Cibil Score: సిబిల్ స్కోరు లేకుండా రుణం పొందడం సాధ్యమేనా..?
రుణ మంజూరులో క్రెడిట్ స్కోరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే సిబిల్ స్కోరు గురించి తెలుసుకోవడం ముఖ్యం.
ఇంటర్నెట్ డెస్క్: గత రెండేళ్లలో వివిధ కారణాలతో చిన్న మొత్తంలో రుణాలు తీసుకునే వారి సంఖ్య బాగా పెరిగింది. కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోవడం, వేతనంలో కోతలు, వైద్య అత్యవసర పరిస్థితులు, కొత్త ఉద్యోగాల వేటలో నైపుణ్యం పెంచే కోర్సులు చేయడం వంటి కారణాలతో స్వల్ప కాలిక రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరిగింది. 2020 నాలుగో త్రైమాసికంలో జారీ చేసిన రుణాల్లో 60 శాతం ₹25వేల లోపువేనని కొన్ని సంస్థల నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాకుండా ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వారే కావడం గమనార్హం. దీనిబట్టి యువత ఎక్కువగా రుణాలవైపు చూస్తున్నారని అర్థమవుతోంది. అయితే, సాధారణంగా సిబిల్ స్కోరును చూసి బ్యాంకులు రుణాలను మంజూరు చేస్తాయి. క్రెడిట్ నివేదికలో మీ రుణ చరిత్రకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. అందుకే రుణం సులభంగా పొందడం కోసం ఆరోగ్యకరమైన క్రెడిట్ స్కోరును నిర్వహించడం తప్పనిసరి. అందువల్ల రుణ గ్రహీత క్రెడిట్ స్కోరు గురించి తెలుసుకోవడంతో పాటు.. దాన్ని ఎలా నిర్వహించాలి? ఎంత క్రెడిట్ స్కోరు ఉంటే మంచిది? క్రెడిట్ స్కోరు తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే అంశాలు తెలుసుకోవాలి.
సిబిల్ స్కోరు అంటే..?
క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ను సిబిల్ అని పిలుస్తారు. ఇది ఒక వ్యక్తి రుణ చరిత్రను న్యూమరికల్గా అందిస్తుంది. వ్యక్తులకు చెందిన రుణాలు, క్రెడిట్ కార్డుల చెల్లింపు వ్యవహారాలు తదితర సమాచారాన్ని సిబిల్ సేకరించి నివేదికలు తయారుచేస్తుంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ప్రతినెలా రుణ గ్రహీతల సమాచారాన్ని సిబిల్కు అందజేస్తాయి. ఈ సమాచారాన్ని ఉపయోగించి సిబిల్ క్రెడిట్ స్కోర్ను తయారుచేస్తుంది.
సిబిల్ వద్ద ఎలా నమోదు చేసుకోవాలి?
‘మై సిబిల్’ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఖాతా క్రియేట్ చేసిన తర్వాత గుర్తింపు, చిరునామాకు సంబంధించిన ప్రూఫ్లు, విద్యుత్, టెలిఫోన్ బిల్లులు మొదలైన పత్రాలను తప్పనిసరిగా అప్లోడ్ చేయాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తైన తర్వాత క్రెడిట్ స్కోరును ట్రాక్ చేయొచ్చు.
క్రెడిట్ స్కోర్ ఎందుకంత ముఖ్యం..?
క్రెడిట్ స్కోర్ అనేది భవిష్యత్లో రుణాలు సులభంగా లభించేందుకు సహాయపడుతుంది. సాధారణంగా సిబిల్ స్కోరు 300 నుంచి 900 మధ్య ఉంటుంది.750 కంటే ఎక్కువ ఉంటే ఆరోగ్యకరమైన చరిత్ర ఉన్నట్లు పరిగణిస్తారు. అంతకంటే తక్కువ స్కోరు ఉంటే ఆందోళనకరంగా పరిగణించాలి. బ్యాంకులు ఈ స్కోరు ఆధారంగానే రుణాలను మంజూరు చేస్తాయి. కాబట్టి రుణ మంజూరులో క్రెడిట్ స్కోరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే, క్రెడిట్ కార్డులు కూడా సులభంగా పొందొచ్చు. కార్డు పరిమితి కూడా ఎక్కువగా లభించే అవకాశం ఉంటుంది. ఇతరులతో పోలిస్తే తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది. దీంతో పాటు క్రెడిట్ చరిత్ర బాగుంటే ఉద్యోగాలు, విదేశీ పర్యటనల కోసం వీసా త్వరగా వస్తుంది.
స్కోర్ పెంచుకోవడం ఎలా?
సిబిల్ స్కోర్ను మెరుగుపరచడం కోసం మీ క్రెడిట్ రిపోర్టులో కనిపించే వివాదాస్పద లావాదేవీలను పరిష్కరించే దిశగా పనిచేయడం ద్వారా ప్రారంభించండి. ఈఎమ్ఐలు లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలను సకాలంలో చెల్లించాలి. అలాగే, క్రెడిట్ కార్డును వినియోగించేటప్పుడు గరిష్ఠ పరిమితి వరకు వెళ్లకుండా జాగ్రత్తపడాలి. అప్పు తీసుకొని షాపింగ్ చేయొద్దు. క్రెడిట్ చరిత్రను నిర్మించడమే లక్ష్యంగా తక్కువ వ్యవధిలో వేర్వేరు రుణాలు లేదా క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తు చేయొద్దు. ఎక్కువగా రుణాలు తీసుకొని.. సమాయనికి చెల్లింపులు చేస్తే క్రెడిట్ చరిత్ర బాగున్నప్పటికీ అదే అలవాటుగా మారితే రుణాల ఊబిలో కూరుకుపోయే అవకాశం లేకపోలేదు. అందువల్ల రుణం తీసుకునే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.
క్రెడిట్ స్కోరు లేకుండా రుణం పొందొచ్చా?
సిబిల్ స్కోరు లేకపోయినా రుణం పొందడం సాధ్యమే. అయితే సెక్యూర్డ్ రుణాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే రుణానికి బదులు తగిన ఆస్తిని హామీగా ఉంచాలి. ఉదాహరణకు బంగారంపై రుణం పొందేందుకు రుణ గ్రహీతకు క్రెడిట్స్కోరు ఉండాల్సిన అవసరం లేదు. అలాగే ఇతర ఆస్తులను హామీగా ఉంచి తీసుకునే రుణాలకు కూడా క్రెడిట్ స్కోరు అక్కర్లేదు. అయితే ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. ఇలాంటి రుణాలకు క్రెడిట్ స్కోరు అవసరం లేకపోయినా తిరిగి చెల్లించడంలో జాప్యం జరిగితే క్రెడిట్ స్కోరు ప్రభావితం అవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే..
-
జగన్ పని దొంగ.. దోపిడీదారుడు: చంద్రబాబు
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్