సీఎం ఇలాకాలో భారీ భూ కుంభకోణం

ముఖ్యమంత్రి జగన్‌ ఇలాకా పులివెందులలో భారీ భూకుంభకోణం వెలుగు చూసింది. రూ.100 కోట్ల విలువైన చుక్కల భూములకు నకిలీ నిరభ్యంతర పత్రాల (ఎన్‌వోసీ)తో రిజిస్ట్రేషన్లు జరిగాయి.

Updated : 25 Sep 2023 06:47 IST

జిల్లా కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ
నకిలీ ఎన్‌వోసీలతో రిజిస్ట్రేషన్లు
పులివెందుల, కడప రెవెన్యూ అధికారుల పాత్ర
స్థిరాస్తి దళారీపై పోలీసులకు ఫిర్యాదు
కేసు నమోదులో తాత్సారంపై విమర్శలు

ఈనాడు, కడప: ముఖ్యమంత్రి జగన్‌ ఇలాకా పులివెందులలో భారీ భూకుంభకోణం వెలుగు చూసింది. రూ.100 కోట్ల విలువైన చుక్కల భూములకు నకిలీ నిరభ్యంతర పత్రాల (ఎన్‌వోసీ)తో రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ అక్రమంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, దళారులు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం, రెవెన్యూ శాఖలో కొందరు అధికారుల పాత్ర ఉన్నట్లు తేలింది. ముఖ్యమంత్రి ఇలాకా పులివెందులలో అక్రమం వెలుగులోకి రావడం సంచలనం కలిగిస్తోంది. ఈ దందా జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు దృష్టికి వెళ్లింది. తన సంతకం ఫోర్జరీ చేయడంతో పాటు తన అనుమతి లేకుండా ఎన్‌వోసీలు జారీ కావడాన్ని గుర్తించారు. ఈ మేరకు ప్రాథమిక విచారణలో 12 ఎన్‌వోసీలతో 35 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు గుర్తించారు. వీటిని వెంటనే రద్దు చేయాలంటూ పులివెందుల తహసీల్దార్‌ కల్లూరి మాధవ కృష్ణారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.

సీఎం సమీప బంధువులూ బాధితులే

పులివెందులకు చెందిన పత్తి నాగేశ్వరరావుకు కె.వెలమవారిపల్లె గ్రామం సర్వే నంబరు 99/3లో ఉన్న 2.98 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన రిజిస్ట్రేషన్ల రద్దుకు ప్రక్రియ నడుస్తోంది. ఈ అక్రమంపై పోలీసులకు ఆర్డీవో వెంకటేశులు, తహసీల్దార్‌ శనివారం ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో స్థిరాస్తి దళారీ శ్రీపతి శ్రీనివాస్‌, వీఆర్వో కళానంద్‌రెడ్డి, సర్వేయర్లు సందీప్‌రెడ్డి, వాసుదేవరెడ్డిల పాత్ర ఉన్నట్లుగా గుర్తించి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పులివెందుల పురపాలక సంఘం పరిధిలోని ఈ భూమి మార్కెట్‌ విలువ రూ.2.89 కోట్లు ఉంటుందని అధికారులు తేల్చారు. డీకేటీ పట్టా తీసుకున్న లబ్ధిదారు.. తన భూమిని విక్రయించుకునేందుకు కలెక్టరు నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇందుకోసం కొందరు కలెక్టరు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఎన్‌వోసీలతో దందా సాగించినట్లు వెలుగులోకి వచ్చింది. ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చిన మేరకు భూదందా విలువ రూ.100 కోట్లవరకూ ఉంది. ఈ తరహాలో జరిగిన క్రయ విక్రయాల్లో మోసపోయిన వ్యక్తుల్లో సీఎం జగన్‌ సమీప బంధువులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


అక్రమాలు ఎక్కడంటే?

పులివెందుల పురపాలక సంఘం పరిధిలో భూముల విలువ భారీగా పెరిగింది. అవుటర్‌ రింగ్‌ రోడ్డు వచ్చాక.. మరింతగా ధరలు పెరిగాయి. అక్కడే కె.వెలమవారిపల్లెలో సర్వే నంబరు 99/3లో 2.98, 99/1లో 4.26, 98/1లో 1.07, అహోబిలపురంలో 2/2ఎలో 4.55, 45/2లో 4.8, యర్రగుడిపల్లెలో 135/2లో 3, 135/2లో 3.87, బాకరాపురంలో 58/2లో 4.91, బ్రాహ్మణపల్లెలో 48/3లో 1.41, చిన్నరంగాపురంలో 220/2లో 3.51 ఎకరాల వంతున మొత్తం 34.36 ఎకరాల భూమికి అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తేలింది.ఈ ఏడాది ఫిబ్రవరి 7న నకిలీ ఎన్‌వోసీలు జారీ అయ్యాయి. కలెక్టరు కార్యాలయంలో ఓ అధికారి అండదండలతోనే ఇవి జారీ అయినట్లు అనుమానిస్తున్నారు. పులివెందులలో ఎకరం రూ.3 కోట్ల వరకు ధర పలుకుతోంది. పులివెందుల పురపాలక పరిధిలో కె.వెలమవారిపల్లె, అహోబిలపురం, యర్రగుడిపల్లె, బాకరాపురం, బ్రాహ్మణపల్లె, చిన్నరంగాపురం తదితర గ్రామాల్లో చుక్కల భూములున్నాయి. ఈ భూములకు రిజిస్ట్రేషన్‌ జరగడంతో ఇవి పట్టా భూములుగా మారిపోయాయి. రిజిస్ట్రేషన్‌ తర్వాత ఇళ్ల స్థలాల కోసం ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారు.


అధికార పార్టీ నేతల హస్తం

నకిలీ ఎన్‌వోసీలు సృష్టించడంలో వైకాపా నేతల హస్తం ఉంది. కలెక్టర్‌ సంతకాన్ని ఫోర్జరీ చేయడం, నకిలీ పత్రాల తయారీపై పులివెందుల ఆర్డీవో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించడం లేదు. అధికార పార్టీ ఒత్తిళ్లతో కేసు నమోదు చేయలేదు. రెండు రోజుల్లో అధికారులు చర్యలు తీసుకోకపోతే అన్ని ఆధారాలతో కుంభకోణాన్ని మొత్తం బయటపెడతాం. ఇది వరకు ఎసైన్డ్‌ భూముల వ్యవహారంలోనూ అక్రమాలు జరగ్గా.. వెలుగులోకి తెచ్చాక పేదలకు న్యాయం జరిగింది. పులివెందుల కేంద్రంగా భారీ భూ దందాలు సాగుతున్నా పట్టించుకోవడంలేదు.

రాంగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు