China: మరో 25 యాప్లపై చైనా వేటు
దేశ భద్రత, సైబర్ సెక్యూరిటీ పేరిట బడా సాంకేతిక సంస్థలపై విరుచుకుపడుతున్న చైనా.. తాజాగా మరో 25 యాప్లను తొలగించాలని యాప్ స్టోర్లను ఆదేశించింది. అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం ఆదేశాల మేరక.....
బీజింగ్: దేశ భద్రత, సైబర్ సెక్యూరిటీ పేరిట బడా సాంకేతిక సంస్థలపై విరుచుకుపడుతున్న చైనా.. తాజాగా మరో 25 యాప్లను తొలగించాలని యాప్ స్టోర్లను ఆదేశించింది. అక్కడి కమ్యూనిస్టు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇప్పటికే ప్రముఖ క్యాబ్ సేవల కంపెనీ ‘దీదీ గ్లోబల్’ యాప్ను తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా అదే దీదీకి చెందిన మరో 25 అనుబంధ యాప్లను కూడా తొలగించాలని సైబర్స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశించింది. ఇతర దేశాల స్టాక్ మార్కెట్లలో నమోదైన కంపెనీలపై నిఘా కొనసాగుతుందని గత వారం చైనా పేర్కొంది. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు పేరిట చైనీయులకు చెందిన కీలక సమాచారాన్ని విదేశాలకు తరలిస్తున్నారన్నది చైనా ప్రభుత్వ ఆరోపణ.
కొత్త సైబర్ నిబంధనల పేరిట.. ఇతర దేశాలకు తరలించే సమాచారంపై ప్రభుత్వ నియంత్రణ మరింత కఠినతరం చేసేందుకు చైనా సిద్ధమైంది. గతంలో దేశ భద్రత పేరిట టెన్సెంట్, అలీబాబా కంపెనీలపై విరుచుపడ్డ డ్రాగన్ ఇప్పుడు సైబర్భద్రత నెపంతో తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. గత ఏడాది టిక్టాక్ సహా పలు చైనా యాప్లు దేశ భద్రతకు సవాల్ విసిరిన నేపథ్యంలో వాటిపై నిషేధం విధిస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనికి భిన్నంగా ఇప్పుడు సొంత దేశ యాప్లనే నిషేధిస్తున్న చైనా.. తన ఆధిపత్య ధోరణిని బయట పెట్టుకుంటోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.