Andhra News: ఆంధ్రప్రదేశ్‌లో తుక్కు పాలసీ అమలు.. తొలుత ప్రభుత్వ శాఖల్లో!

రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలు ఏప్రిల్‌ ఒకటి నుంచి రోడ్డెక్కవు. వీటిని తుక్కు చేయనున్నారు.

Updated : 23 Mar 2023 07:24 IST

15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలు తుక్కుకే

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలు ఏప్రిల్‌ ఒకటి నుంచి రోడ్డెక్కవు. వీటిని తుక్కు చేయనున్నారు. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌ మేరకు రాష్ట్రంలో వచ్చేనెల ఒకటి నుంచి వాహనాల తుక్కు పాలసీని అమల్లోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత ప్రభుత్వ శాఖల్లో ఉన్న వాహనాలను తుక్కు చేయనున్నారు. ఇలాంటివి ఏపీఎస్‌ఆర్టీసీతో కలిపి 440 ఉన్నట్లు లెక్కతేల్చారు. 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలు, 20 ఏళ్లు దాటిన వ్యక్తిగత వాహనాలు సామర్థ్య పరీక్ష (ఫిటెనెస్‌ టెస్ట్‌)లో విఫలమైతే వాటిని తుక్కుగా మార్చే విధానాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా తొలుత 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలన్నింటినీ తుక్కు చేయనున్నారు. ఈ విధానానికి వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ఏపీ సైతం సమ్మతం తెలిపింది. దీంతో అన్ని శాఖల వద్ద 15 ఏళ్లు దాటిన వాహనాలు ఎన్ని ఉన్నాయనేది లెక్కలు తీశారు.

రికార్డుల ప్రకారం 37 వేలు

రవాణాశాఖ రికార్డుల ప్రకారం ప్రభుత్వశాఖలు అన్నింటా కలిపి ఇప్పటి వరకు 37 వేల వాహనాలు 15 ఏళ్లు దాటాయి. దీనిపై అన్ని జిల్లాల్లో రవాణాశాఖ అధికారులతో పరిశీలన జరిపించారు. ఇందులో ఇప్పటికీ రోడ్డెక్కుతున్నవి 440గా తేల్చారు. దశాబ్దాలుగా వివిధ శాఖలు కొనుగోలు చేసిన వాహనాలను ఏళ్ల తరబడి వినియోగించి తుక్కు చేసినప్పటికీ రవాణాశాఖ వద్ద ఆ వివరాలు నమోదు చేయించలేదు. తాజాగా లెక్కతేలిన 440 వాహనాల్లో 220 ఆర్టీసీ బస్సుల ఉన్నట్లు గుర్తించారు. ఇవన్నీ ఈనెలాఖరుతో పక్కనపెట్టనున్నారు.

13 లక్షల కి.మీ. తిరిగిన బస్సులతో సర్దుబాటు

ఏపీఎస్‌ఆర్టీసీలోని కాలంచెల్లిన 220 బస్సుల్లో 8 డిపో గూడ్స్‌ ట్రాన్‌పోర్ట్‌ (డీజీటీ)లు ఉన్నాయి. మిగిలిన 212 బస్సుల్లో 93 విజయవాడ నగరంలో తిరుగుతున్న సిటీ బస్సులే. ఇవన్నీ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద గతంలో కొనుగోలుచేసిన సీఎన్‌జీతో నడిచే బస్సులు. మిగిలినవి రాష్ట్రంలో వివిధ డిపోల పరిధిలో ఉన్న పల్లెవెలుగు సర్వీసులుగా తేల్చారు. వీటి స్థానంలో 12-13 లక్షల కి.మీ.లు తిరిగిన వివిధ ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సులను సిటీ, పల్లెవెలుగు సర్వీసులుగా మార్పుచేసి నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


వాణిజ్య, వ్యక్తిగత వాహనాలకు ఎప్పటి నుంచి?

వాణిజ్య, వ్యక్తిగత వాహనాలకు తుక్కు పాలసీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది ఇంకా స్పష్టతలేదు. దీనికి కేంద్రం నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంటుందని, ఆ తర్వాత రాష్ట్రప్రభుత్వం ఆదేశాలు జారీచేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ విధానంలో వ్యక్తిగత వాహనాన్ని తుక్కుచేసి, దానిస్థానంలో కొత్తది కొనుగోలుచేస్తే జీవిత పన్నులో 25 శాతం, వాణిజ్య వాహన జీవితపన్నులో 15 శాతం రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆయా వాహనాలపై ఉన్న జరిమానాలన్నింటినీ రద్దు చేయాలి. ఇందుకు రాష్ట్రప్రభుత్వం సమ్మతి తెలపాల్సి ఉంటుంది.

* రాష్ట్రంలో జగ్గయ్యపేట, తెనాలిలో రిజిస్ట్రర్డ్‌ వాహనాల తుక్కు యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం తాజాగా అనుమతి ఇచ్చింది. ఆసక్తి ఉన్న సంస్థలను ఆహ్వానించగా, ఈ రెండు చోట్ల ఏర్పాటుకు ఒక్కో సంస్థ చొప్పున ముందుకొచ్చాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని