5G Network: ట్రయల్స్‌కు స్పెక్ట్రమ్‌ కేటాయింపు

DoT allocates spectrum for 5G trials: టెలికాం కంపెనీలకు స్పెక్ట్రమ్‌ కేటాయించిన డాట్‌..

Updated : 28 May 2021 16:28 IST

దిల్లీ: దేశంలో 5జీ సేవలకు సంబంధించి మరో ముందడుగు పడింది. ఇటీవలే 5జీ ట్రయల్స్‌కు అనుమతిచ్చిన టెలికాం విభాగం (డాట్‌).. తాజాగా అందుకు సంబంధించిన స్పెక్ట్రమ్‌ను టెలికాం సంస్థలకు కేటాయించింది. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, గుజరాత్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు 700 మెగాహెర్జ్‌ బ్యాండ్‌, 3.3- 3.6 గిగాహెర్జ్‌ బ్యాండ్‌, 24.25- 28.5 గిగాహెర్జ్‌ బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను కేటాయించినట్లు ఆయా వర్గాలు పేర్కొన్నాయి.

దేశంలో 5జీ ట్రయల్స్‌ నిర్వహణకు రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, ఎంటీఎన్‌ఎల్‌ కంపెనీలకు మే4న డాట్‌ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఏ కంపెనీ కూడా చైనా సాంకేతికతను ఉపయోగించకూడదని షరతు విధించింది. ఇందుకు లోబడి కంపెనీలు సైతం ఎరిక్సన్‌, నోకియా, శాంసంగ్‌, సీ-డాట్‌తో జట్టు కట్టి ట్రయల్స్‌కు సిద్ధమయ్యాయి. రిలయన్స్‌ జియో మాత్రం దేశీయంగా తాను సొంతంగా అభివృద్ధి చేసిన సాంకేతికను వినియోగిస్తోంది. ట్రయల్స్‌లో  భాగంగా టెలీ మెడిసిన్‌, టెలీ ఎడ్యుకేషన్‌, డ్రోన్‌ ఆధారిత వ్యవసాయ పర్యవేక్షణ వంటివి పరీక్షించనున్నారు. మొత్తం 6 నెలల పాటు ట్రయల్స్‌ జరగనున్నాయి. ప్రతి కంపెనీ కూడా కేవలం అర్బన్‌ ఏరియాకు మాత్రమే పరిమితం కాకుండా రూరల్‌, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లోనూ ట్రయల్స్‌ నిర్వహించాల్సి ఉంటుంది. పంజాబ్‌, హరియాణా, చండీగఢ్‌లో మాత్రం ఏ కంపెనీకీ స్ప్రెక్ట్రమ్‌ కేటాయించకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని