మలి వయసులో.. స్థిరాదాయం అందేలా...

ఉద్యోగంలో ఉన్నన్ని రోజులూ క్రమం తప్పకుండా.. ఆదాయం వస్తుంది.. పదవీ విరమణ తర్వాత.. అప్పటి వరకూ కూడబెట్టిన మొత్తంతో.. నెలనెలా స్థిరాదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవాల్సిందే. బ్యాంకు వడ్డీ రేట్లు   తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో..

Updated : 09 Apr 2021 09:50 IST

ఉద్యోగంలో ఉన్నన్ని రోజులూ క్రమం తప్పకుండా.. ఆదాయం వస్తుంది.. పదవీ విరమణ తర్వాత.. అప్పటి వరకూ కూడబెట్టిన మొత్తంతో.. నెలనెలా స్థిరాదాయం వచ్చే ఏర్పాటు చేసుకోవాల్సిందే. బ్యాంకు వడ్డీ రేట్లు   తక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. కాస్త అధిక రాబడి అందుకోవాలంటే ఉన్న ప్రత్యామ్నాయాలేమిటి? చూద్దాం..


ప్రభుత్వ హామీతో..

పెట్టుబడికి పూర్తి భరోసా.. రాబడికి హామీ ఉన్న పథకాలు కావాలనుకునే వారికి భారత ప్రభుత్వం భరోసానిచ్చే పెట్టుబడులు అందుబాటులో ఉన్నాయి. అవే సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీం (ఎస్‌సీఎస్‌ఎస్‌), ప్రధానమంత్రి వయ వందన యోజన (పీఎంవీవీవై), పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం     (పీఓఎంఐఎస్‌). ఈ మూడు పథకాలూ దేనికవే భిన్నం.
* బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే.. సురక్షిత పథకాల్లో ప్రస్తుతం ఈ మూడూ మంచి రాబడిని అందిస్తున్నాయనే చెప్పొచ్చు.
* సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంలో కనీసం రూ.1,000 నుంచి రూ.15లక్షల వరకూ మదుపు చేయొచ్చు. జీవిత భాగస్వామితో కలిసి రూ.30లక్షల వరకూ ఉమ్మడి ఖాతాలో పెట్టుబడి పెట్టే వీలుంది. కనీసం ఐదేళ్ల వరకూ పెట్టుబడిని కొనసాగించాలి. ప్రస్తుతం ఇందులో   7.40% వార్షిక వడ్డీ లభిస్తోంది. మూడు నెలలకోసారి వడ్డీ చెల్లిస్తారు.  అత్యవసర పరిస్థితుల్లో వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, 1-1.5శాతం వరకూ  అపరాధ రుసుము వర్తిస్తుంది.
* ప్రధానమంత్రి వయ వందన యోజన: ప్రస్తుతం 7.40శాతం వార్షిక వడ్డీ వస్తోంది. నెల, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాదికోసారి వడ్డీ తీసుకోవచ్చు. కనీస వ్యవధి 10ఏళ్లు. అత్యవసరాల్లో పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే.. 2శాతం వరకూ రుసుము వర్తిస్తుంది. గరిష్ఠంగా రూ.15లక్షల వరకూ మదుపు చేయొచ్చు. జీవిత భాగస్వామి సీనియర్‌ సిటిజన్‌ అయితే ఉమ్మడి ఖాతాలో రూ.30లక్షల వరకూ జమ చేయొచ్చు.
* పోస్టాఫీసు నెలవారీ ఆదాయ పథకం: గరిష్ఠంగా రూ.4.5లక్షలు, జీవిత భాగస్వామితో కలిసి రూ.9లక్షల వరకూ జమ చేయొచ్చు. ప్రస్తుతం వార్షిక వడ్డీ 6.6శాతం లభిస్తోంది. నెలనెలా వడ్డీని చెల్లిస్తారు. కనీస వ్యవధి 5 ఏళ్లు. ఏడాది తర్వాత అపరాధ రుసుముతో వెనక్కి తీసుకునే వీలుంది.
ఈ మూడు పథకాల నుంచి వచ్చే వడ్డీని మొత్తం ఆదాయంలో కలిపి చూపించి, వర్తించే పన్ను శ్లాబులను బట్టి, ఆదాయపు పన్ను చెల్లించాల్సి వస్తుంది.


ప్రభుత్వ బాండ్లలో..

ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ సంస్థలు బాండ్లను విడుదల చేస్తుంటాయి. ఇవీ కొంత మేరకు సురక్షితమే అయినప్పటికీ.. ఇందులో వడ్డీ రేటు హెచ్చుతగ్గులు ఉంటాయి. కేవలం ఈ బాండ్లలోనే మదుపు చేయడం వల్ల వైవిధ్యం కనిపించదు.
* ఆర్‌బీఐ ఫ్లోటింగ్‌ రేట్‌ బాండ్లను సురక్షితమైన స్థిరాదాయ బాండ్లకు ప్రత్యామ్నాయంగా చెప్పుకోవచ్చు. ఇందులో వడ్డీ రేటును ఆర్‌బీఐ ప్రతి ఆరు నెలలకోసారి సమీక్షిస్తూ ఉంటుంది. సాధారణంగా ఈ వడ్డీ రేటు జాతీయ పొదుపు పథకాలతో పోలిస్తే.. దాదాపు 35 బేసిస్‌ పాయింట్ల వరకూ అధికంగానే ఉంటుంది. ప్రస్తుతం ఈ బాండ్లపై 7.15శాతం వరకూ రాబడి వస్తోంది. జులై 1న వడ్డీ రేట్ల సమీక్ష ఉంటుంది. ఏటా జనవరి, జులైలో వడ్డీని చెల్లిస్తారు.
* ఈ బాండ్లలో కనీసం ఏడేళ్లపాటు కొనసాగాల్సి ఉంటుంది. అయితే, మదుపరుల వయసును బట్టి, నిర్ణీత కాలం తర్వాత ముందస్తుగా వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది. 60-70 ఏళ్లవారు 6ఏళ్లు, 70-80 ఏళ్ల మధ్యలో ఉన్నవారు 5 ఏళ్లు, 80 ఏళ్లపైబడిన వారు 4 ఏళ్ల తర్వాత పెట్టుబడిని వెనక్కి తీసుకోవచ్చు.


కార్పొరేట్‌ ఎఫ్‌డీలు.. ఎన్‌సీడీలు..

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లు తగ్గిన తర్వాత అందరినీ ఆకర్షిస్తోన్న పథకం కార్పొరేట్‌ బాండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు. వీటిల్లో బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే 1-2 శాతం అధిక వడ్డీ వస్తుంది. కానీ, అంత సురక్షితం కావు. మీరు వీటిలో డిపాజిట్‌ చేస్తున్నారంటే.. ఆ కంపెనీకి రుణం  ఇస్తున్నట్లు లెక్క.
* కాస్త నష్టభయం భరించే సామర్థ్యం ఉన్నవారు.. షార్ట్‌ డ్యూరేషన్‌ ఫండ్లలో మదుపు చేయొచ్చు. వీటిద్వారా ఇలాంటి కంపెనీల డిపాజిట్లలో వైవిధ్యంగా మదుపు చేసే అవకాశం లభిస్తుంది.
* మంచి రేటింగ్‌ ఉన్న సంస్థలకు చెందిన ఎఫ్‌డీలు, ఎన్‌సీడీల్లోనే మదుపు చేయండి. యాజమాన్యం  పనితీరు, గత చెల్లింపుల చరిత్ర ఒకటికి రెండుసార్లు చూసుకోండి. కేవలం అధిక వడ్డీ వస్తుందనే ఆశతో మదుపు చేసి, నష్టపోవద్దు.


డెట్‌ ఫండ్లను ఎంచుకుంటే...

పదవీ విరమణ ప్రయోజనాలను వీలైనంత మేరకు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలి. డెట్‌ ఫండ్లు కొంత మేరకు సురక్షితమే అయినా.. ఇందులోనూ కొంత మార్కెట్‌ రిస్క్‌ ఉంటుంది.
* మదుపు చేసేటప్పుడు.. ఆ ఫండ్‌లో ఎంత వైవిధ్యం ఉందనేది చూసుకోండి. ఫిక్స్‌డ్‌ ఇన్‌కం ఫండ్లలో మదుపు చేసేటప్పుడు.. ఇతర ఫండ్లతో పోల్చి చూసినప్పుడు అధిక రాబడి ఇస్తుంటే అనుమానించాల్సిందే. రాబడి అధికంగా ఇస్తోందంటే.. నష్టభయమూ ఎక్కువగానే  ఉండే అవకాశం ఉంది.
* క్రెడిట్‌ రిస్క్‌ ఎక్కువగా ఉన్న ఫండ్ల జోలికి  వెళ్లకపోవడమే మంచిది.
* కొత్తగా అమల్లోకి వచ్చిన రిస్క్‌-ఓ-మీటర్‌ను పరిశీలిస్తే.. ఆ ఫండ్‌ పనితీరును సులభంగా అంచనా వేయొచ్చు. రిస్క్‌ గ్రేడును చూడటంతోపాటు, ఫండ్‌ ఖర్చులనూ బేరీజు వేసుకోవాలి.
* 3-4 ఏళ్లకు మించి ఈ ఫండ్లలో పెట్టుబడి పెట్టొద్దు. మంచి నాణ్యమైన ఫండ్లు, సులభంగా నగదుగా మార్చుకునేందుకు వీలున్న వాటినే పెట్టుబడి కోసం ఎంచుకోవాలి.


ఈక్విటీలతో జాగ్రత్త..

ప్రస్తుతం స్టాక్‌ మార్కెట్‌ అందరినీ ఆకర్షిస్తోంది. పదవీ విరమణ ప్రయోజనాలను మొత్తం తీసుకొచ్చి, షేర్లలో మదుపు చేయాలనే ఆలోచన ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అయితే, మంచి ఈక్విటీ ఫండ్లను ఎంచుకొని, మీ పెట్టుబడిలో కొంత భాగాన్ని దీర్ఘకాలం కోసం మదుపు చేయొచ్చు. మీ మొత్తం పెట్టుబడి విలువలో ఇది 10శాతానికి మించకుండా చూసుకోవాలి. పెట్టుబడి పెట్టిన మొత్తం నుంచి ఏటా 4 శాతం వరకూ వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు.


మర్చిపోకండి..

* పదవీ విరమణ తర్వాత ఎప్పుడూ అత్యవసర నిధి అందుబాటులో ఉంచుకోవాలి. దీన్ని సులభంగా వెనక్కి తీసుకునేలా బ్యాంకు పొదుపు ఖాతా లేదా స్వీప్‌-ఇన్‌ డిపాజిట్‌లో ఉంచుకోవాలి.
* కుటుంబ సభ్యులందరికీ వర్తించేలా ఆరోగ్య బీమా   పాలసీని తప్పనిసరిగా తీసుకోవాలి. ఆర్థికంగా బాధ్యతలు ఉన్నప్పుడే జీవిత బీమా పాలసీని కొనసాగించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని