Vijayawada: సీఎం సభకు మీరు రాకుంటే.. మా ఉద్యోగాలు పోతాయ్‌

విజయవాడలోని విద్యాధరపురం మినీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభ కోసం డ్వాక్రా మహిళలందరూ కచ్చితంగా రావాల్సిందేనని.. వారిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు.

Updated : 28 Sep 2023 09:03 IST

డ్వాక్రా మహిళలపై రిసోర్స్‌ పర్సన్‌ల ఒత్తిడి

ఈనాడు, అమరావతి: విజయవాడలోని విద్యాధరపురం మినీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి సభ కోసం డ్వాక్రా మహిళలందరూ కచ్చితంగా రావాల్సిందేనని.. వారిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. మహిళలను తీసుకొచ్చే బాధ్యతను ఉన్నతాధికారులు ఆయా గ్రూపులను పర్యవేక్షించే రిసోర్స్‌ పర్సన్‌(ఆర్‌పీ)లపై పెట్టారు. దీంతో.. తన గ్రూపు సభ్యులందరూ తప్పనిసరిగా ముఖ్యమంత్రి సభకు రావాల్సిందేనంటూ.. ఓ రిసోర్స్‌ పర్సన్‌ పెట్టిన వాయిస్‌ మెసేజ్‌ సామాజిక మాధ్యమాల్లో బుధవారం వైరల్‌గా మారింది.

‘అందరికీ శుభోదయం. గ్రూపు సభ్యులందరికీ ఫోన్లు చేస్తూనే ఉన్నాను. ఇంకెవరైనా తెలియని వారు ఉంటే వాళ్ల కోసం ఈ వాయిస్‌ మెసేజ్‌ పెడుతున్నాను. విద్యాధరపురంలోని స్టేడియంలో ముఖ్యమంత్రి కార్యక్రమం ఉంది. శుక్రవారం ఉదయం 8.30గంటల లోపు గ్రూపు సభ్యులందరూ మా ఇంటికి రావాలి. అక్కడి నుంచి ఆటోల్లో మిమ్మల్ని సభ జరిగే దగ్గరికి తీసుకెళ్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు. మాకు ఒక్కొక్కరికీ 150 మందిని తీసుకురావాలని ఆదేశించారు. ఒకవేళ తీసుకువెళ్లకపోతే.. మరుసటి రోజు ఉద్యోగానికి రావాల్సిన పనిలేదని చెప్పారు. దీనినిబట్టి పైనుంచి మాపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోండి. మీరు మా సమస్యను అర్థం చేసుకుని, శుక్రవారం ఉదయం మా ఇంటి దగ్గరికి రావాలి. నేను నిన్నటి నుంచి అందరికీ ఫోన్లు చేస్తూనే ఉన్నాను. ఏమీ అనుకోవద్దు.. అర్థం చేసుకోండి. రాలేకపోయామంటూ ఫోన్లు చేసి కారణాలు చెప్పొద్దని ముందే చెబుతున్నాను. కచ్చితంగా రావాల్సిందే.’ అని తన పరిధిలోని డ్వాక్రా గ్రూపుల సభ్యులకు విజయవాడకు చెందిన ఓ రిసోర్స్‌ పర్సన్‌ వాయిస్‌ మెసేజ్‌ పెట్టడం ప్రస్తుతం కలకలం రేపుతోంది.

బలవంతంగా తరలింపు..

ముఖ్యమంత్రి జగన్‌ సభలకు డ్వాక్రా గ్రూపులను బలవంతంగా తరలించడంపై మహిళల నుంచి తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. రాజధానిలో సెంటు పట్టాల పంపిణీ కార్యక్రమం సహా ఎక్కడ సభలు జరిగినా డ్వాక్రా గ్రూపుల నిర్వహణను చూసే ఆర్‌పీలు, ఇతర సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి తెచ్చి, జనాన్ని తరలిస్తున్నారు. సభలకు వచ్చేందుకు డ్వాక్రా మహిళలు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో.. వారిపై ఒత్తిడి తెచ్చి మరీ తీసుకెళ్తున్నారు. తాజాగా శుక్రవారం విజయవాడ విద్యాధరపురంలోని స్టేడియంలో వై.ఎస్‌.ఆర్‌. వాహన మిత్ర  అయిదో విడత  పథకం నిధుల విడుదల కార్యక్రమం జరగబోతోంది. ఈ సభకు డ్వాక్రా గ్రూపు మహిళలను పెద్దసంఖ్యలో తీసుకురావాలని పైనుంచి ఆదేశాలు వచ్చాయి. ఆ బాధ్యతను ఆర్‌పీలపై పెట్టడంతో వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని