ఈపీఎస్: ఒక్క షేరుపై వచ్చే రాబడిని లెక్కించాలంటే
ఈపీఎస్ (Earning per share) అంటే ఒక్కో షేరుపై వచ్చిన ఆదాయం. ఈపీఎస్ లెక్కించేందుకు సంస్థ ఆర్జించిన మొత్తం లాభంను మొత్తం షేర్ల సంఖ్యతో భాగించాలి. దీని ఆధారంగా మదుపర్లు తాము పెట్టుబడి చేసిన షేర్లపై రాబడి, కంపెనీ స్థితిగతులను విశ్లేషించవచ్చు. ఉదాహరణకు కంపెనీ ‘x’ ఈపీఎస్ 15 అనుకుంటే ఆ సంస్థలో మదుపరి కి ఉన్న ప్రతీ షేరుపై రూ.15...
ఈపీఎస్ అంటే ఏంటి? ఎందుకు దీన్ని తెలుసుకోవాలి ? దీన్ని ఆధారంగా మదుపర్లు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? తదితర విషయాలను తెలుసుకుందాం.
ఈపీఎస్ (Earning per share) అంటే ఒక్కో షేరుపై వచ్చిన ఆదాయం. ఈపీఎస్ లెక్కించేందుకు సంస్థ ఆర్జించిన మొత్తం లాభంను మొత్తం షేర్ల సంఖ్యతో భాగించాలి. దీని ఆధారంగా మదుపర్లు తాము పెట్టుబడి చేసిన షేర్లపై రాబడి, కంపెనీ స్థితిగతులను విశ్లేషించవచ్చు. ఉదాహరణకు కంపెనీ ‘x’ ఈపీఎస్ 15 అనుకుంటే ఆ సంస్థలో మదుపరి కి ఉన్న ప్రతీ షేరుపై రూ.15 ఆదాయం వస్తుంది. కంపెనీ ‘Y’ ఈపీఎస్ 30 అనుకుంటే ఆ సంస్థలో మదుపరి కి ఉన్న ప్రతీ షేరుపై రూ.30 రూపాయల ఆదాయం వస్తుంది.
అశ్వత్ అనే వ్యక్తికి ఒక కంపెనీ లో 450 షేర్లు ఉన్నాయి . కంపెనీ ఈపీఎస్ 10 , అయితే ఒక్కోషేరుపై ఆదాయం రూ.10. రాబడి = 10 x 450 = రూ. 4500. ఈపీఎస్ ఎక్కువ ఉంటే మంచిదా? తక్కువ ఉండాలా అంటే… ఈపీఎస్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఒక షేరుపై రాబడి పెరుగుతుంటే మొత్తం షేర్ల పై మదుపరికి రాబడి కాస్త పెరుగుతుంది… అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక్క షేరు కు ఎంత వస్తుందనేది తెలుస్తుంది. కానీ ఆ షేరు ధర ఎంత అనేది ముఖ్యం. ఒక కంపెనీ ‘A’ షేరు ధర రూ. 900 దాని ఈపీఎస్ 30 అనుకుందాం. అదే విధంగా వేరొక కంపెనీ’B’ షేరు ధర రూ. 100 దాని ఈపీఎస్ 10 అనుకుందాం. అప్పుడు ఈపీఎస్ ఎక్కువ 30 ఉన్నది మంచిదా… 10 ఉన్నది…మంచిదా? అంటే కంపెనీ 10 ఉన్నదే మంచిదని చెప్పాలి. ఎందుకంటే కంపెనీ 'A’లో మదుపు రూ. 900 పై రూ.30 వస్తోంది. కంపెనీ ‘B’ లో రూ. 100 మదుపుపై రూ.10 వస్తుంది. ఇక్కడే పీఈ నిష్పత్తి ని చూడాలి. కంపెనీ ‘B’ లో 900 కు 9 షేర్లు వస్తాయి. ఆ విధంగా ఒక్కో షేరు పై లాభం 10 అంటే మొత్తం రూ. 90… అదే కంపెనీలో వచ్చేఆదాయం రూ.30మాత్రమే. కేవలం అందుకే ఈపీఎస్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకుని అంచనాకు రాకూడదు. పోల్చండిలా…ఒకే రంగానికి చెందిన వేర్వేరు కంపెనీల ఈపీఎస్ లను విశ్లేషించడం ద్వారా మదుపర్లు తాము పెట్టుబడి చేసిన కంపెనీ పనితీరును పోల్చి చూసుకోవచ్చు. తద్వారా ఆ మదుపరి ఆశించిన రాబడి పొందుతున్నారో లేదో తెలుసుకోవచ్చు. అదే రంగానికి చెందిన ఇతర కంపెనీల ఈపీఎస్ లను పరిశీలించడం ద్వారా పెట్టుబడి చేసిన కంపెనీ షేరు ఇచ్చే రాబడిని పోల్చి చూసుకోవచ్చు.
ఈపీఎస్ లెక్కించండి ఇలా:
ఈపీఎస్= సంస్థ ఆర్జించిన లాభం/ మొత్తం షేర్ల సంఖ్య
కంపెనీ ‘A’ లో ఒక షేరు ధర రూ. 100 అనుకుందాం
ఆ ఏడాది ఆకంపెనీ ఆర్జించిన లాభం 30కోట్లు
మొత్తం షేర్ల సంఖ్య = 3,000,00,00
ఈపీఎస్ = 30కోట్లు/ 3కోట్లు
ఈపీఎస్ = రూ.10
మదుపర్ల ఆసక్తిని తెలిపే పీఈ నిష్పత్తి
బేసిక్ , డైల్యూటెడ్ ఈపీఎస్ అంటే ఏంటి? వీటిని ఏవిధంగా లెక్కిస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.మనం కంపెనీ నివేదికల్లో రెండు రకాల ఈపీఎస్ లను చూస్తుంటాం. అవి…
-
బేసిక్ ఈపీఎస్: సాధారణ ఈక్విటీ మాత్రమే ఉండే కంపెనీ ఈపీఎస్ ను బేసిక్ ఈపీఎస్ అంటారు.
-
డైల్యూటెడ్ ఈపీఎస్: డైల్యూటెడ్ ఈపీఎస్ అంటే కంపెనీ వారెంట్లు, కన్వర్టబుల్ డిబెంచర్లు, రైట్స్ ఇష్యూ ఇతర పెట్టుబడి సాధనాలు ఈక్విటీ షేర్లుగా భవిష్యత్తులో మారే అవకాశం ఉంటే వాటిని కలిపి లెక్కించేదాన్ని డైల్యూటెడ్ ఈపీఎస్ అంటారు.
ఉదాహరణ ద్వారా ఈ పద్ధతిని అర్థం చేసుకుందాం.
సాధారణ ఈక్విటీ షేర్లు (కామన్ స్టాక్ ) మాత్రమే కలిగి ఉంటే ఆ సంస్థకు రెండురకాల ఈపీఎస్ లెక్కించాల్సిన అవసరం లేదు. ఈ అంశం సంస్థ క్యాపిటల్ స్ట్రక్చర్ పై ఆధారపడి ఉంటుంది. కంపెనీ లో ఉండే కన్వర్టబుల్ డిబెంచర్లు ఏవైనా ఇతర ఈక్విటీగా మారేందుకు అవకాశం ఉండే సెక్యురిటీలను కలిపి (ఈక్విటీగా బదలాయించి) లెక్కించే ఈపీఎస్ ను డైల్యూటెడ్ ఈపీఎస్ అంటారు.
ఒక కంపెనీ ‘A’ మరో కంపెనీ ‘B’ గత ఐదేళ్ల కాలంలో ఈపీఎస్ విలువను పరిశీలిస్తే…
కంపెనీ ‘A’ లో బేసిక్, డైల్యూటెడ్ ఈపీఎస్ ల మధ్య వ్యత్యాసం గమనించవచ్చు. ఆర్థిక సంవత్సరం 2013 లో బేసిక్ ఈపీఎస్ 25.52 ఉంటే డైల్యూటెడ్ ఈపీఎస్ 22.79 ఉంది. క్రమంగా 2017 నాటికి బేసిక్ ఈపీఎస్, డైల్యూటెడ్ ఈపీఎస్ దగ్గరగా వచ్చింది. కంపెనీ A లో ఇతర ఈక్విటీగా మారే సెక్యురిటీలు ఉనట్టు అర్థమవుతుంది.
కంపెనీ ‘B’ లో రెండు బేసిక్ డైల్యూటెడ్ ఈపీఎస్ ల మధ్య వ్యత్యాసం లేదు. ఆర్థిక సంవత్సరం 2013 లో బేసిక్ ఈపీఎస్ 5.65 ఉంటే డైల్యూటెడ్ ఈపీఎస్ కూడా 5.65 గా ఉంది. 2017 నాటికి కూడా బేసిక్ ఈపీఎస్, డైల్యూటెడ్ ఈపీఎస్ సమానంగానే ఉన్నాయి. అంటే దీని బట్టి కంపెనీ 'B’లో ఎలాంటి ఇతర ఈక్విటీగా మారే సెక్యురిటీలు లేనట్టు అర్థమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.