మా కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతించండి

‘వైకాపా వాళ్లు నా రూ.16 కోట్ల విలువైన ఆస్తి మోసం చేసి దోచుకున్నారు. జగనన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే దొంగలను పట్టుకోండి. న్యాయం చేయ లేకపోతే మేం ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించండి. నన్ను మోసం చేసిన వ్యక్తి ఇతనే..

Updated : 03 Oct 2023 13:07 IST

రూ.16 కోట్లు మోసం చేసిన వ్యక్తికి మీ ఎమ్మెల్యే అండగా నిలిచారు
మిమ్మల్ని కలిసేందుకు అనుమతి రావడం లేదు
సీఎంను ఉద్దేశించి కారుపై లేఖలు అంటించిన బాధితుడు
వైకాపా కేంద్ర కార్యాలయం వద్ద ఆ వాహనం వదిలేసి నిరసన

ఈనాడు, అమరావతి: ‘వైకాపా వాళ్లు నా రూ.16 కోట్ల విలువైన ఆస్తి మోసం చేసి దోచుకున్నారు. జగనన్నా మీకు చిత్తశుద్ధి ఉంటే దొంగలను పట్టుకోండి. న్యాయం చేయ లేకపోతే మేం ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతించండి. నన్ను మోసం చేసిన వ్యక్తి ఇతనే.. మీ పార్టీ ఎమ్మెల్యే గంగుల నానితో మీతో ఆ వ్యక్తి దిగిన ఫొటోలివిగో..’ అంటూ వీటన్నింటినీ ఒక కారుపై అతికించి, తన మొబైల్‌ నంబరును కూడా వేసి ఆ కారును సోమవారం వైకాపా కేంద్ర కార్యాలయం వద్ద బాధితుడు సిద్ధంరెడ్డి రమణారెడ్డి అనే వ్యక్తి వదిలేసి వెళ్లారు. నాలుగేళ్లుగా న్యాయం కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఈ పని చేశానని ఆయన పేర్కొన్నారు. జిల్లా స్పందనలో 33 సార్లు ఫిర్యాదు చేశానని, ముఖ్యమంత్రిని కలిసి విన్నవించుకుందామంటే అనుమతి రాలేదని వాపోయారు. తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పుకొనేందుకు అనుమతినివ్వండి అంటూ చేతిలో మైకు పట్టకుని సీఎం క్యాంపు కార్యాలయం పరిసర ప్రాంతాల్లో ముఖ్యమంత్రికి వినిపించేలా గట్టిగా విజ్ఞప్తి చేశారు. తాను తీసుకున్న సెల్ఫీ వీడియోనూ చూపించారు. కారును వదిలేసి విజయవాడకు చేరుకున్న బాధితుణ్ని మీడియా ప్రతినిధులు కలిసి వాకబు చేయగా తనకు జరిగిన నష్టాన్ని వివరించారు.

రూ.16 కోట్ల ఆస్తిని దౌర్జన్యంగా తీసుకున్నారు

రమణా రెడ్డి చెప్పిన వివరాలు ఆయన మాటల్లో.. ‘మాది నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్దచింతకుంట. మా బావ వైకాపా నేత బాలిరెడ్డి, మరో నలుగురితో కలిసి 27 ఏళ్లుగా మా నాన్న రసాయనాలు, పురుగుల మందుల వ్యాపారం చేశారు. లాభాలతో నంద్యాల, చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. వాటిలో నాకు రావాల్సిన రూ.16 కోట్ల ఆస్తిని బాలిరెడ్డి కొడుకు మల్లికార్జున రెడ్డి, ఆయన సోదరులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారు. మల్లికార్జున రెడ్డి ఆళ్లగడ్డ వైకాపా ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌(నాని) రెడ్డి అనుచరుడు. ఎవరికి చెప్పుకొంటావో చెప్పుకో అని బెదిరిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి తిరుగుతున్నా నాకు న్యాయం జరగలేదు. ఎమ్మెల్యేని కలిసి అడిగితే నన్ను మోసం చేసినవారి తరఫునే ఆయన మాట్లాడారు. కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాల్లో జరిగిన స్పందనలో ఫిర్యాదు చేసినా స్పందన లేదు. వైకాపా నేతలు నన్ను, నా కుటుంబాన్ని వేధిస్తున్నారు. ముఖ్యమంత్రి అయినా కల్పించుకుని ఇప్పటికైనా న్యాయం చేయాలని కోరుతున్నా. లేదంటే మా కుటుంబం ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతినివ్వాలని సీఎంను కోరుతున్నా.’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని