5G auction: కొనసాగుతున్న 5జీ వేలం.. నేటితో ముగింపు!

5G auction: మంగళవారం నాలుగు రౌండ్లు బిడ్లు దాఖలవ్వగా.. ఐదో రౌండ్‌ బిడ్డింగ్‌లో రెండో రోజు వేలం ప్రక్రియ మొదలైంది.

Updated : 27 Jul 2022 18:55 IST

దిల్లీ: వేగంతో కూడిన డేటా, నాణ్యమైన టెలికాం సేవలు అందించేందుకు ఉద్దేశించిన 5జీ స్పెక్ట్రమ్‌ వేలం (5G auction) ప్రక్రియ బుధవారమూ కొనసాగుతోంది. మంగళవారం ప్రారంభమైన ఈ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఉదయం 10 గంటలకు రెండో రోజు ప్రక్రియ ప్రారంభం కాగా.. సాయంత్రం 6 గంటలతో వేలం ప్రక్రియ పూర్తవుతుంది. అనంతరం ఏ కంపెనీ ఎంత మేర స్పెక్ట్రమ్‌ కోసం దరఖాస్తు చేసిందో తెలుస్తుంది.

తొలి రోజు వేలం ప్రక్రియలో ముకేశ్‌ అంబానీ, సునీల్‌ మిత్తల్‌, గౌతమ్‌ అదానీ గ్రూప్‌, వొడాఫోన్‌ ఐడియా గ్రూప్‌లు రూ.1.45 లక్షల కోట్ల విలువైన బిడ్లు దాఖలు చేశాయి. 2015లో వచ్చిన రూ.1.09 లక్షల కోట్ల కంటే ఇది అధికమని టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఖరీదైన 700 మెగాహెర్ట్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌ 2016, 2021లో రెండుసార్లు వేలానికి వచ్చినా ఎవరూ బిడ్లు దాఖలు చేయకపోగా.. ఈ సారి మాత్రం ఈ బ్యాండ్‌కు సైతం బిడ్లు వచ్చాయని తెలిపారు. ఈ బ్యాండ్‌కు రూ.39,270 కోట్ల విలువైన బిడ్లు వచ్చాయని టెలికాం విభాగం తెలిపింది.

మంగళవారం నాలుగు రౌండ్లు బిడ్లు దాఖలవ్వగా.. ఐదో రౌండ్‌ బిడ్డింగ్‌లో రెండో రోజు వేలం ప్రక్రియ మొదలైంది. రూ 4.3 లక్షల కోట్ల విలువైన 72 గిగా హెర్ట్జ్‌ స్పెక్ట్రమ్‌ను ఈ సారి వేలానికి ఉంచిన సంగతి తెలిసిందే. వేలం పూర్తయ్యాక స్పెక్ట్రమ్‌ను ఆగస్టు 14 కల్లా కేటాయించాలన్నది ప్రభుత్వ లక్ష్యం కాగా.. సెప్టెంబరు కల్లా దేశంలో 5జీ సేవలు ప్రారంభం అవుతాయని మంత్రి తెలిపారు. ఈ సేవలు అందుబాటులోకి వస్తే.. పూర్తి నిడివి గల అత్యంత నాణ్యమైన వీడియో లేదా సినిమాను సెకన్లలోనే డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇ-హెల్త్‌, కనెక్టెడ్‌ వెహికల్స్‌, మెరుగైన ఆగ్‌మెంటెడ్‌ రియాల్టీ, మెటావర్స్‌ అనుభవాలు, అధునాతన మొబైల్‌ క్లౌడ్‌ గేమింగ్‌ వంటివి అందుబాటులోకి వస్తాయి.


5జీ కథనాలు..


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని