Vande Bharat: తెలుగు రాష్ట్రాలకు మరిన్ని వందేభారత్‌లు

శతాబ్ది, రాజధాని కంటే ఆధునికమైన, వేగవంతమైన సెమీహైస్పీడ్‌ వందేభారత్‌ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు అతి త్వరలోనే మరిన్ని కేటాయిస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌  చెప్పారు.

Updated : 17 Jan 2023 07:30 IST

తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో 35 స్టేషన్ల అభివృద్ధి

‘ఈనాడు’ ప్రత్యేక ఇంటర్వ్యూలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడి

సుతారపు సోమశేఖర్‌

ఈనాడు - హైదరాబాద్‌

తాబ్ది, రాజధాని కంటే ఆధునికమైన, వేగవంతమైన సెమీహైస్పీడ్‌ వందేభారత్‌ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు అతి త్వరలోనే మరిన్ని కేటాయిస్తామని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌  చెప్పారు. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఆదివారం వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభోత్సవం అనంతరం అశ్వినీ వైష్ణవ్‌ ‘ఈనాడు’కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. కొత్తగా బెర్తులతో కూడిన స్లీపర్‌ వందేభారత్‌, వందే మెట్రో రైలు డిజైన్‌ పూర్తయిందని, త్వరలో వాటి ఉత్పత్తి ప్రారంభం కానుందని తెలిపారు. తెలంగాణవ్యాప్తంగా 35 రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని.. త్వరలో వాటి పేర్లు ప్రకటిస్తామని వెల్లడించారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ అందించబోయే అతిపెద్ద బహుమతిగా దీనిని అభివర్ణించారు.  

తెలుగు రాష్ట్రాలకు ఎన్ని వందేభారత్‌లు ఇచ్చే అవకాశం ఉంది?

అతి త్వరలోనే సికింద్రాబాద్‌ నుంచి బెంగళూరు, తిరుపతి, విజయవాడకు ఈ రైళ్లను ప్రారంభిస్తాం. మూడేళ్లలో 475 వందేభారత్‌లను ప్రవేశపెట్టాలన్నది లక్ష్యం. ఎనిమిది రైళ్లు పట్టాలెక్కాయి. తొలిదశలో దేశంలో 75 నగరాలను అనుసంధానించడం లక్ష్యం. సికింద్రాబాద్‌-విశాఖపట్నం రైలుతో 30 నగరాలు పూర్తయ్యాయి. ప్రతి 10 రోజులకు ఒకటి అందుబాటులోకి తెస్తున్నాం. తొమ్మిదో వందేభారత్‌ని ఈ నెల 23, 24 తేదీల్లో ప్రారంభిస్తాం. ఈ రైళ్ల జీవితకాలం 35 సంవత్సరాలు. మొదటివిడత పూర్తయ్యాక రెండో దఫాలో తెలుగు రాష్ట్రాలకు కొత్త వందేభారత్‌ రైళ్లు వస్తాయి. తెలంగాణ, ఏపీలోని అన్ని ప్రధాన నగరాలను వీటితో అనుసంధానం చేస్తాం.

వందేభారత్‌ గరిష్ఠ వేగం 160-180 కి.మీ. ప్రస్తుత ట్రాక్‌ల సామర్థ్యం 110-130 కి.మీ. మాత్రమే కదా?

గతంలో రైలు పట్టాల సామర్థ్యం గంటకు 70 కి.మీ. మాత్రమే. గత ఎనిమిదేళ్లలో 110 కి.మీ.కు, కొన్నిచోట్ల 130 కి.మీ.కు పెంచాం.సికింద్రాబాద్‌-విజయవాడ సహా పలు మార్గాల్లో ట్రాక్‌ సామర్థ్యాన్ని ఏడాది, ఏడాదిన్నరలో 160 కి.మీ.కు పెంచబోతున్నాం.  

ఛార్జీలు భారీగా ఉన్నాయి. సామాన్యులు ఈ రైళ్లలో ప్రయాణించగలరా?

ప్రయాణికులు ఇప్పుడు సమయానికి, సౌకర్యానికి ప్రాధాన్యమిస్తున్నారు. త్వరగా గమ్యం చేరాలని,  ప్రయాణంలో అనుభూతి పొందాలని కోరుకుంటున్నారు. అవన్నీ వందేభారత్‌లో ఉన్నాయి.

కేంద్ర బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు ఈసారైనా కేటాయింపులు పెరిగే అవకాశం ఉందా?

రైల్వేపరంగా రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి గతేడాది రూ.12 వేల కోట్లు కేటాయించాం. అతి పెద్ద రాష్ట్రం, ఎక్కువ జనాభా ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌కు ఇచ్చింది రూ.11 వేల కోట్లే.  

తెలంగాణకు ఇచ్చింది రూ.3 వేల కోట్లే కదా?

2014కు ముందుతో పోలిస్తే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు నిధులు చాలా రెట్లు పెంచాం. ఇంకా అధిక నిధులివ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రాజెక్టులకు భూసేకరణలో జాప్యంతో పాటు, రాష్ట్ర వాటా నిధులు విడుదల చేయడంలేదు. రాష్ట్రం సహకరించాలి.

బీబీనగర్‌-నల్లపాడు రెండోలైను మంజూరు ఎప్పుడు?

యూపీఏ హయాంతో పోలిస్తే ప్రస్తుతం నాలుగు రెట్లు ఎక్కువ డబ్లింగ్‌ (రెండో లైను) చేశాం. బీబీనగర్‌-నల్లపాడు డబ్లింగ్‌ ప్రాజెక్టుకు అధిక నిధులు కావాలి. రాష్ట్ర ప్రభుత్వాలు భూమి సేకరించి ఇవ్వాలి. ఈ అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్‌ కార్యకలాపాలు ఎప్పుడు మొదలవుతాయి?

జోన్‌ ప్రధాన కార్యాలయ భవనాలకు స్థలం ఖరారైంది. నిర్మాణ పనులు పూర్తయ్యాక కొత్త జోన్‌కు జనరల్‌ మేనేజర్‌ (జీఎం)ని నియమిస్తాం.

తెలంగాణలో కాజీపేట, ఏపీలో బాలాజీ రైల్వే డివిజన్లు కావాలన్న డిమాండ్లపై..?

చిన్న జోన్లు, డివిజన్లతో రైల్వే శాఖ సామర్థ్యం తగ్గుతుంది. ఒక రైలు గమ్యస్థానం చేరేలోగా అనేక డివిజన్ల మీదుగా ప్రయాణించాలి. రైళ్లను సురక్షితంగా తమ సరిహద్దులు దాటించడం వంటి బాధ్యతలు ఆయా డివిజన్లపైనే ఉంటాయి. మధ్యలో లోకో సిబ్బంది మారుతుంటారు. ఈ అంశాల నేపథ్యంలో కొత్త డివిజన్ల ఏర్పాటు సాధ్యం కాదు.

రైళ్లలో జనరల్‌ బోగీలు రెండు, మూడే ఉండటంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు కదా?

కొవిడ్‌ తగ్గాక జనరల్‌ బోగీలను పునరుద్ధరించాం. మొత్తం జనరల్‌ బోగీలు మాత్రమే ఉండే రైళ్లను కొన్ని ప్రవేశపెట్టాం. మరిన్ని ప్రవేశపెడతాం.

సీనియర్‌ సిటిజన్లకు రాయితీ ప్రయాణం ఎప్పుడు పునరుద్ధరిస్తారు?

ఇప్పటికే ప్రతి ప్రయాణికుడికి 55 శాతం రాయితీ ఇస్తున్నాం. సబ్సిడీల రూపంలో ఏటా రూ.59 వేల కోట్లు భరిస్తున్నాం. సీనియర్‌ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ ఇప్పట్లో ఉండకపోవచ్చు.

హైదరాబాద్‌ నుంచి తెలంగాణలోని పట్టణాలు, నగరాలకు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లు నడిపే అవకాశం ఉందా?

దేశవ్యాప్తంగా కొత్త రకం వందే మెట్రో రైళ్లు తీసుకురాబోతున్నాం. వీటి ప్రయాణదూరం 200-250 కి.మీ. మాత్రమే ఉంటుంది. మధ్యలో అనేక పట్టణాల్లో ఆ రైళ్లు ఆగుతూ అందరికీ అందుబాటులో ఉంటాయి. 2024లో వీటి ఉత్పత్తి మొదలవుతుంది. వీటి రాకతో తెలంగాణలో ఇంటర్‌సిటీ అవసరం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని