అనిశ్చితిలో.. ఆర్థిక భరోసా!

బీమా రంగం మిగతా వాటితో పోలిస్తే కాస్త భిన్నం. ఇందులో నిబంధనలు మిగతా పథకాలతో పోలిస్తే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొన్ని దశాబ్దాల క్రితం బీమా అంటే.. ఆర్థిక రక్షణే ప్రధానంగా ఉండేది.........

Updated : 23 Apr 2021 10:53 IST

బీమా రంగం మిగతా వాటితో పోలిస్తే కాస్త భిన్నం. ఇందులో నిబంధనలు మిగతా పథకాలతో పోలిస్తే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొన్ని దశాబ్దాల క్రితం బీమా అంటే.. ఆర్థిక రక్షణే ప్రధానంగా ఉండేది. కానీ, కాలంతోపాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఇప్పుడు కొవిడ్‌-19 తర్వాత.. జీవిత బీమా మరోసారి వెలుగులోకి వచ్చింది. బీమా ప్రాధాన్యం పెరిగింది. కొత్తతరం కూడా బీమా పాలసీలను తీసుకునేందుకు ముందుకు వస్తున్నారు. మన చుట్టూ ఉన్న అనిశ్చితి నేపథ్యంలో.. బీమా సంస్థలు తమ పాలసీల్లో కొత్తగా తెస్తున్న మార్పులు.. అవి పాలసీదారులపై చూపించే ప్రభావాన్ని తెలుసుకుందాం..
అనుకూలత.. వెంటనే నగదుగా మార్చుకునే సౌలభ్యం.. ఇప్పుడు పాలసీల్లో కనిపిస్తున్న కొత్త మార్పులివే. పాలసీదారుల అవసరాలు, వారి లక్ష్యాలు మారుతుండటంతో.. బీమా సంస్థలు ఈ తరహా పాలసీలను తీసుకొచ్చే దిశగా తమ పాలసీల్లో మార్పులను చేసేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ రెండూ భిన్నమైన అంశాలే. ఇప్పుడు బీమా రక్షణతోపాటు ఇవీ పాలసీల ఎంపికలో కీలకంగా మారడం ఇటీవల కాలంలో కనిపిస్తోంది. 

నగదుగా మార్చుకునే వీలు..

ప్రస్తుత అనిశ్చితి సమయంలో... పెట్టుబడులను వెంటనే నగదుగా మార్చుకునే వీలుండటం ఎంతో అవసరం. ఇలాంటి వెసులుబాటు ఉన్న పథకాల్లో మదుపు చేసేందుకు వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపిస్తారు. అయితే, ఇది సాధారణ బీమా సూత్రాలకు విరుద్ధమనే చెప్పాలి. బీమా పాలసీల్లో దీర్ఘకాలం పొదుపు చేసి, మంచి రాబడిని ఆర్జించే లక్ష్యం ఉండాలి. నగదును ఉపసంహరించే వీలుంటే.. లక్ష్యం దెబ్బతింటుంది కదా.. ఈ రెండు విషయాల్లోనూ పాలసీదారులకు ఇబ్బంది కలగకుండా బీమా సంస్థలు.. పాలసీలను రూపొందిస్తున్నాయి. 
ఇప్పుడు చాలామంది పాలసీదారులు మంత్లీ ఇన్‌కం ప్లాన్లలాంటివి కోరుకుంటున్నారు. దీనివల్ల వారి అవసరాలకు ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. బీమా సంస్థలు దీన్ని దృష్టిలో పెట్టుకొని, కొత్త పాలసీలను రూపొందిస్తున్నాయి. 
పాలసీల నుంచి నగదును ఉపసంహరించుకోవడానికి వీలుగా నిర్ణీత వ్యవధి తీరిన తర్వాత పాలసీ నుంచి రుణాన్ని తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నాయి. దీనివల్ల పాలసీదారులు తమ పాలసీలను స్వాధీనం చేయాల్సిన అవసరం లేకుండానే.. తమ నగదు అవసరాన్ని తీర్చుకోవచ్చు. ఇతర అప్పులను తీసుకోవాల్సిన అవసరమూ ఉండదు. ఇలా దీర్ఘకాలం కొనసాగే పాలసీల నుంచీ.. అత్యవసరం అయినప్పుడు నగదును తీసుకునే సౌకర్యం ఉన్న పాలసీలతో వినియోగదారులు సంతృప్తి చెందుతున్నారు. 

అనుకూలంగా..

పాలసీలు తమ ఆర్థిక అవసరాలకు అనుకూలంగా ఉండాలనే భావన పాలసీదారుల్లో పెరిగింది. ముఖ్యంగా యువతరం ఎంచుకునే పాలసీల్లో.. అన్ని రకాల ప్రయోజనాలూ కలిసి ఉండేలా చూసుకుంటున్నారు. ఒకసారి ఎంపిక చేసుకున్నాక దాన్ని వదిలేసే అవసరం రాకూడదనేది వారి భావన. ముఖ్యంగా ప్రీమియం చెల్లింపుల్లో అనుకూలంగా ఉండాలనేది పాలసీదారుల ఆలోచన. ఒకేసారి మొత్తం ప్రీమియం కాకుండా.. వివిధ వ్యవధుల్లో ప్రీమియం చెల్లించే వెసులుబాటు ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది. ఇటీవల కాలంలో బీమా సంస్థలు ఈ తరహా ప్రీమియం చెల్లింపు అవకాశాలను కల్పిస్తూ పాలసీలను తీసుకొచ్చాయి.
దీంతోపాటు.. ఇప్పుడు అంతా డిజిటల్‌లోనే పాలసీల జారీలాంటివి ఎక్కువమంది ఇష్టపడుతున్నారు. వీడియో కాలింగ్, చాట్‌బోట్స్, వాట్సాప్‌ సర్వీసుల ద్వారా పాలసీలను ఇవ్వడం, కేవైసీలాంటివి పూర్తి చేయడంలాంటి కొత్త మార్పులను బీమా సంస్థలు తీసుకొచ్చాయి. కొవిడ్‌-19 కన్నా ముందూ బీమా సంస్థలు పలు మార్పులు తీసుకొచ్చినప్పటికీ.. మహమ్మారి నేపథ్యంలో వీటిలో వేగం పెరిగిందని చెప్పొచ్చు. 
- సమీర్‌ జోషి, చీఫ్‌ ఏజెన్సీ ఆఫీసర్, బజాజ్‌ అలయంజ్‌ లైఫ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని