Gita Gopinath: ‘క్రిప్టోలను నిషేధిస్తే లాభం లేదు.. వాటిని నియంత్రించాలి’

అభివృద్ధి చెందుతున్న దేశాలు క్రిప్టో కరెన్సీలపై నిషేధిస్తే లాభం లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ అభిప్రాయపడ్డారు. అందుకు

Published : 16 Dec 2021 19:47 IST

ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపీనాథ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: అభివృద్ధి చెందుతున్న దేశాలు క్రిప్టో కరెన్సీలపై నిషేధిస్తే లాభం లేదని అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్‌) ముఖ్య ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ అభిప్రాయపడ్డారు. అందుకు బదులుగా వాటిపై నియంత్రణ తీసుకొస్తే ప్రయోజనాలు ఉంటాయని అన్నారు. క్రిప్టో కరెన్సీకి డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో దానిపై అంతర్జాతీయ విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. 

నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్ అప్లైడ్‌ ఎకనమిక్‌ రీసెర్చ్‌(NCAER) నిర్వహించిన సదస్సులో పాల్గొన్న గీతా గోపీనాథ్‌.. ‘గ్లోబల్‌ రికవరీ అండ్‌ పాలసీ ఛాలెంజెస్‌ ఇన్‌ 2022’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘వర్తమాన, అభివృద్ధి చెందుతున్న దేశాలు క్రిప్టో ఆస్తులు, కరెన్సీలపై నిషేధం విధిస్తే ఏ మాత్రం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే క్రిప్టో లావాదేవీలు విదేశాల్లో జరుగుతుంటాయి. దీంతో నిషేధం విధించినా ట్రేడ్‌ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల క్రిప్టో ఆస్తులు, కరెన్సీలపై నియంత్రణ తీసుకురావడం ముఖ్యం. క్రిప్టో లావాదేవీలు అంతర్జాతీయంగా జరుగుతుంటాయి గనుక ఆ సమస్యను ఏ ఒక్క దేశం ఒంటరిగా పరిష్కరించలేదు. వీటికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ పెరుగుతున్న దృష్ట్యా వీలైనంత త్వరగా క్రిప్టోలపై అంతర్జాతీయ విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది’’ అని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

భారత్‌లో క్రిప్టో కరెన్సీపై నిషేధం విధించాలని డిమాండ్లు వినిపిస్తున్న వేళ.. గీతా గోపీనాథ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇదిలా ఉండగా.. క్రిప్టో నియంత్రణపై బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే క్రిప్టోను కరెన్సీగా కాకుండా ఆస్తిగా పరిగణించాలని కేంద్రం భావిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని