ఏప్రిల్ 1 నుంచి 5 కొత్త ఆదాయపు పన్ను నియమాలు 

ఐటిఆర్ దాఖలు నుంచి 75 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు మినహాయింపు

Updated : 15 Mar 2021 18:13 IST

కేంద్ర బడ్జెట్ 2021లో  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పులను ప్రకటించారు. ఈ మార్పులు 1 ఏప్రిల్ 2021 నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త నిబంధనల ప్రకారం, 75 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల సీనియర్ సిటిజన్లకు పెన్షన్ నుంచి వచ్చే ఆదాయం, అదే బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీపై ఏప్రిల్ 1 నుంచి ఐటిఆర్ దాఖలు నుండి మినహాయింపు ఉంటుంది. అంతేకాకుండా, ఆర్థిక మంత్రి తమ ఐటిఆర్ దాఖలు చేయని వారి కోసం అధిక టీడీఎస్‌ ప్రతిపాదించారు. ఈపీఎఫ్‌ ఖాతాలో ఏడాదికి రూ. 2.5 లక్షలకు పైగా డిపాజిట్‌ చేసే వ్యక్తులకు పన్ను విధించాలని ప్రకటించారు.

ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చే 5 ఆదాయపు పన్ను మార్పులను పరిశీలిద్దాం:


1) పీఎఫ్ పన్ను నియమాలు:

2021 ఏప్రిల్ 1 నుంచి ప్రావిడెంట్ ఫండ్‌కు ఏడాదికి రూ. 2.5 లక్షలకు పైగా డిపాజిట్‌ చేసే వ్యక్తులకు వడ్డీకి పన్ను వర్తిస్తుంది ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) లో అధిక విలువ కలిగిన డిపాజిటర్లకు పన్ను విధించేందుకే ఈ చర్య అని ప్రభుత్వం తెలిపింది. ఈపీఎఫ్‌ కార్మికుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుందని, నెలకు రూ. 2 లక్షల కన్నా తక్కువ సంపాదించే ఏ వ్యక్తి అయినా ఈ ప్రతిపాదన వల్ల ప్రభావితం కాబోర‌ని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అన్నారు.


2) టీడీఎస్:

ఎక్కువ మంది ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేయడానికి, ఆర్థిక మంత్రి 2021 బడ్జెట్‌లో అధిక టీడిఎస్ (మూలం వద్ద పన్ను) లేదా టీసీఎస్ (మూలం వద్ద వసూలు చేసిన పన్ను) రేట్లు ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను రిటర్నుల‌ను దాఖలు చేయనివారికి  టీడీఎస్, టీసీఎస్‌ల వ‌ద్ద‌‌ అధిక రేట్లు విధించేందుకు ప్రత్యేక నిబంధనగా ఆదాయపు పన్ను చట్టంలో 206 ఎబి, 206 సిసిఎ తీసుకొచ్చారు.


3)  సీనియర్ సిటిజన్లకు మినహాయింపు:

సీనియర్ సిటిజన్లకు ప‌న్ను భారం తగ్గించడానికి, 2021 బ‌డ్జెట్‌లో 75 ఏళ్లు పైబడిన వ్యక్తులకు ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌) దాఖలు చేయకుండా మినహాయింపు ఇచ్చారు. ఈ మినహాయింపు ఇతర ఆదాయం లేని సీనియర్ సిటిజన్లకు మాత్రమే లభిస్తుంది, కానీ పెన్షన్ ఖాతా ఉన్న‌ బ్యాంక్ నుంచి ల‌భించే పెన్షన్, వడ్డీ ఆదాయంపై ఆధారపడి ఉంటుంది.


4) ముందే నింపిన ఐటీఆర్ ఫారంలు:

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ముందుగా నింపిన ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్‌) జారీచేస్తారు. పన్ను చెల్లింపుదారునికి ఈ విధానం సులభతరం చేయడానికి, జీతం ఆదాయం, పన్ను చెల్లింపులు, టీడీఎస్‌ మొదలైన వివరాలు ముందే ఆదాయపు పన్ను ఫారంల‌లో ముందే పూరించి ఉంటాయి. రిటర్నుల‌ దాఖలును మరింత సులభతరం చేయడానికి, లిస్టెడ్ సెక్యూరిటీల నుంచి మూలధన లాభాల వివరాలు, డివిడెండ్ ఆదాయం, బ్యాంకుల నుంచి వడ్డీ, పోస్ట్ ఆఫీస్ మొదలైనవి కూడా ముందే ఉంటాయి.  రిటర్నుల‌ను దాఖలును సులభతరం చేయడమే ఈ చర్య.


5) ఎల్‌టీసీ:

సెలవు ప్రయాణ రాయితీ (ఎల్‌టిసి) బదులుగా నగదు భత్యానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని బడ్జెట్ 2021 లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రయాణానికి కోవిడ్ సంబంధిత పరిమితుల కారణంగా తమ ఎల్‌టీసీ పన్ను ప్రయోజనాన్ని పొందలేకపోయిన వ్యక్తుల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం గత సంవత్సరం ప్రకటించింది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని