఎస్‌జీని తీసుకొస్తారు.

యూపీఎస్సీ అభ్యర్థులకు ప్రోత్సాహకం

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే ప్రిలిమినరీ, మెయిన్స్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులైన సామాజిక, ఆర్థిక, విద్యాపరంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు జగనన్న సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకం పేరుతో ఆర్థికసాయం అందించేందుకు నిర్ణయం. ప్రిలిమినరీలో అర్హత సాధిస్తే రూ.లక్ష, మెయిన్స్‌లో అర్హత పొందితే అదనంగా మరో రూ.50వేలు అందిస్తారు.

  • ప్రభుత్వ పథకాల సక్రమ అమలు కోసం వ్యక్తుల గుర్తింపునకు ఆధార్‌ వినియోగంపై చట్టబద్ధతకు చెందిన ఏపీ స్టేట్‌ లెజిస్లేచర్‌ టు రీప్లేస్‌ ది ఏపీ ఆధార్‌ ఆర్డినెన్స్‌-2023లో సవరణకు ఆమోదం.

ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణ

  • ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలతో కలిసి సంయుక్త సర్టిఫికేషన్‌ ఉండేలా ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయ చట్టం-2016కి సవరణల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం. ఇప్పటికే ఉన్న ప్రైవేటు వర్సిటీలు, కొత్తగా ఏర్పాటుచేసే వాటికీ జాయింట్‌ సర్టిఫికేషన్‌ ఉండాలి. ఇప్పుడున్న ప్రైవేటు కళాశాలలు విశ్వవిద్యాలయాలుగా మారితే వచ్చే అదనపు సీట్లలో 35% కన్వీనర్‌ కోటా కిందకు వస్తాయి.
  • విశ్వవిద్యాలయాల్లో నియామకాలు ఇకపై ఏపీపీఎస్సీ ద్వారానే నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ చట్టం-2017 సవరణలకు ఆమోదం.
  • కురుపాం గిరిజన ఇంజినీరింగ్‌ కళాశాలలో 50% సీట్లు గిరిజన ప్రాంతాల్లో ఉన్న ఎస్టీ విద్యార్థులకే కేటాయించాలనే నిర్ణయానికి ఆమోదం.

పోలవరం ఇళ్ల నిర్మాణ వ్యయం రూ.70 కోట్లు పెంపు

  • పోలవరం నిర్వాసితులకు నిర్మిస్తున్న ఇళ్ల అంచనా వ్యయం పెంపునకు ఆమోదం. 8,424 ఇళ్ల నిర్మాణానికి 2016-17 ధరల ప్రకారం ఉన్న అంచనాలు మరో రూ.70 కోట్లకు పెంపు.
  • 2018కి ముందు రిజిస్టర్‌ అయిన నాలుగుచక్రాల గూడ్స్‌ వాహనాల నుంచి జీవితపన్ను బదులు, త్రైమాసిక పన్ను వసూలుకు ఆమోదం.
  • నక్కపల్లికి బల్క్‌డ్రగ్‌ పార్కు తరలింపు
  • బల్క్‌డ్రగ్‌ పార్కు ప్రాజెక్టును కాకినాడ నుంచి అనకాపల్లి జిల్లా నక్కపల్లికి తరలిస్తూ నిర్ణయం. ప్రభుత్వభూముల్లోనే ఈ ప్రాజెక్టు ఏర్పాటుచేయాలనే కేంద్రం తాజా మార్గదర్శకాల కారణంగా.. నక్కపల్లిలో ప్రభుత్వభూమి ఉండటంతో అక్కడికి తరలింపు. ఏపీఐఐసీకి చెందిన 2వేల ఎకరాల్లో రూ.2,190 కోట్లతో ఏర్పాటుకానున్న ప్రాజెక్టు.
  • ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ఆమోదం. గ్రామాల్లో అందరికీ వైద్యపరీక్షలు నిర్వహించి, వివరాలు మ్యాపింగ్‌ చేసి, తీవ్రవ్యాధులు ఉన్నవారికి చికిత్స అందిస్తారు.
  • షేక్‌ జఫ్రీన్‌కు గ్రూప్‌-1 ఉద్యోగం, ఇంటిస్థలం
  • 2017 బధిరుల ఒలింపిక్స్‌ టెన్నిస్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో కాంస్యపతక విజేత, భారత డెఫ్‌ టెన్నిస్‌ జట్టు కెప్టెన్‌ షేక్‌ జఫ్రీన్‌కు గ్రూప్‌-1లో కోఆపరేటివ్‌ సొసైటీస్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ హోదాలో నియామకం, 10 సెంట్ల ఇంటిస్థలం కేటాయింపు.

ఆర్డీఎఫ్‌, సీపీఐ (మావోయిస్ట్‌)పై మరో ఏడాది నిషేధం

  • నిషేధిత కార్యకలాపాలకు పాల్పడుతున్న రివల్యూషనరీ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఆర్డీఎఫ్‌), కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (మావోయిస్ట్‌)లపై మరో ఏడాది నిషేధం పొడిగిస్తూ నిర్ణయానికి ఆమోదం.
  • ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా 9 మంది జీవితఖైదీలకు ఈ ఏడాది ఆగస్టు 15న క్షమాభిక్ష ప్రసాదిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.
  • ఎసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కు
  • ఎసైన్డ్‌ భూములపై 20 ఏళ్ల తర్వాత యాజమాన్య హక్కులు కల్పిస్తూ ఏపీ ఎసైన్డ్‌ ల్యాండ్స్‌ యాక్ట్‌-2017కి సవరణలకు ఆమోదం.
  • దేవాదాయశాఖకు చెందిన ఆలయాలు, సంస్థల భూములు ఆక్రమించినవారిపై సంబంధిత ఈవోలు, సహాయ, ఉపకమిషనర్లు చర్యలు తీసుకునేలా ఏపీ దేవాదాయ చట్టం-1987 సవరణలకు ఆమోదం. వార్షికాదాయం రూ.25లక్షల కంటే ఎక్కువ ఉన్న ఆలయాల స్థాయి పెంపు (క్లాసిఫికేషన్‌)నకు వీలు.
  • భూదాన్‌ భూములను గుర్తించి, వాటి రికార్డులు భద్రపరిచి, ఆ భూములను ఎలా పరిరక్షించాలనే దానిపై ఏపీ భూదాన్‌ అండ్‌ గ్రామదాన్‌ చట్టం-1965కి సవరణలతో కూడిన ముసాయిదా బిల్లుకు ఆమోదం.

భూముల కేటాయింపు

  • పల్నాడు జిల్లా మాచర్ల మండలం నాగులవరంలో 100.45 ఎకరాలు ఏపీఐఐసీకి కేటాయింపు.
  • విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడలో ఎస్‌బీఐ ఆధ్వర్యంలో గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థకు 33 ఏళ్లపాటు ఒక ఎకరం లీజుకు ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం.
  • శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం ఎనుమలపల్లెలో శ్రీసత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో విద్యాకేంద్రాలు, జూలాజికల్‌ గార్డెన్‌ ఏర్పాటుకు 11.83 ఎకరాల కేటాయింపు.
  • గుంటూరుకు చెందిన విశ్వమానవ సమైక్యతా సంస్థకు ప్రత్తిపాడు మండలం నడిమిపాలెంలో మదర్‌ అండ్‌ చైల్డ్‌కేర్‌ ఆసుపత్రి నిర్మాణానికి ఎకరా రూ.లక్ష చొప్పున 7.45 ఎకరాల కేటాయింపునకు ఆమోదం.
  • బాపట్ల, నాయుడుపేట, తణుకు పురపాలికల పరిధిలో సమీకృత ఘనవ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు నమూనా, నిర్మించు, నిర్వహించు, బదలాయించు (డీబీఓటీ) విధానంలో అమలుకు అవసరమైన భూమిని చదరపు మీటరుకు ఏడాదికి రూపాయి నామమాత్రపు అద్దెతో కేటాయించేందుకు ఆమోదం.
  • చిత్తూరు, నెల్లూరు, కృష్ణా, శ్రీకాకుళం, బాపట్ల, అనకాపల్లి, కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు అవసరమైన భూ కేటాయింపులకు ఆమోదం.
  • కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడలో ఏపీ పర్యాటకశాఖకు 2.41 ఎకరాలు ఉచితంగా కేటాయింపు.
  • విశాఖలోని మధురవాడలో యూనిటీ మాల్‌ నిర్మాణానికి ఆమోదం. ఇందులో భాగంగా కన్వెన్షన్‌ సెంటర్‌ నిర్మించనున్నారు.

పోస్టుల భర్తీ

  • విశాఖ కింగ్‌జార్జి ఆసుపత్రి (కేజీహెచ్‌), గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రి, కడప ప్రభుత్వ ఆసుపత్రిలో కేన్సర్‌ సెంటర్‌తోపాటు, వైద్యవిద్య సంచాలకుని పరిధిలోని పీఎంయూలో 353 పోస్టుల భర్తీ. వైద్య ఆరోగ్యశాఖలో ఖాళీలు లేని (జీరో వేకెన్సీ) విధానం అమలుచేయాలి.
  • ఒంగోలు, ఏలూరు, విజయవాడల్లోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలల్లో పదోన్నతులు/ పొరుగు సేవల ద్వారా 168 పోస్టుల భర్తీ.
  • 11 ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో 99 పోస్టుల భర్తీకి ఆమోదం.
  • ఆదోనిలో కొత్తగా ఏర్పాటుచేసిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 34 టీచింగ్‌, 10 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీ.
  • కొత్త జిల్లాల్లో 13 స్పెషల్‌గ్రేడ్‌ డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు, 6 డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టుల భర్తీ.
  • సెరీకల్చర్‌లో ఓ సహాయ సంచాలకుని పోస్టు భర్తీ.
  • విద్యుత్‌ విభాగంలో డిప్యూటీ చీఫ్‌ ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (తిరుపతి), ఎలక్ట్రికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (రాజమహేంద్రవరం) కొత్త పోస్టుల ఏర్పాటు.
  • కాగ్‌ సూచనలతో ఏపీ కోస్టల్‌ జోన్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఏపీసీజెడ్‌ఎంఏ)లో శాశ్వత విభాగం ఏర్పాటుకు 10 పోస్టులు.
  • సాధారణ పరిపాలన విభాగంలో చీఫ్‌ ఎలక్టోరల్‌ కార్యాలయంలో శాశ్వత ప్రతిపాదికన ఉద్యోగాల భర్తీ.
  • ఏపీ స్టేట్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ యాంటీ సోషల్‌ అండ్‌ హజార్డస్‌ యాక్టివిటీస్‌ ట్రైబ్యునల్‌లో 5 కొత్త పోస్టుల మంజూరు.
  • ఏపీ హైకోర్టులో 40 ఆఫీస్‌ సబార్డినేట్‌ పోస్టులు, 28 డ్రైవర్‌ పోస్టులు పొరుగు సేవల కింద నియామకం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు