
ఆలోగా దేశవ్యాప్తంగా BSNL 4g సేవలు: కేంద్రం
దిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు వచ్చే ఏడాది సెప్టెంబర్లోగా దేశవ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయని కేంద్రం వెల్లడించింది. 4జీ సేవలు అందుబాటులోకి వచ్చాక కంపెనీ తొలి ఏడాది ఆదాయం రూ.900 కోట్ల మేర పెరగనుందని తెలిపింది. ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నకు లోక్సభలో కేంద్ర మంత్రి దేవ్సిన్హా చౌహాన్ సమాధానం ఇచ్చారు.
బీఎస్ఎన్ఎల్లో గానీ, ఎంటీఎన్ఎన్ఎల్లో గానీ పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన ప్రతిపాదనేదీ లేదని మరో ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్కు రూ.1,33,952 కోట్లు, ఎంటీఎన్ఎల్కు రూ.3,556 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయని వెల్లడించారు. 2021 సెప్టెంబర్ 30 నాటికి బీఎస్ఎన్ఎల్కు రూ.85,721 కోట్లు, ఎంటీఎన్ఎల్కు రూ.30,159 కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారు. 4జీ సేవలకు సంబంధించి 2021 జనవరిలో బీఎస్ఎన్ఎల్ ఆసక్తి వ్యక్తీకరించింది. ఈ రెండు టెలికాం కంపెనీల పునరుద్ధరణ ప్యాకేజీలో భాగంగా 4జీ సేవలు అందించేందుకూ కేంద్రం బడ్జెట్లో కేటాయింపులు జరిపింది.