రైల్వేజోన్‌ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వమే అడ్డంకి

రాష్ట్రంలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై ఎట్టకేలకు కేంద్రం కదిలింది. చాలాకాలం తర్వాత కార్యాలయాల నిర్మాణానికి సిద్ధమైంది. అయితే హామీ కార్యరూపం దాల్చడానికి రాష్ట్రప్రభుత్వమే అడ్డంకిగా నిలుస్తోంది.

Updated : 20 Nov 2023 07:16 IST

భూములు అప్పగించకుండా మొద్దునిద్ర
జోన్‌ ప్రకటన తర్వాతైనా అప్పగించని వైనం
అధికార పార్టీ కీలక నేత భూముల్లోంచి దారి ఇవ్వలేకపోవడమే కారణమా?

ఈనాడు - అమరావతి, విశాఖపట్నం: రాష్ట్రంలో రైల్వేజోన్‌ ఏర్పాటుపై ఎట్టకేలకు కేంద్రం కదిలింది. చాలాకాలం తర్వాత కార్యాలయాల నిర్మాణానికి సిద్ధమైంది. అయితే హామీ కార్యరూపం దాల్చడానికి రాష్ట్రప్రభుత్వమే అడ్డంకిగా నిలుస్తోంది. మా భూములు అప్పగించండి మహాప్రభో అంటూ రైల్వే అధికారులు ఎన్నిసార్లు కోరినా.. వైకాపా సర్కారు పట్టించుకోకుండా తీవ్రజాప్యం చేస్తోంది. గతంలో తీసుకున్న రైల్వే భూములకు ప్రత్యామ్నాయంగా ఇస్తామన్న భూములు ఇవ్వాలని రైల్వేశాఖ కోరుతున్నా.. ప్రభుత్వం తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. అధికారపార్టీ కీలక నేత భూముల్లోంచి దారి ఇవ్వాలనే భూములు అప్పగించకుండా జాప్యం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది.

విశాఖపట్నం కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు రాష్ట్రప్రజల చిరకాల కోరిక. దక్షిణకోస్తా జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు 2019 ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటించింది. జోనల్‌ కార్యాలయాలు, ఇతర భవనాలకు 2020-21 కేంద్ర బడ్జెట్‌లో రూ.170 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకు ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. తొలుత విశాఖపట్నం రైల్వేస్టేషన్‌ సమీపంలోనే భవనాలు నిర్మిస్తామని, డీపీఆర్‌ సిద్ధమైందని, శంకుస్థాపన చేస్తామని చెప్పింది. తర్వాత ముడసర్లోవలో రైల్వేకి చెందాల్సిన 52 ఎకరాల్లో నిర్మాణాలు చేస్తామంది. దీంతో వ్యవహారం మొదటికొచ్చింది. వాస్తవానికి విశాఖలో బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ (బీఆర్‌టీఎస్‌) రహదారి నిర్మాణానికి   2010-11లో రైల్వేకి చెందిన ప్రస్తుత డీఆర్‌ఎం కార్యాలయం, మర్రిపాలెం తదితర చోట్ల సుమారు 15 ఎకరాలను మహావిశాఖ నగరపాలక     సంస్థ (జీవీఎంసీ) తీసుకుంది. వీటికి బదులు ముడసర్లోవలో 52 ఎకరాలు ఇచ్చేందుకు అప్పట్లో ఒప్పందం చేసుకున్నారు. తర్వాత భూములను  రైల్వేశాఖకు అప్పగించలేదు.

జోన్‌ ప్రకటనతో భూములకు ప్రాధాన్యం

కేంద్రం రైల్వేజోన్‌ను ప్రకటించాక ముడసర్లోవ భూములకు ప్రాధాన్యం వచ్చింది. అప్పట్లోనే ఆ భూములకు కంచె వేసేందుకు రైల్వే అధికారులు ప్రయత్నించగా.. అక్కడి రైతులు అడ్డుకుని ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. దీంతో రైల్వేశాఖ అక్కడ సర్వే చేయించగా.. 27 ఎకరాలు అందుబాటులో ఉందని, మిగిలినది ఆక్రమణలో ఉందని తేలింది. అప్పటినుంచి తమకు భూములను అప్పగించాలని జీవీఎంసీ అధికారులను రైల్వేశాఖ కోరుతూనే ఉంది.

విజ్ఞప్తులు పట్టించుకునేవారు ఏరీ?

రైల్వేజోన్‌ త్వరగా వచ్చేలా కృషిచేస్తున్నామని అధికారపార్టీ ఎంపీలు పదేపదే చెబుతున్నా.. భూములు అప్పగించే ప్రయత్నాలు చేయట్లేదు. ఒప్పందం ప్రకారం తమకు కేటాయించిన భూములు అప్పగించాలని జీవీఎంసీ అధికారులకు విశాఖ రైల్వే అధికారులు నాలుగుదఫాలు విజ్ఞప్తులు ఇచ్చారు. ఓసారి విశాఖ వచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి, రాష్ట్ర పురపాలకశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్నప్పుడు ఆయన దృష్టికీ ఈ అంశాన్ని రైల్వే అధికారులు తీసుకెళ్లారు. విశాఖ రైల్వే డివిజన్‌ గత డీఆర్‌ఎం రెండుసార్లు జిల్లా కలెక్టర్‌ను కలిసినా ఫలితం లేదు.

ఆ నేత భూముల్లో దారి ఇవ్వలేక?

గతంలో ఉత్తరాంధ్రలో హవా కొనసాగించిన ఓ అధికారపార్టీ కీలక నేతకు ముడసర్లోవలో భూములు ఉన్నట్లు తెలిసింది. రైల్వేకి కేటాయించిన భూములకు చేరుకోవాలంటే ఈ నేత భూముల్లోంచి దారి ఇవ్వాలని సమాచారం. అందుకే జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు వాటి జోలికి వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారని రైల్వేవర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్కడ న్యాయపరమైన చిక్కులు ఉండటంతో ముందుకు వెళ్లట్లేదని జీవీఎంసీ ఎస్టేట్స్‌ విభాగం అధికారులు చెబుతున్నారు. చిక్కులు పరిష్కరించేందుకు చొరవ చూపకుండా, మరోచోటైనా భూములు ఇచ్చేలా చూడకుండా రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని