Union Budget 2022 : నిర్మలమ్మకు అవే ఆరు సవాళ్లు..!
ప్రకృతి విప్పత్తులు, అంటురోగాలు ప్రబలిన సమయంలో కోట్ల మంది ఉపాధి కోల్పోతారు. ఫలితంగా ప్రజలు నిధులకు కటకటలాడుతుంటారు.. అదే సమయంలో ఉత్పత్తి పడిపోయి ధరలు పెరుగుతుంటాయి.
మరో కరోనా బడ్జెట్కు సిద్ధం..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ప్రకృతి విపత్తులు, అంటు రోగాలు ప్రబలిన సమయంలో కోట్ల మంది ఉపాధి కోల్పోతారు. ఫలితంగా ప్రజలు నిధులకు కటకటలాడుతుంటారు. అదే సమయంలో ఉత్పత్తి పడిపోయి ధరలు పెరుగుతుంటాయి. ఆ సమయంలో ప్రభుత్వాలకు పన్ను ఆదాయాలు పడిపోవడమే కాకుండా ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాంటి సమయంలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం కత్తిమీద సామే. గత రెండేళ్లుగా దేశం కరోనా సంక్షోభాన్ని చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి1న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. కీలక సవాళ్లకు ఆమె పరిష్కారం చూపించాల్సి ఉంది.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం..
ద్రవ్యోల్బణం పెరుగుదలతో ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇది సామాన్యుడి జీవితాన్ని చిందరవందర చేస్తుంది. తాజాగా డిసెంబర్లో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ 5.59శాతానికి పెరిగింది. ఈవిషయాన్ని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. గత ఐదు నెలలతో పోలిస్తే ఇది ఎక్కువ. ద్రవ్యోల్బణాన్ని 4 వద్ద స్థిరీకరించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరలేదు. కాకపోతే ఆర్బీఐ పేర్కొన్న 2-6 శాతం మధ్యలోనే ఉండటం మాత్రమే ప్రభుత్వానికి ఊరట. మరోపక్క ముడి చమురు ధరలు మెల్లగా పీపాకు 100 డాలర్ల వద్దకు చేరుతున్నాయి. దీంతో భవిష్యత్తులో ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. అదే సమయంలో కేంద్రం కూడా ఇంధన ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే ఉద్దేశంలో లేదు.
పెరుగుతున్న నిరుద్యోగం..
దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడంతో కొన్నాళ్లుగా నిరుద్యోగిత శాతం పెరుగుతోంది. గత ఆరేళ్లలో ఐదుసార్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగిత రేటు కంటే భారత్లో నిరుద్యోగుల శాతం ఎక్కువగా ఉన్నట్లు ముంబయికి చెందిన సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ పేర్కొంది. కానీ, వాస్తవిక పరిస్థితి ఇంతకంటే దారుణంగా ఉండొచ్చని అంచనా వేసింది. 2018-21 మధ్య కాలం భారత ఆర్థిక వ్యవస్థ సుదీర్ఘకాలం పాటు మందకొడిగా ఉంది. 1991లో ఆర్థిక సంక్షోభం అంచుకు చేరిన సమయంలో ఈ పరిస్థితి నెలకొంది.
రాజకీయ పరంగా చూసినా అధికార భాజపాకు ఇది పెను సవాలే. ఎందుకంటే 2014లో లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదు. భారత్లో 135 కోట్ల మందిలో మూడింట రెండొంతుల మంది ప్రస్తుతం ఉద్యోగాలు చేయగల వయస్సులో ఉన్నారంటే.. కొలువుల అవసరం తెలుసుకోవచ్చు. ప్రభుత్వం ఈ పరిస్థితి నుంచి యువతను బయటకు తీసుకురావాలంటే మౌలిక వసతుల ప్రాజెక్టులపై ఎక్కువ ఖర్చుపెట్టాలి. కానీ, ఈ క్రమంలో ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టడం కూడా చాలా ముఖ్యం.
ఆదాయపు పన్ను మినహాయింపులు..
కరోనా సమయంలో ప్రజల ఆదాయాలు కుంగడంతో ప్రభుత్వం పన్ను మినహాయింపులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సారి ఆదాయపన్ను మినహాయింపు మొత్తాన్ని రూ.2.5లక్షల నుంచి పెంచాలన్న డిమాండ్లు వస్తున్నాయి. దీంతోపాటు సెక్షన్ 80సీ డిడక్షన్ పరిధిని కూడా విస్తరించాల్సి ఉంది.
జీడీపీ వృద్ధిరేటు కొనసాగింపు
దేశ ఆర్థిక పరిస్థితి కరోనా కారణంగా చిందరవందరగా మారింది. వాస్తవానికి 2019-20లో జీడీపీ వృద్ధిరేటు 4శాతం కంటే కిందకు చేరింది. దీనికి కరోనా కూడా తోడు కావడంతో ఆర్థిక వృద్ధి రికార్డు స్థాయిలో పతనమైంది. ఈ ఏడాది ఆర్థిక వృద్ధిరేటు మార్చినాటికి 9.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ వృద్ధిరేటును 2022-23లో కూడా కొనసాగించగలిగితేనే దేశం ఆర్థిక కష్టాల నుంచి బయటపడుతుంది. కరోనా కొత్త వేరియంట్ల వ్యాప్తి జరగవచ్చనే భయాల నేపథ్యంలో దీనిని కొనసాగించడం కత్తిమీద సామే.
ద్రవ్యలోటు కట్టడి..
ప్రభుత్వానికి ఆదాయ వనరులు పరిమితంగా ఉండటం.. ఖర్చులు పెరిగిపోవడంతో భారీగా ద్రవ్యలోటు నమోదవుతోంది. ముఖ్యంగా కరోనా సమయంలో 80 కోట్ల మందికి ఆహారం అందజేయడం, రైతులకు ఎరువులపై రాయితీల వంటివి ఇవ్వడం వంటి చర్యలతో ద్రవ్యలోటు రికార్డు స్థాయిలో 9.3 వద్దకు చేరింది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 6.3 వద్దకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి నుంచి బయటపడాలంటే పెట్టుబడుల ఆధారిత వృద్ధిని సాధించాలి. ఈ నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరానికి 6 నుంచి 6.3 శాతం మధ్య లక్ష్యాన్ని పెట్టుకొనే అవకాశం ఉంది.
ప్రైవేటీకరణను కొనసాగించడం..
సంస్కరణలను కొనసాగించడం ఆర్థిక మంత్రికి కఠిన సవాలే. ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణలో లక్ష్యాలను అందుకోలేకపోతోంది. గతేడాది విధించుకొన్న రూ.1.72 లక్షల కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం ఇంకా చేరుకోలేదు. కేవలం రూ.9,329 కోట్లు మాత్రమే సేకరించగలిగారు. ఎయిర్ ఇండియా విక్రయం మాత్రం పూర్తి చేయడం ఒక్కటే ఊరట.
ముఖ్యంగా రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీపీసీఎల్లో వాటాల విక్రయం వచ్చే ఏడాదికి మార్చే అవకాశం ఉంది. దీంతోపాటు లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్లో వాటాల విక్రయం ప్రభుత్వానికి పెద్ద సవాల్. ఈ భారీ ఐపీవో పట్టాలు తప్పకుండా ఉంటే ప్రభుత్వానికి కొంత ఆదాయం సమకూరుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ