అమరావతిపై జగన్ ప్రభుత్వం కక్ష
ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సీఎం జగన్ ఎలా సర్వనాశనం చేశారో, ఎంత కక్షసాధింపుతో వ్యవహరించారో భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక బయటపెట్టింది.
సవరించిన డీపీఆర్లు పంపాలని కేంద్రం అడిగినా చేతులు రాలేదు
అందుకే కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందలేదు
ప్రజావేదిక కూల్చివేతతో రూ.11.91 కోట్ల నష్టం
అంబేడ్కర్ స్మృతివనం నిలిపివేత వల్ల రూ.46.61 కోట్లు వృథా
తూర్పారబట్టిన కాగ్ నివేదిక
ఈనాడు, అమరావతి: ఆంధ్రుల కలల రాజధాని అమరావతిని సీఎం జగన్ ఎలా సర్వనాశనం చేశారో, ఎంత కక్షసాధింపుతో వ్యవహరించారో భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక బయటపెట్టింది. జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని పనుల్ని నిలిపివేయడంతో.. అప్పటికే అక్కడ మౌలిక వసతులపై ఖర్చుపెట్టిన రూ.వేలకోట్లు వృథా అయినట్టు తెలిపింది. రాజధాని నిర్మాణానికి సాయం చేయాలని కేంద్రాన్ని వైకాపా ప్రభుత్వం ఒక్కసారి కూడా అడగలేదు సరికదా... గత ప్రభుత్వ హయాంలో పంపిన డీపీఆర్లలో కొన్ని సవరణలు చేసి పంపాలని కేంద్ర ప్రభుత్వం 2019 మేలో సూచించినా స్పందించలేదు. చివరకు నీతి ఆయోగ్ గుర్తుచేస్తే 2022 జూన్లో తీరిగ్గా స్పందించింది. వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి తదుపరి సాయం అందలేదని కాగ్ ఎండగట్టింది. 2014 జూన్ నుంచి 2021 సెప్టెంబరు వరకు రాజధాని అమరావతికి సంబంధించి ఆడిట్ వివరాల్ని కాగ్ తన నివేదికలో పొందుపరిచింది. ప్రజావేదికను కూల్చివేయడం వల్ల రూ.11.91 కోట్లు, అంబేడ్కర్ స్మృతివనం ప్రాజెక్టును నిలిపివేయడంతో రూ.44.61 కోట్లు వృథా అయ్యాయని.. ఈ ప్రాంతానికి ఒక మైలురాయిలా నిలిచే ప్రాజెక్టును కోల్పోయినట్టయిందని కాగ్ వ్యాఖ్యానించింది. 2019 మే నుంచి జగన్ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని నిలిపివేయడంతో రాజధానికి భూ సమీకరణలో స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు జరిగిన నష్టాన్ని కాగ్ వివరించింది. నివేదికలోని ముఖ్యాంశాలు..
కేంద్ర సాయానికి మోకాలడ్డు
అమరావతికి కేంద్రప్రభుత్వం 2015 మార్చి నుంచి 2017 ఫిబ్రవరి మధ్య రూ.1,500 కోట్లు అందజేసింది. రాజధాని నిర్మాణానికి వివిధదశల్లో రూ.1,09,023 కోట్లు ఖర్చవుతుందని గత ప్రభుత్వం అంచనావేసింది. నీతి ఆయోగ్కి రూ.39,937 కోట్లకు 2018 ఆగస్టులో 33 డీపీఆర్లు సమర్పించింది. 2018 డిసెంబరులో రూ.22,686 కోట్లకు మరో 14 డీపీఆర్లు అందజేసింది. తొలివిడతలో అందజేసిన 33 డీపీఆర్లను నీతి ఆయోగ్ 2019 ఏప్రిల్లో... కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధిశాఖకు పంపి సాధ్యాసాధ్యాలు పరిశీలించి, అభిప్రాయం తెలియజేయాలని కోరింది. కేంద్ర ప్రజాపనుల విభాగం 2019 మేలో ఆంధ్రప్రదేశ్ పురపాలకశాఖకు తన అభ్యంతరాల్ని తెలియజేస్తూ, సవరించిన డీపీఆర్లు పంపాలని సూచించింది. రాష్ట్రప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, 2022 మేలో నీతి ఆయోగ్ గుర్తుచేసింది. 2022 జూన్లో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది.
ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధికి ఖర్చుపెట్టింది రూ.183 కోట్లే
రాజధానికి భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన ఎల్పీఎస్ లేఅవుట్లను 14 జోన్లుగా విభజించారు. వాటిలో రెండు జోన్లకు ఇంకా టెండర్లు పిలవలేదు. మిగతా 12 జోన్లలో మౌలిక వసతుల పనుల్ని 16 ప్యాకేజీలుగా విభజించారు. వాటిలో రూ.13,802.75 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి పనులు ప్రారంభించగా... 2021 సెప్టెంబరు నాటికి రూ.183.04 కోట్లే ఖర్చుపెట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక పనులు నిలిపివేయడంతో.. మిగతా ప్యాకేజీల పనులు అసలు ప్రారంభించనేలేదు. రైతులకు మూడేళ్లలో స్థలాలు అభివృద్ధి చేసి ఇస్తామన్న హామీ నెరవేరలేదు.
దాదాపు సిద్ధమైన వాటినీ అందుబాటులోకి తేలేదు
అమరావతి పరిపాలన నగరంలో నిర్మాణ పనుల్ని గత ప్రభుత్వం రూ.6,848.58 కోట్లతో చేపట్టింది. షెడ్యూలు ప్రకారం 2018 సెప్టెంబరు నుంచి 2021 మార్చి మధ్య మొత్తం పనులు పూర్తికావాలి. వీటిని 19 ప్యాకేజీలుగా విభజించగా ఆరు ప్యాకేజీల పనులే 25-95% పూర్తయ్యాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసుల అధికారుల నివాస గృహాలు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు అక్కడ రూ.1,505.22 కోట్లు వెచ్చించి చేపట్టిన నిర్మాణాలు వృథాగా మారాయి.
ఈ ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయమూ లేదు
రాజధానిలో మౌలిక వసతుల నిర్మాణానికయ్యే రూ.55,343 కోట్లలో సీఆర్డీఏ 2016-2023 మధ్య వివిధరూపాల్లో రూ.11,487 కోట్లు సమీకరించుకోగలిగింది. 2018-19 నుంచి ఏడేళ్లపాటు ఏటా రూ.1,800 కోట్ల చొప్పున రాజధాని నిర్మాణానికి ఇచ్చేందుకు 2019 ఫిబ్రవరిలో గత ప్రభుత్వం అంగీకరించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సాయం అందలేదు. సీఆర్డీఏ హడ్కో, బ్యాంకుల కన్సార్షియం, బాండ్ల రూపంలో రూ.5,013.60 కోట్లు సమీకరించింది. కానీ ప్రధాన మౌలిక వసతులు, ఎల్పీఎస్ లేఅవుట్ల అభివృద్ధి పనుల్లో ఆశించిన పురోగతి లేదు. పనులు చేసినా, చేయకపోయినా... ఈ రుణాలపై భవిష్యత్తులో రూ.3,428.12 కోట్ల వడ్డీ చెల్లించాలి.
రైతులకు ఆ సదుపాయాలన్నీ ఆగిపోయాయి
రాజధానికి భూములిచ్చిన రైతులకు గత ప్రభుత్వం వార్షికకౌలు చెల్లించడంతో పాటు... భూమిలేని పేదలకూ అదనపు వసతులు కల్పించింది. అన్నక్యాంటీన్లు ఏర్పాటుచేసింది. ఆరోగ్యకార్డులు అందజేసింది. వ్యాపారాలు చేసుకునేందుకు తక్కువ వడ్డీతో రుణాలు, ఇళ్లులేని పేదలకు గృహవసతి వంటి సదుపాయాలు తలపెట్టింది. ఈ ప్రభుత్వం వచ్చాక అవన్నీ నిలిచిపోయాయి.
విద్యుత్లైన్ల ఖర్చు బూడిదలో పోసినట్టే
రాజధానిలో 400 కేవీ హైవోల్టేజి లైన్లను దారి మళ్లించేందుకు రూ.491.93 కోట్లతోను, 220 కేవీ హై వోల్టేజి లైన్లను భూగర్భంలో వేసేందుకు రూ.883.55 కోట్లతోను ప్రతిపాదనలు రూపొందించారు. ఏపీ ట్రాన్స్కో టెండర్లు పిలిచి పనులు అప్పగించింది. 220 కేవీ లైన్లకు ఒక గుత్తేదారు సంస్థ 116.41 కి.మీ. పొడవైన రూ.208.67 కోట్ల విలువైన కేబుళ్లను సరఫరా చేసింది. జగన్ ప్రభుత్వం రాజధాని పనుల్ని నిలిపివేయడంతో.. భూగర్భలైన్ల ప్రతిపాదనను సీఆర్డీఏ రద్దుచేసుకుంది. ఆ కేబుళ్లను మరెక్కడైనా వాడేసుకోమని ఉచిత సలహా ఇచ్చింది. కానీ రాష్ట్రంలో తాము మరెక్కడా అలాంటి ప్రాజెక్టు చేపట్టడం లేదని ఏపీ ట్రాన్స్కో స్పష్టంచేసింది. ఆ కేబుళ్లు వృథాగా పడి ఉన్నాయి.
- 400 కేవీ లైన్లు దారి మళ్లించేందుకు రూ.394.60 కోట్లతో ట్రాన్స్కో ఒక సంస్థకు కాంట్రాక్టు అప్పగించింది. ఇప్పటివరకు రూ.60 కోట్లు ఖర్చయింది. ఆ ఖర్చూ వృథానే.
చేసిన పనులన్నీ వృథా
- రూ.163.97 కోట్లతో కొన్న పైపులు వివిధ ప్రాంతాల్లో వృథాగా పడి ఉన్నాయి.
- రాజధానిని జాతీయ రహదారి-16తో కనకదుర్గ వారధి వద్ద అనుసంధానించేందుకు తలపెట్టిన సీడ్యాక్సెస్ రోడ్డు అసంపూర్తిగా మిగిలింది. మొత్తం 21.34 కి.మీ. రహదారిలో 14.47 కి.మీ.లే పూర్తిచేశారు.
- కృష్ణానదిపై రూ.1,387 కోట్లతో తలపెట్టిన ఐకానిక్ బ్రిడ్జిని ఈ ప్రభుత్వం నిలిపివేసింది. దానిపై అప్పటికే డిజైన్లు, డ్రాయింగ్ల కోసం ఖర్చుపెట్టిన రూ.2.22 కోట్లు వృథా అయింది.
- అమరావతిలోని శాఖమూరు పార్కులో రూ.1.86 కోట్లతో అంతర్గత రహదారుల నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టు నిలిచిపోవడంతో అవన్నీ వృథాగా మారాయి.
- ఎల్పీఎస్ లేఅవుట్లలో పిచ్చిమొక్కలు తొలగించడానికి 2017 మే నుంచి 2018 మే మధ్య రూ.10.87 కోట్లు వెచ్చించారు. 2019 మేలో ప్రభుత్వం ఆ పనులు నిలిపివేయడం, రైతులకు ఇవ్వకపోవడంతో ఆ నిధులు వృథా అయ్యాయి.
స్టార్టప్ ప్రాజెక్టు రద్దు వల్ల రూ.11.16 కోట్ల నష్టం
రాజధానిలో 1,691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్కి చెందిన అసెండాస్-సింగ్బ్రిడ్జి, సెంబ్కార్ప్ సంస్థల కన్సార్షియం, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీఎల్) సంయుక్తంగా అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ (ఏడీపీపీఎల్) పేరుతో కంపెనీ ఏర్పాటుచేశాయి. జగన్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును అర్ధంతరంగా రద్దుచేసి, ఏడీపీపీఎల్ను లిక్విడేట్ చేయడంతో ప్రభుత్వానికి రూ.11.16 కోట్ల నష్టం వాటిల్లింది.
- ఇండో-యూకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఐయూఐహెచ్)కి ఎకరం రూ.50 లక్షల చొప్పున 150 ఎకరాల్ని 2016లో ప్రభుత్వం కేటాయించింది. ఆ సంస్థ సీఆర్డీఏకి రూ.24.99 కోట్లు చెల్లించింది. గడువులోగా ప్రాజెక్టు చేపట్టనందుకు ఆ సంస్థకు భూకేటాయింపును 2019 ఏప్రిల్లో సీఆర్డీఏ రద్దుచేసింది. ఆ సంస్థ కట్టిన డబ్బు జప్తుచేయాలి. ఆ సంస్థ విజ్ఞప్తి చేయడంతో సీఆర్డీఏ 2020 జనవరిలో ఆ నిధుల్ని నిబంధనలకు విరుద్ధంగా తిరిగి చెల్లించింది.
- గుత్తేదారులకు రాజధానిలో వారి మెటీరియల్, పరికరాలు ఉంచుకోవడానికి ఎకరం రూ.లక్ష చొప్పున సీఆర్డీఏ లీజుకిచ్చింది. కానీ గుత్తేదారు సంస్థల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేదు. వారి బకాయి రూ.4.09 కోట్లు.
- 30 పనులకు గుత్తేదారులకు రూ.1,282.83 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్గా ఇచ్చారు. దానిలో రూ.338.57 కోట్లే రికవరీ చేశారు. 2021 సెప్టెంబరు నాటికి రూ.944.26 కోట్లు గుత్తేదారుల వద్దే ఉన్నాయి.
- రాజధానిలో వివిధ అవసరాలకు మట్టి తవ్వుకున్న గుత్తేదారుల నుంచి రూ.12.83 కోట్లు వసూలు చేయాలి.
ప్రజావేదిక కూల్చివేయడం వల్ల రూ.11.91 కోట్ల నష్టం
కృష్ణా కరకట్టకు, నదికి మధ్యలో రూ.7.85 కోట్లతో సీఆర్డీఏ ప్రజావేదిక (గ్రీవెన్స్ సెల్) నిర్మించింది. అనుబంధ వసతుల కోసం మరో రూ.4.06 కోట్లు వెచ్చించింది. ఆ భవన నిర్మాణానికి జలవనరులశాఖ, సీఆర్డీఏ ప్రణాళికా విభాగం నుంచి అనుమతులు తీసుకోలేదు. సీఆర్డీఏ ఇంజినీరింగ్ విభాగం ఆ భవనాన్ని నిర్మించింది. ఈ ప్రభుత్వం దాన్ని కూలగొట్టడంతో మొత్తం రూ.11.91 కోట్ల ప్రజాధనం వృథా అయింది.
అంబేడ్కర్ స్మృతివనం నిలిపివేయడం వల్ల రూ.44.61 కోట్లు వృథా
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ శత జయంత్యుత్సవాల్ని పురస్కరించుకుని రాజధానిలో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూ.97.69 కోట్ల అంచనా వ్యయంతో 20 ఎకరాల్లో అంబేడ్కర్ స్మృతివనాన్ని గత ప్రభుత్వం తలపెట్టింది. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహంతో పాటు పలు వసతులు కల్పించాలని తలపెట్టింది. రూ.44.61 కోట్లు ఖర్చుచేశాక... పనులు నిలిపివేయడంతో ఆ మొత్తం వృథా అయింది.
నాలుగున్నరేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే..
జగన్ అధికారంలోకి వచ్చాక 2019 మే నుంచి రాజధాని పనుల్ని ఎక్కడికక్కడ నిలిపివేశారు. ప్రభుత్వవిధానం ప్రకారం అప్పటికే 25% పూర్తయిన పనుల్ని కొనసాగించాలి. ఆ విధానాన్ని రాజధానికి వర్తింపజేయలేదు. రాజధానిలో మౌలిక వసతుల పనుల్ని సీఆర్డీఏ మూడు కేటగిరీలుగా విభజించింది. వాటికి రూ.55,343 కోట్లు అవసరమని అంచనావేసింది. ప్రధాన రహదారులు, బ్రిడ్జిల నిర్మాణం, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు రూ.19,769 కోట్లు, ఎల్పీఎస్ లేఅవుట్లలో మౌలిక వసతులకు రూ.17,910 కోట్లు, ప్రభుత్వ భవనాలకు రూ.14,008 కోట్లు కావాలని అంచనా వేసింది. వాటిలో రూ.33,476.33 కోట్లకు సంబంధించిన 57 ప్యాకేజీల పనులకు టెండర్లు ఖరారు చేసి పనులు అప్పగించింది. రాజధాని నిర్మాణం నిలిపివేసేనాటికి... ఇంకా రూ.29,385.02 కోట్ల పనులు చేయాల్సి ఉంది. వాటిలో ప్రధాన మౌలిక వసతుల పనుల్ని 22 ప్యాకేజీలుగా విభజించారు. రూ.12,824 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టగా... 2021 అక్టోబరు నాటికి రూ.3,213.41 కోట్లు ఖర్చుచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
CM Jagan: పిల్లల కళ్లజోళ్ల మీదా ఆయన బొమ్మే
జగన్ ప్రచార కాంక్షకు మరో ఉదాహరణ. పిల్లలకు ఇచ్చే కళ్లజోళ్ల మీద కూడా ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఫొటోలు దర్శనమిచ్చాయి. -
AP Officers: ప్రభుత్వం మారితే మా పరిస్థితేంటి?
‘అధికారాంతమునందు చూడవలె అయ్యవారి సౌభాగ్యముల్..’ అని కవివాక్కు. ఇది ప్రభుత్వ పెద్దలకే కాదు... వారి అండ చూసుకొని విర్రవీగిన అధికారులకూ వర్తిస్తుంది. -
Chandrababu: సభలు, సమావేశాల్లో పాల్గొనొచ్చు
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈనెల 20న ఇచ్చిన పూర్తిస్థాయి బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీం కోర్టు డిసెంబరు 8కి వాయిదా వేసింది. -
అనగనగా అవుకు.. పూర్తికాకుండానే టముకు
అనగనగా అదొక అవుకు టన్నెల్. గాలేరు నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా కొండలను తొలచి నిర్మిస్తున్నారు. ఎప్పుడో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఒక టన్నెల్ను తవ్వి (రెండు చిన్న డైవర్షన్ ఛానళ్లతో) 10వేల క్యూసెక్కుల నీటిని గండికోట జలాశయానికి తరలించేలా నిర్మించారు. -
Margadarsi Chit Fund Case: లుక్ఔట్ సర్క్యులర్ కోర్టు ధిక్కరణ కాదా?
ఎలాంటి కఠిన చర్యలూ చేపట్టరాదంటూ ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా.. మార్గదర్శి ఎండీకి వ్యతిరేకంగా లుక్ఔట్ సర్క్యులర్(ఎల్ఓసీ)ను ఎలా జారీ చేశారని ఏపీ సీఐడీని తెలంగాణ హైకోర్టు నిలదీసింది. -
ప్రతి గ్రామానికీ నాణ్యమైన విద్యుత్
ప్రతి గ్రామానికి, రైతుకు నాణ్యమైన విద్యుత్ను అందించేలా మౌలిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని సీఎం జగన్మోహన్రెడ్డి తెలిపారు. -
ఇంటర్ విద్యార్థుల ఘర్షణ.. శిరోముండనం చేయించిన కళాశాల యాజమాన్యం!
నంద్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఘర్షణ జరిగి సోమవారం రాత్రి సీనియర్, జూనియర్ విద్యార్థులు ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. -
అడిగేదెవరని.. అడ్డే లేదని!
ఆంధ్ర విశ్వవిద్యాలయం (ఏయూ) ఉపకులపతి(వీసీ)గా ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి తన పదవీకాలంలో ఏపీ విశ్వవిద్యాలయాల చట్టం, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా పలు నియామకాలు చేపట్టారని ఆరోపిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అలుమ్ని అసోసియేషన్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. -
చదువూ లేదు.. కొలువూ రాదు!
పేదల పక్షపాతిని అని పదేపదే చెప్పుకొనే సీఎం జగన్... బీద బిడ్డలు ఎక్కువగా చదివే పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)ను గాలికొదిలేశారు. చాలా ఐటీఐల్లో బోధన సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. -
Vizag: సాగర సర్పం.. కాటేస్తే కష్టం
విశాఖ నగర పరిధి సాగర్నగర్ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు మంగళవారం ఓ విషపూరిత పాము చిక్కింది. -
ఇక్కడ ఓటుంటేనే గుంతలు పూడుస్తాం
ఓటరు కార్డులను ప్రామాణికంగా తీసుకుని అభివృద్ధి పనులు చేపట్టాలనే విచిత్ర ఆలోచన చంద్రగిరి నియోజకవర్గ అధికార పార్టీ నేతలకు వచ్చింది. -
ఆ తీర్పును తెలుగు చేసి పోలీసులకు పంపండి
లలితకుమారి వర్సెస్ ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రతిని రాష్ట్రంలోని పోలీసు అధికారులకు మరోసారి పంపాలని రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. -
నిరుపయోగంగా ఏకరూప దుస్తులు
-
ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు
కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఇద్దరు ఉన్నతాధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామలరావు, కళాశాల విద్యాశాఖ కమిషనర్ పోలా భాస్కర్కు నెల రోజుల సాధారణ జైలు శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. -
మౌనంగా విన్నారు.. వెళ్లారు
ఓటర్ల జాబితా పరిశీలకుడు, ఏపీ పొల్యూషన్ బోర్డు మెంబర్ సెక్రటరీ బి.శ్రీధర్ తొలి విడత జిల్లా పర్యటన గంటన్నర వ్యవధిలో ముగిసింది. ప్రధాన రాజకీయ పక్షాలు, అధికారులు చెప్పింది మౌనంగా విన్నారు. -
ఎస్ఆర్ఎం వీసీ మనోజ్ కుమార్కు ప్రతిష్ఠాత్మక ‘భాస్కర’ అవార్డు
ఏపీ-ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ఆచార్య మనోజ్ కుమార్ అరోడాకు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రతిష్ఠాత్మకమైన ‘భాస్కర’ అవార్డు లభించింది. -
ఇదేం అస్తవ్యస్త ఇసుక విధానం?
ఇసుక తవ్వకాలపై రాష్ట్రప్రభుత్వ విధానాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల లారీ యజమానులు మండిపడ్డారు. -
బ్రిటిష్ పాలనను తలదన్నేలా రాష్ట్రంలో నిర్బంధకాండ
-
వైకాపా నాయకులు వేధిస్తున్నారని.. అయిదుగురు వాలంటీర్ల రాజీనామా
‘వైకాపా నాయకుల వేధింపులు భరించలేకున్నాం. పని కూడా చేయలేకపోతున్నాం’ అని ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయునిపేట సచివాలయానికి చెందిన అయిదుగురు వాలంటీర్లు రాజీనామా చేశారు. -
వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడి ఉద్రిక్తం
రాష్ట్రంలో కరవు మండలాలను ప్రకటించాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని మంగళవారం భాజపా కిసాన్ మోర్చా చేపట్టిన వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. -
అంగట్లో బోగస్ సర్టిఫికెట్లు
సచివాలయ పశుసంవర్ధక శాఖ సహాయకులుగా విధులు నిర్వర్తించేందుకు అవసరమైన నకిలీ ధ్రువపత్రాలు బహిరంగ మార్కెట్లో పెద్దఎత్తున లభ్యమవుతుండటం కలకలం రేపుతోంది.


తాజా వార్తలు (Latest News)
-
Nani: అందుకే వైజాగ్ నాకు ప్రత్యేకం: ‘హాయ్ నాన్న’ ఈవెంట్లో నాని
-
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
-
Minerals Auction: ₹45 వేల కోట్ల విలువైన ఖనిజ బ్లాకులకు ఈ-వేలం షురూ
-
Ts election: దేవుడి తోడు ఆ గుర్తుకే ఓటేస్తా.. రూ.వెయ్యి తీసుకుని ఓటర్ల ప్రమాణం
-
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
-
Sandeep Vanga: ‘స్పిరిట్’.. ‘యానిమల్’లా కాదు.. మహేశ్తో సినిమా ఉంటుంది: సందీప్