Pradhan Mantri Matru Vandana Yojana: రెండో కాన్పులో అమ్మాయి పుడితే రూ.6వేలు

అమ్మాయిలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మిషన్‌ శక్తి’ కింద కొత్త పథకానికి రూపకల్పన చేసింది. రెండోసారి గర్భం దాల్చినప్పుడు ఆడపిల్ల పుడితే అర్హులైన వారికి రూ.ఆరు వేలు ఆర్థిక సాయంగా అందజేయనుంది.

Published : 09 Jun 2023 08:25 IST

2022 ఏప్రిల్‌ నుంచే వర్తింపు
‘మిషన్‌ శక్తి’ కింద కేంద్రం అమలు

ఈనాడు, అమరావతి: అమ్మాయిలను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మిషన్‌ శక్తి’ కింద కొత్త పథకానికి రూపకల్పన చేసింది. రెండోసారి గర్భం దాల్చినప్పుడు ఆడపిల్ల పుడితే అర్హులైన వారికి రూ.ఆరు వేలు ఆర్థిక సాయంగా అందజేయనుంది. 2022 ఏప్రిల్‌ నుంచే దీన్ని వర్తింపజేస్తారు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన (పీఎంవీవై) కింద తొలి కాన్పులో ఆడ లేదా మగ బిడ్డ పుట్టినప్పటికీ మూడు దశల్లో రూ.5వేలు చెల్లిస్తోంది. మహిళ గర్భం దాల్చినట్లు ఆన్‌లైన్‌లో నమోదుకాగానే రూ.1,000, ఆరు నెలల తర్వాత రూ.2,000, ప్రసవం జరిగిన 14 వారాల్లో ఇమ్యూనైజేషన్‌ సైకిల్‌ పూర్తయ్యాక రూ.2,000 చొప్పున అందజేస్తుంది. ఈ పథకంలో రెండో కాన్పునకు ఆర్థిక లబ్ధి వర్తించేది కాదు. దీన్ని సవరిస్తూ.. రెండో కాన్పులో అమ్మాయి పుడితే మాత్రమే తల్లికి రూ.6వేలు ఇచ్చేలా మార్పుచేశారు. రెండో ప్రసవంలో కవలలు జన్మించి, వారిలో ఒక అమ్మాయి ఉన్నా పథకం వర్తిస్తుంది. జనన ధ్రువీకరణ పత్రం ఆధారంగా ఈ మొత్తాన్ని చెల్లిస్తారు. గర్భస్రావాలు తగ్గించడంతో పాటు తల్లిదండ్రులకు ఆర్థిక వెసులుబాటును ఇచ్చేందుకు ‘మిషన్‌ శక్తి’లో దీన్ని చేర్చినట్లు కేంద్రం చెబుతోంది. ఇక, తొలిసారి గర్భం దాల్చినప్పుడు మూడు దశల్లో అందించే రూ.5వేల ఆర్థిక సహాయం పంపిణీలోనూ మార్పులు చేయబోతుంది. గర్భం దాల్చినప్పుడు రూ.3,000, ప్రసవం జరిగిన 14 వారాలకు రూ.2,000 చొప్పున రెండు విడతల్లోనే ఇవ్వనుంది.

* ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనలో ప్రకటించిన మార్పులకు తగ్గట్లు కేంద్ర ప్రభుత్వ పోర్టల్‌లో మార్పులు చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి సుమారు లక్షన్నర మంది వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. దీంతో ఈ పథకం కింద గత ఏప్రిల్‌ నుంచి చెల్లింపులు ఆగిపోయాయి. ఈ పథకానికయ్యే వ్యయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తాయి. దీన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అమలు చేస్తోంది. వాస్తవానికి మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలుచేయాలని మార్గదర్శకాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని