సుప్రీంలో చంద్రబాబు పిటిషన్‌

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ ముందస్తు అనుమతి లేకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్‌ దాఖలుచేశారు.

Updated : 24 Sep 2023 07:01 IST

17ఎ కింద ముందస్తు అనుమతులు తీసుకోకుండా తనపై నమోదుచేసిన కేసును కొట్టేయాలని వినతి
రాజకీయ కక్షసాధింపులో భాగంగా అరెస్టు చేసినట్లు వెల్లడి
హైకోర్టు క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేతను సవాలు చేస్తూ వ్యాజ్యం

ఈనాడు, దిల్లీ: అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17ఎ కింద గవర్నర్‌ ముందస్తు అనుమతి లేకుండా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్‌ దాఖలుచేశారు. ఆయన దాఖలుచేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి కె.శ్రీనివాసరెడ్డి శుక్రవారం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబు దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలివి...

‘‘అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 17-ఎ ప్రకారం గవర్నర్‌ నుంచి ముందస్తు అనుమతి లేకుండా పిటిషనర్‌కు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. 20 నెలల క్రితం ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసినా అకస్మాత్తుగా, చట్టవిరుద్ధంగా అరెస్టుచేశారు. ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోయినా రాజకీయ కారణాలతో అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా, దురుద్దేశపూర్వకంగా జరుగుతున్న దర్యాప్తుతో పిటిషనర్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుంది. ఇప్పటివరకూ అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్‌ 17ఎ కింద చట్టబద్ధమైన అనుమతి తీసుకోనందున ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయడం, దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టడం చెల్లుబాటు కావు. సెక్షన్‌ 17ఎ కింద ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్టేట్‌ ఆఫ్‌ హరియాణా వర్సెస్‌ భజన్‌లాల్‌, యశ్వంత్‌సిన్హా వర్సెస్‌ సీబీఐ, స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ వర్సెస్‌ తేజ్‌మల్‌ చౌధరి కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పింది. ఆ అనుమతి లేకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం, అరెస్టు, రిమాండు, ఇతరత్రా చర్యలు తీసుకోవడం కానీ చేయకూడదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సెక్షన్‌ 17ఎ కింద తీసుకోవాల్సిన ముందస్తు అనుమతులను తప్పుగా అర్థం చేసుకొని దాని ప్రభావాన్ని నీరుగార్చింది.

  • ఈ కేసును ప్రధానంగా 17-ఎ కింద సవాలు చేస్తే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు దానిచుట్టూ రకరకాల వాదనలను నమోదుచేసింది. ఆ సెక్షన్‌ వర్తింపునకు మినహాయింపులు సృష్టించింది. వాస్తవానికి అలాంటివేమీ చట్టంలో లేవు.
  • సెక్షన్‌ 482 సీఆర్‌పీసీ జ్యూరిస్‌డిక్షన్‌ను అనుసరించి ఇక్కడ మినీ ట్రయల్‌ అవసరం లేదని ఒకచోట చెప్పిన హైకోర్టు, మరోవైపు కేసు వివరాలను నమోదుచేసింది. తద్వారా మినీట్రయల్‌ నిర్వహించడంతో పాటు, ఆధారాలేవీ లేకుండానే పిటిషనర్‌ వ్యక్తిగత ప్రయోజనం పొందినట్టు ఏకపక్షంగా వ్యాఖ్యానించింది.
  • ఎఫ్‌ఐఆర్‌ నమోదు, తదనంతరం సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు, పిటిషనర్‌ను రిమాండుకు ఇవ్వడంలో ఉన్న అవకతవకల గురించి హైకోర్టు చూడలేదు. అందువల్ల అది ఇచ్చిన తీర్పు చెల్లదు.
  • అవినీతి నిరోధకచట్టంలోని సెక్షన్‌ 19కి సంబంధించి పిల్లి సాంబశివరావు వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ తెలంగాణ కేసులో వచ్చిన తీర్పుపై హైకోర్టు ఆధారపడింది. ఆ కేసుకు, ఈ కేసుకు సంబంధం లేదు.
  • 2018 జూన్‌ 5న రెగ్యులర్‌ ఎంక్వయిరీకి ఆర్డర్‌ చేసినట్లు హైకోర్టు తన తీర్పులోని పేరా 16లో పేర్కొనడం అసంబద్ధం. వాస్తవానికి అది నిజం కూడా కాదు. రికార్డుల్లోని అంశాలకు విరుద్ధం. సెక్షన్‌ 17ఎ నిబంధనను తప్పించుకోవడానికి కొత్తగా చేసిన ఆలోచన అది. ఈ కేసులో విచారణ 2021 సెప్టెంబరు 7న మొదలైనట్లు ఎఫ్‌ఐఆర్‌ స్పష్టంగా చెబుతోంది. 2021 డిసెంబరు 7న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అందులో ఎక్కడా 2018కి సంబంధించి విచారణ, ఫిర్యాదుల గురించి ప్రస్తావించలేదు.
  • 2018 జులై 26కు ముందు జరిగిన కేసులకు సెక్షన్‌ 17-ఎ వర్తించదని హైకోర్టు తన తీర్పులో పేర్కొనడం పూర్తిగా తప్పు. విధాన ప్రక్రియకు సంబంధించిన సవరణలు నేరం ఎప్పుడు జరిగిందన్నదాంతో సంబంధం లేకుండా 2018 జులై 26కి ముందు, తర్వాత తీసుకున్న అన్ని చర్యలూ, అన్ని ఎఫ్‌ఐఆర్‌లు, విచారణలకూ వర్తిస్తుంది. ఈ విషయం ఇప్పటికే చట్టపరంగా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని హైకోర్టు విస్మరించింది.
  • పబ్లిక్‌ సర్వెంట్లు తీసుకున్న నిర్ణయాలపై విచారణకు సెక్షన్‌ 17ఎ కింద పరిమితులు ఉన్న విషయాన్ని ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్‌, రిమాండు రిపోర్టులు స్పష్టంగా చెబుతున్నాయి. ‘‘పైన పేర్కొన్న సూత్రాన్ని పరీక్షించి చూశాం. అయితే డాక్యుమెంట్ల ఆధారంగా డబ్బు చెల్లించాలని పిటిషనర్‌ ఆదేశించడం, దాన్ని దుర్వినియోగం చేయడాన్ని ఆయన అధికారిక విధుల నిర్వహణ కింద పరిగణించలేం. అందువల్ల ఈ ఆరోపిత నేరం గురించి దర్యాప్తు జరపడానికి అధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు’’ అని హైకోర్టు తన తీర్పులోని పేరా 23లో చెప్పడం పూర్తిగా తప్పు. ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధం. ఇలాంటి భాష్యాల వల్ల సెక్షన్‌ 17ఎ కింద పబ్లిక్‌సర్వెంట్లకు ఇచ్చిన రక్షణలు ఎందుకూ పనికిరాకుండా పోతాయి.
  • దర్యాప్తు తుదిదశకు చేరుకున్నట్లు హైకోర్టు పేర్కొంది. ఇది పిటిషనర్‌ను జ్యుడిషియల్‌ కస్టడీ, పోలీసు కస్టడీకి కోరుతూ దర్యాప్తు సంస్థ దాఖలుచేసిన దరఖాస్తుల్లోని అంశాలకు పూర్తి భిన్నం. ఇంకా దర్యాప్తు ప్రారంభదశలో ఉన్నట్లు ప్రతివాదులు చెప్పిన విషయాన్ని హైకోర్టు తీర్పులోని 7వ పేరాలో పేర్కొంది. అందువల్ల ఈ కేసు దర్యాప్తు తుది దశకు వచ్చిందని చెప్పడం ఇందుకు విరుద్ధం.
  • ఎఫ్‌ఐఆర్‌ నమోదైన 20 నెలల తర్వాత, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పిటిషనర్‌ను రాజకీయ కారణాలతో అరెస్టుచేశారు. ఈ ప్రభుత్వం చేస్తున్న నకిలీ ఓట్ల చేరిక, పెద్దఎత్తున ఓట్లను తొలగించడం గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుచేయడంతో పాటు, భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తుండటంతో అడ్డుకోవడానికే అరెస్టు చేశారు. పిటిషనర్‌ రాష్ట్రవ్యాప్త పర్యటనలో ఉండగా ఈ నెల 8వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో నంద్యాలలో ఆయన్ను పోలీసులు చుట్టుముట్టారు. సీఆర్‌పీసీ కింద ఉన్న నిబంధనలను అనుసరించకుండా, అరెస్టుకు కారణాలు చూపకుండా అదుపులోకి తీసుకున్నారు.
  • ఎన్‌ఎస్‌జీ జడ్‌+ సెక్యూరిటీలో ఉన్న పిటిషనర్‌ను ఆర్టికల్‌ 222, సీఆర్‌పీసీ సెక్షన్‌ 167 ప్రకారం సమీపంలోని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచకుండా, రోడ్డుమార్గంలో 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని సీఐడీ ఆఫీసుకు తీసుకెళ్లారు.
  • పిటిషనర్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో ఏపీ సీఐడీ పోలీసులు అక్కడి అధికారపార్టీ చెప్పినట్లు నడుచుకొని అరెస్టుచేయడం పూర్తిగా రాజకీయ కక్షసాధింపు కిందికి వస్తుంది. పిటిషనర్‌, ఆయన కుటుంబసభ్యులు, పార్టీలోని ఇతర వ్యక్తులను ఇందులో ఇరికించడానికి సీఐడీ పోలీసులు అధికారులను బెదిరిస్తున్నారు’’ అని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసును చంద్రబాబు తరఫు న్యాయవాదులు సోమవారం సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేసే అవకాశం ఉంది. ఆ ధర్మాసనం ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా తదుపరి విచారణ ప్రక్రియ సాగుతుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని