Heavy Rain: వరికి కన్నీటి తడి

భారీ వర్షాలకు కోతకొచ్చిన వరి నేల వాలిందన్నది నిజం.. తడిసిన ధాన్యం రంగు మారుతుందని, మిల్లులో ఆడిస్తే నూక ఎక్కువగా వస్తుందనేది తెలియనిదేం కాదు... అయినా నిబంధనలు సడలించకపోవడంతో వడ్లు కొనడం

Updated : 11 Dec 2021 06:09 IST

తడిసిన ధాన్యం అమ్ముకోవడానికి రైతుల అగచాట్లు
బస్తా రూ.వెయ్యి నుంచి రూ.పన్నెండొందలే
భారీగా నష్టపోతున్న అన్నదాతలు
రాష్ట్రవ్యాప్తంగా తగ్గిన 8.11 లక్షల టన్నుల ఉత్పత్తి
తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి ‘ఈనాడు’ ప్రతినిధి

తూ.గో.జిల్లా జి.పెదపూడిలో ఇటీవలి వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆరబెడుతున్న కూలీలు

భారీ వర్షాలకు కోతకొచ్చిన వరి నేల వాలిందన్నది నిజం.. తడిసిన ధాన్యం రంగు మారుతుందని, మిల్లులో ఆడిస్తే నూక ఎక్కువగా వస్తుందనేది తెలియనిదేం కాదు... అయినా నిబంధనలు సడలించకపోవడంతో వడ్లు కొనడం లేదు. బస్తా ధాన్యాన్ని(75 కిలోలు) మద్దతు ధర కంటే రూ.255 నుంచి రూ.455 వరకు తక్కువగా అమ్ముకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు... ‘తడిసిన ధాన్యాన్ని మిల్లర్లతో కొనిపిస్తాం’ అనే కంటితుడుపు మాటలకే పరిమితం అవుతున్నారు. కొనుగోలుకు నిబంధనలు సడలించకపోతే మేమేం చేయగలమని మిల్లర్లు అంటున్నారు. ఈ దుస్థితిపై ‘ఈనాడు’ ఉభయగోదావరి జిల్లాల్లో పర్యటించగా పలుచోట్ల... ధర సంగతి తర్వాత మొదట ధాన్యం తీసుకోవాలని మిల్లర్లను వేడుకుంటున్న అన్నదాతలు కనిపించారు. మొత్తానికి ఒకవైపు అంతకంతకూ పెరుగుతున్న అప్పులు... మరోవైపు అరకొరగా వచ్చిన దిగుబడులతో ఉన్న కావడిని మోస్తూ రైతులు అల్లాడుతున్నారు. నవంబరులో కురిసిన భారీ వర్షాలకు వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రవ్యాప్తంగా 4.24 లక్షల మంది రైతులు 6.10 లక్షల ఎకరాల్లో సాగు చేసిన వరి దెబ్బతిన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 8.11 లక్షల టన్నుల ఉత్పత్తి తగ్గినట్లు అంచనా వేశారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 4 లక్షల టన్నుల వరకు తగ్గనుంది. మండపేట మండలంలో 17,162 మండలాల్లో వరి వేయగా.. 6,160 ఎకరాలు, ఆలమూరు మండలంలో 10,652 ఎకరాల్లో వరి వేస్తే 6,445 ఎకరాల్లో దెబ్బతింది. ఈ జిల్లాలో ఆర్‌బీకేల ద్వారా 29 వేల టన్నులు, బహిరంగ మార్కెట్లో 17వేల టన్నుల్ని మాత్రమే కొనుగోలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోనూ ఉంగుటూరు, తణుకు, తాడేపల్లిగూడెం, దెందులూరు తదితర ప్రాంతాల్లో తడిసిన ధాన్యం అధికంగానే ఉంది.

తడిసి నూక అవుతున్న ధాన్యం

అమ్ముకోలేక... ఆరబెట్టుకోలేక...
అధిక శాతం రైతులకు ఎకరాకు 10 నుంచి 12 బస్తాల దిగుబడే వస్తోంది. ఇందులో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో ఆరబెట్టుకుని తగ్గించుకుంటున్నారు. తడిసి రంగు మారడంతో అమ్ముకోలేక అగచాట్లు పడుతున్నారు. ఎక్కువ మంది బస్తా రూ.1000 నుంచి రూ.1,200లోపే అమ్మేస్తున్నారు. మరికొందరు ఇళ్లలో నిల్వ చేసుకున్నారు. అమ్మడం ఆలస్యమైతే అదీ వేడెక్కి మొత్తానికే పనికిరాకుండా పోతుందనే ఆందోళన వారిలో ఉంది.

అంతా అమ్ముకున్నాక సడలింపులా?
రాష్ట్రంలో నవంబరు నెలంతా భారీవర్షాలు కురిశాయి. ఉభయగోదావరి జిల్లాలతోపాటు రాయలసీమ, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున వరి దెబ్బతింది. పలుచోట్ల రంగుమారి, మొలకలు వచ్చింది. ఇప్పటికే నెల అవుతోంది. పలువురు రైతులు తక్కువ ధరకు తెగనమ్ముకున్నారు. మరికొందరు మిల్లర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడుతున్నారు. తమ చేతుల నుంచి ధాన్యం వెళ్లిపోయాక నిబంధనలు సడలిస్తే... మిల్లర్లకే ఉపయోగం ఉంటుందని రైతులు గుర్తుచేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


* ‘‘మాది తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెదపాళ్ల. ఎకరా 33 బస్తాల చొప్పున(ఖరీఫ్‌, రబీకి) ఎనిమిదెకరాలు కౌలుకు తీసుకుని వరి వేశా. కోత సమయంలో వానలొచ్చి పైరంతా పడిపోయింది. దాన్నే ఎకరాకు రూ.10వేల పైగా ఖర్చు చేసి యంత్రాలతో కోయిస్తే అయిదు క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. ధాన్యాన్ని ట్రక్కులో వేసుకుని ఒక రోజంతా మిల్లుల చుట్టూ తిరిగితే... ట్రాక్టర్‌కు రూ.1,500 ఖర్చయింది. కనీసం ఇంత ధర ఇస్తామని కూడా అడగడం లేదు’’ అని రైతు అంబటి నాగేశ్వరరావు కన్నీటి పర్యంతమయ్యారు.


* ‘‘మాది పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు. ధాన్యం కోసి 55 రోజులైనా ఇప్పటికీ అమ్ముకోలేకపోయా. బస్తా రూ.1,100 చొప్పున అడుగుతూ ఏడిపించేస్తున్నారు. బరకాల(పట్టలు) అద్దెకే 25 రోజులకు రూ.12,000 అయింది. డబ్బులిమ్మని వారు ఒత్తిడి చేస్తున్నారు. చేసేది లేక వారడిగిన దానికే అమ్మేస్తున్నా’’ అని రైతు టి.నాగేశ్వరరావు వాపోయారు.


* ‘‘మాది తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం పాలతోడు. ఎకరా 33 బస్తాల చొప్పున నాలుగెకరాలు కౌలుకు తీసుకుంటే 25 బస్తాల చొప్పున వచ్చింది. ధాన్యం కొనే సమయంలో క్వింటాలు రూ.1,390 అని చెప్పినా... మిల్లుకు వెళ్లాక ముక్క(నూక) వస్తుందని రూ.190 చొప్పున తగ్గించేశారు’’ అని రైతు వెంకటేశ్‌ ఆవేదన వెలిబుచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని