China's property bubble: డ్రాగన్ను భయపెడుతున్న ‘ఘోస్ట్ సిటీ ’లు..!
చైనా ‘రియల్’ ప్రకంపనలు మొదలయ్యాయి.. ఇప్పటికే ఎవర్గ్రాండె దాదాపు 300 బిలియన్ డాలర్ల అప్పులు ఎగ్గొట్టే దిశగా అడుగులు వేస్తుండగా.. ఇప్పుడు దాంతో ఫాంటాసియా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా జతకలిసింది. తాను
కుంగుతున్న ప్రాపర్టీ కంపెనీలు
ఎవర్గ్రాండె ఆరంభం మాత్రమే..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చైనా ‘రియల్’ ప్రకంపనలు మొదలయ్యాయి.. ఇప్పటికే ఎవర్గ్రాండె దాదాపు 300 బిలియన్ డాలర్ల అప్పులు ఎగ్గొట్టే దిశగా అడుగులు వేస్తుండగా.. ఇప్పుడు దానికి ఫాంటాసియా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ తోడైంది. తాను కూడా బాండ్లపై చెల్లింపులు చేయలేనని చేతులెత్తేసింది. దీంతో చైనాలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర కష్టాల్లో ఉన్న విషయం వెలుగులోకి వస్తోంది. ఇదే నిజమైతే చైనా వృద్ధిరేటు దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉంది.
చేతులెత్తేసిన ఫాంటాసియా..
చైనాలోని ఫాంటాసియా హోల్డింగ్స్ సంస్థ అక్టోబర్ 4వ తేదీన బాండ్లపై చెల్లింపులు చేయలేనని ప్రకటించింది. దీంతో చైనాలో రియల్ఎస్టేట్ సంస్థల పరిస్థితి, పారదర్శకతపై ప్రపంచ వ్యాప్తంగా సందేహాలు రేకెత్తుతున్నాయి. సోమవారం ఉదయం ఫాంటాసియా రేటింగ్ను ప్రముఖ రేటింగ్ కంపెనీ ఫిచ్ B నుంచి 'CCC-'కు తగ్గించింది. సెప్టెంబర్ 28వ తేదీన చెల్లించాల్సిన 100 మిలియన్ డాలర్లు చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొంది. ఫాంటాసియా మాత్రం తాము సెప్టెంబర్ 28వ తేదీనే సంబంధిత ఖాతాల్లో చెల్లించాల్సిన నగదు జమ చేసినట్లు పేర్కొన్నట్లు ఫిచ్ వెల్లడించింది. ఒక రోజు ఆలస్యంగా బాండ్ హోల్డర్లకు అందుతాయని ఆ కంపెనీ చెబుతోందని పేర్కొంది. రేటింగ్ తగ్గించిన తర్వాత ఫాంటాసియా నుంచి ప్రకటన వెలువడింది. తాము విదేశీ చెల్లింపులను చేయలేకపోయినట్లు వెల్లడించింది. ఈ కంపెనీకి 1.9 బిలియన్ డాలర్ల ఆఫ్షోర్ బాండ్లు, దాదాపు మరో బిలియన్ డాలర్ల విలువ చేసే దేశీయ బాండ్లు కూడా ఉన్నాయి.
ఎవర్ గ్రాండెతో పోలిస్తే ఫాంటాసియా కంపెనీ నికర విలువ 415 మిలియన్ డాలర్లు మాత్రమే. కానీ, బాండ్ల చెల్లింపుల్లో విఫలం కావడం చైనా స్థిరాస్తి రంగంలో సమస్యలను చెబుతున్నాయి. ప్రస్తుతం ఫాంటాసియా 12.7 కోట్ల చదరపుటడుగుల ప్రాపర్టీలను అభివృద్ధి చేస్తోంది. మొత్తం 47 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. 2016లో జారీ చేసిన 500 మిలియన్ డాలర్ల విలువైన బాండ్లకు సంబంధించి ఈ ఏడాది చెల్లింపులు చేయాల్సి ఉందని సోమవారం ఎక్స్ఛేంజి ఫైలింగ్లో పేర్కొంది. కానీ, 206 మిలియన్ డాలర్లను చెల్లించలేనని చివర్లో ప్రకటించింది. కంపెనీ అనుబంధ సంస్థ సోమవారం చెల్లించాల్సిన 108 మిలియన్ డాలర్ల రుణాన్ని కూడా చెల్లించలేదని చైనాలో అతిపెద్ద ప్రాపర్టీ సంస్థ కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్ పేర్కొంది. మరోపక్క ఫాంటాసియా సమీకరించిన 150 మిలియన్ డాలర్ల విలువైన బాండ్ల వివరాలు ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో చూపలేదని ఫిచ్ పేర్కొంది. కంపెనీలో పారదర్శకత లోపించిందనడానికి ఇదే నిదర్శనమని చెప్పింది.
భయపెడుతున్న ఘోస్ట్ సిటీలు..
ఆకాశహర్మ్యాలతో నిర్మించిన కొత్త పట్టణాలు చైనాలో ఖాళీగా దర్శనమిస్తుంటాయి. పశ్చిమదేశాల మీడియా లు వీటిని తరచూ ఘోస్ట్ సిటీ (దెయ్యపు నగరం)లుగా వెక్కిరిస్తుంటాయి. చైనాలో 1970ల్లో ప్రజలు వ్యవసాయం నుంచి ఇతర రంగాలకు మారడం మొదలుపెట్టారు. అదే సమయంలో పట్టణీకరణ, నిర్మాణ రంగాలు ఊపందుకున్నాయి. దీంతో అప్పటి వరకు 18శాతం మాత్రమే ఉన్న పట్టణ జనాభా గతేడాదికి 64శాతానికి చేరింది. ఇక్కడ కోటి మందికిపైగా ఉన్న నగరాలు 10 వరకు ఉన్నాయి. ప్రపంచంలో పదోవంతు మంది ప్రజలు చైనా నగరాల్లో నివసిస్తున్నారు. పట్టణ జనాభా పెరుగుతుండటంతో స్థానిక ప్రభుత్వాల ఆదాయం కూడా బాగా పెరిగింది. పన్నులు, భూవిక్రయాలు, వ్యాపారాలపై పన్ను రూపంలో భారీగా సమకూరుతోంది. స్థానిక ప్రభుత్వాలు, ప్రభుత్వ వాటా ఉన్న రియల్ ఎస్టేట్ సంస్థలు వేగంగా నిర్మాణాలు చేపట్టాయి. ప్రైవేటు సంస్థలు ఇదే బాటలో పనిచేశాయి. చైనా జీడీపీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 29శాతం వాటా రియల్ ఎస్టేట్ రంగానిదే. ఈ క్రమంలో స్థిరాస్తి రంగం బుడగ వలే పెరుగుతూ పోయింది. ఈ రంగంలో భారీగా అప్పులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొన్నాక ఒక్క గతేడాదే స్థానిక ప్రభుత్వాలు చేసిన అప్పుల నుంచి 580 బిలియన్ డాలర్లను ఈ రంగానికి కేటాయించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
ఫలితంగా ఈ రంగంలో నిర్మాణాలతోపాటు స్పెక్యూలేషన్ కూడా పెరిగిపోయింది. దీంతో సంపన్న చైనీయులు ఇళ్లను కొనుగోలు చేసి ఖాళీగా ఉంచుతున్నారు. ఫలితంగా చాలా ప్రావిన్స్లలో వరుసగా ఖాళీగా ఉన్న ఆకాశహర్మ్యాలు కనిపిస్తుంటాయి. కంగ్బాషి, తియాంజెన్లో బిన్హయి న్యూ ఏరియా, జాంగ్జూలోని జెంగ్డాంగ్ న్యూడిస్ట్రిక్ట్, ఖష్గర్ వీఘర్ల కోసం నిర్మించిన కాలనీలు, ఇన్నర్ మంగలోనియాలోని క్వింగ్స్హుయి, యునాన్ ప్రావిన్స్లోని చెంగాంగ్ ప్రాజెక్టు వంటివి ప్రపంచ వ్యాప్తంగా ఘోస్ట్ సిటీలుగా పేరు తెచ్చుకున్నాయి. చైనాలో దాదాపు 20శాతం నిర్మాణాలు ఖాళీగా ఉన్నట్లు ఎన్పీఆర్.ఓఆర్జీ పేర్కొంది. ఫైనాన్షియల్ టైమ్స్ లెక్కల ప్రకారం 9 కోట్ల మందికి గృహ సౌకర్యం కల్పించేంత స్థాయిలో ఖాళీ ఇళ్లు ఉన్నాయి. ఇవి కెనడా లేదా జర్మనీ లేదా ఫ్రాన్స్ దేశాల్లో మొత్తం జనాభాకు సరిపోతాయి..!
జిన్పింగ్ ప్రసంగంతో రియల్ పునాదుల్లో ప్రకంపనలు..
రియల్ ఎస్టేట్ ఇలానే పెరుగుతూ పోతే ఏదో ఒక రోజు కుప్పకూలతుందని చైనా అధ్యక్షుడు షీజిన్పింగ్ గ్రహించారు. 2017లో ఆయన 19వ సీసీపీ కాంగ్రెస్లో మాట్లాడుతూ..‘‘ఇళ్లు ఉండేది నివసించడానికి.. అంతేగానీ స్పెక్యూలేషన్కు కాదు’’ అని వ్యాఖ్యానించారు. దీని ఫలితంగానే గతేడాది ‘త్రీరెడ్ లైన్స్’ పాలసీని తెచ్చారు. అడ్డగోలుగా అప్పులు తీసుకోవడాన్ని ఇది నియంత్రించింది. ఫలితంగా రియల్ రంగంలో ఆర్థిక ఉక్కబోత మొదలైంది. రియల్ ఎస్టేట్ బుడగను నియంత్రిస్తూ తగ్గించడం మొదలైంది. మరోపక్క షీ జిన్పింగ్ కమ్యూనిస్టు అజెండాలను బలంగా రియల్ రంగంపై రుద్దడం మొదలుపెట్టారు.
షీ జిన్పింగ్ ప్రభావం రియల్ ఎస్టేట్ కొనుగోళ్లపై కూడా పడింది. చైనా రియల్ ఎస్టేట్కు చిహ్నంగా ఉన్న ఎవర్గ్రాండె వంటి సంస్థలు ఫలితంగా అప్పుల్లో కూరుకుపోయాయి. ఇప్పటికే చైనా ఆర్థిక వ్యవస్థ అడ్డగోలుగా పెరిగిన రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడింది. దీంతో ఎవర్గ్రాండె వంటి గాలిబుడగ సంస్థల వృద్ధి ఇప్పుడు పేలిపోయే దశకు చేరింది. ఇటువంటి సంస్థలు కుప్పకూలకుండా రక్షించుకుంటూ.. ఆర్థిక వ్యవస్థ రియల్ రంగంపై ఆధారపడటాన్ని తగ్గించడమే ఇప్పుడు చైనా ముందున్న అతిపెద్ద సవాలు..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి