Changpeng Zhao: ప్రపంచ కుబేరుడైన ఓ ‘కుక్’ కథ ఇది!
బినాన్స్ వ్యవస్థాపకుడు జావో నికర సంపద 96 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో ఆయన ప్రపంచం కుబేరుల జాబితాలో 11వ స్థానానికి ఎగబాకారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు.....
ఇంటర్నెట్ డెస్క్: చైనా మూలాలున్న ఓ కెనడా కుర్రాడు ఇంటి ఖర్చుల కోసం మెక్ డొనాల్డ్స్లో ‘కుక్’గా పనిచేసేవాడు. రాత్రివేళల్లో గ్యాస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించేవాడు. కట్ చేస్తే.. ఆ వ్యక్తే ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో రాజకుటుంబీకులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా పక్కన ఏకంగా ఓ అపార్ట్మెంట్నే సొంతం చేసుకున్నారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో భోజనాలు, వ్యాపార మంతనాలు. అలాగని ఆయన విలాసవంతమైన జీవితమేం గడపట్లేదు. కనీసం కారు కూడా లేదు. ఖరీదైన వాచ్లు, గ్యాడ్జెట్ల జోలికి అసలే వెళ్లరు. ఇంతకీ ఎవరతను?ఏం చేస్తున్నారు?
ప్రపంచ దేశాలు మాట్లాడుకుంటున్న అంశాల్లో కరోనా ఒకటైతే.. క్రిప్టోకరెన్సీ (Cryptocurrency) మరొకటి. కరోనా రూపాంతరాలు చెందుతూ కలవరపెడుతుంటే.. క్రిప్టో మాత్రం భారీ హెచ్చుతగ్గులతో వార్తల్లో నిలుస్తోంది. ఇప్పటికీ క్రిప్టో కరెన్సీని అర్థం చేసుకోవడానికి అనేక మంది తలలు పట్టుకుంటున్నారు. కొందరేమో రూ.కోట్లకు కోట్లు సంపాదిస్తూ కుబేరులైపోతున్నారు. ఈ కోవకు చెందిన వాడే చాంగ్పెంగ్ జావో. ఒకప్పుడు కుక్గా పనిచేసిన చైనా మూలాలున్న కెనడా కుర్రాడే ఈ జావో.
జావో సంపద విలువ ఎంత?
ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీల్లో ఒకటైన ‘బినాన్స్’ (Binance) అధిపతి చాంగ్పెంగ్ జావో ప్రపంచ కుబేరుల్లో 11వ స్థానాన్ని పొందినట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. జావో నికర సంపద విలువను 96 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7.2 లక్షల కోట్లు)గా బ్లూమ్బర్గ్ లెక్కగట్టింది. ఫలితంగా ఒరాకిల్ సహ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ (107 బిలియన్ డాలర్లు-10వ స్థానం), రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీ (93 బిలియన్ డాలర్లు- 12వ స్థానం) మధ్య జావో చోటు పొందారు. టెక్ సంపన్నులు ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్ల సరసన జావో చేరడానికి, క్రిప్టో కరెన్సీల జోరు దోహదపడింది. క్రిప్టో వర్గాలు జావోను ‘సీజడ్ (CZ)’గా వ్యవహరిస్తుంటాయి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన క్రిప్టో బిలియనీర్ కూడా జావోనే.
ఖర్చుల కోసం కుక్గా...
సీజడ్ చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్లో జన్మించారు. సాంస్కృతిక విప్లవం సమయంలో జావో కుంటుంబం దేశం విడిచి వెళ్లాల్సి వచ్చింది. తల్లిదండ్రులిద్దరూ చదువుకున్నవారు కావడంతో కెనడాలోని వ్యాంకోవర్కి చేరుకున్నారు. అక్కడ చదువుకుంటున్న సమయంలోనే ఖర్చుల కోసం జావో మెక్డొనాల్డ్స్లో పనిచేసేవారు. తర్వాత ఆయన మెక్గిల్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్లో పట్టా పుచ్చుకున్నారు. అనంతరం న్యూయార్క్, టోక్యోలో పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేశారు. టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజీలో ట్రేడ్ ఆర్డర్స్ను మ్యాచ్ చేసే ఓ సాఫ్ట్వేర్ను రూపొందించారు. తర్వాత బ్లూమ్బర్గ్లో ఫ్యూచర్స్ ట్రేడింగ్ కోసం ఓ సాఫ్ట్వేర్కు కోడింగ్ చేశారు. ఈ సమయంలోనే ఆయన సేవల్ని గుర్తించిన కంపెనీ రెండేళ్లలో మూడు ప్రమోషన్లు ఇచ్చింది. న్యూజెర్సీ, లండన్, టోక్యోకు బదిలీ చేసింది. దీంతో విసుగెత్తిన జావో ఆ ఉద్యోగాన్ని వదిలేశారు. అప్పటికి ఆయన వయసు 27 ఏళ్లు.
ఓ ఆట జావో జీవితాన్ని మార్చేసింది..
2005లో జావో సొంత దేశం చైనాలోని షాంఘైకి చేరుకున్నారు. సొంతంగా ‘ఫ్యూజన్ సిస్టమ్స్’ అనే కంపెనీని స్థాపించారు. ఇదే తర్వాత స్టాక్ బ్రోకర్ల కోసం ప్రపచంలోనే అత్యంత వేగవంతమైన హై-ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ సిస్టమ్స్ని రూపొందించింది. 2013లో ఓ రోజు పోకర్ ఆడుతున్న సమయంలో తన మిత్రుడొకరు బిట్కాయిన్ (Bitcoin) గురించి చెప్పారు. దానిపై క్షుణ్నంగా అధ్యయనం చేసిన జావో.. కొన్ని నెలల్లోనే అదే తన కెరీర్ అని నిశ్చయించుకున్నారు. బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయడానికి ఏకంగా షాంఘైలోని తన అపార్ట్మెంట్నే అమ్మేశారు. క్రిప్టో వ్యాలెట్ ‘బ్లాక్చైన్.ఇన్ఫో’ బృందంలో మూడో వ్యక్తిగా చేరారు. ఈ సమయంలోనే ప్రముఖ బిట్కాయిన్ ఎవాంజలిస్ట్లుగా పేరొందిన రోజర్ వెర్, బెన్ రీవ్స్తో కలిసి పనిచేశారు. ‘ఓకేకాయిన్’లో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గానూ చేశారు.
ఆరు నెలల్లోనే అగ్రస్థానానికి బినాన్స్...
ఈ క్రమంలో సొంతంగా ఏదైనా చేయాలన్న ఆలోచనతో జావో ఓ డిజిటల్ అసెట్ ఎక్స్ఛేంజీని ప్రారంభించాలనుకున్నారు. అలా 2017లో పుట్టిందే బినాన్స్. తొలినాళ్లలో కొన్ని ఒడుదొడుకులు తప్పలేదు. ఇంటిని అమ్మి బిట్కాయిన్లో పెట్టిన పెట్టుబడులు భారీగా పతనమయ్యాయి. కాయిన్ విలువ ఏకంగా 600 డాలర్ల నుంచి 200 డాలర్లకు పడిపోయింది. కానీ, బినాన్స్కు మాత్రం ఆదరణ భారీగా పెరిగింది. కేవలం ఆరు నెలల్లోనే ప్రపంచంలోనే నెం.1 క్రిప్టో ఎక్స్ఛేంజీగా నిలిచింది. బినాన్స్ పాపులారిటీ పెరుగుతున్న కొద్దీ బిట్కాయిన్ విలువ కూడా ఎగబాకింది. అనేక క్రిప్టోకరెన్సీలు పుట్టుకొచ్చాయి. అవన్నీ బినాన్స్ వేదికగా ట్రేడవుతున్నాయి. దీంతో కంపెనీలో 90 శాతం వాటాలున్న జావో సంపద విలువ కూడా పెరిగింది. అలా అని ఆయన ఖరీదైన జీవితాన్నేం గడపట్లేదని సన్నిహితులు చెబుతున్నారు! సొంతంగా కనీసం ఇప్పటి వరకు కారు కూడా లేదట! ఇక ఖరీదైన గ్యాడ్జెట్ల జోలికి అసలే వెళ్లరట. చాలా సింపుల్గా ఉండడానికే ఇష్టపడతారట!
జావో సంపద ఇంకా ఎక్కువే..!
అయితే బ్లూమ్బర్గ్ లెక్కల కంటే జావో నికర సంపద మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే జావోకు ఉన్న బిట్కాయిన్ నిల్వలు, బినాన్స్ జారీ చేసే బినాన్స్ కాయిన్లో వాటాలను బ్లూమ్బర్గ్ లెక్కలోకి తీసుకోలేదు. వీటిని కలిపితే నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న బిల్ గేట్స్ (135 బి.డాలర్ల సంపద), జుకర్బర్గ్ (124 బి.డాలర్ల సంపద)లకు సరిసమానంగా జావో నిలవొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగత క్రిప్టో పెట్టుబడుల వివరాలను జావో ఎప్పుడూ ప్రకటించలేదు. తన సంపదలో ఎక్కువ శాతం వాటా క్రిప్టోలదే అని గతంలో ఆయనే వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీ అయిన బినాన్స్ ఆర్థిక వివరాలను ప్రకటించదు. రోజుకు ఈ సంస్థ 170 బి.డాలర్ల విలువైన క్రిప్టో లావాదేవీలను జరుపుతుంది. ఏ ఇతర పోటీ సంస్థ లావాదేవీలతో పోల్చినా, ఇది పలు రెట్లు అధికం కావడం గమనార్హం.
క్రిప్టోతో జాగ్రత్త సుమా!
ఏదేమైనప్పటికీ.. క్రిప్టోకరెన్సీకి ఒకటి రెండు దేశాల్లో మాత్రమే చట్టబద్ధత ఉంది. ఇంకా అనేక దేశాల్లో దీనిపై వివాదాలు కొనసాగుతున్నాయి. చైనా ఏకంగా క్రిప్టో ట్రేడింగ్ను నిషేధించింది. మన దేశంలోనూ ప్రభుత్వం దీనిపై మల్లగుల్లాలు పడుతోంది. క్రిప్టో వల్ల ఆర్థిక వ్యవస్థకు అస్థిరతలు తప్పవని ఆర్బీఐ హెచ్చరించింది. మరోవైపు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో నిమిషాల వ్యవధిలో విలువలు భారీగా మారిపోతుంటాయి. భారీ హెచ్చుతగ్గులు నమోదవుతుంటాయి. ఇటీవల మన దేశంలో కొన్ని క్రిప్టో ఎక్స్ఛేంజీలు పన్ను ఎగవేసినట్లు కూడా నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో క్రిప్టోకు ఎంత ఆదరణ ఉందో.. దాని చుట్టూ అన్ని వివాదాలూ కొనసాగుతున్నాయి. బినాన్స్ చాలా దేశాల్లో నియంత్రణాపరమైన చిక్కులు ఎదుర్కొంటోంది. కాబట్టి క్రిప్టోలో మదుపు చేయడం చాలా నష్టభయంతో కూడుకున్న వ్యవహారం అని మరవొద్దు!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్ప్రదేశ్లో హైఅలర్ట్.. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు