సగం మారుతీవే..!

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ మరోసారి సత్తా చాటింది. 2020లో అమ్ముడు పోయిన ప్రతి రెండు కార్లలో ఒకటి మారుతీదే. ఇలాంటి రికార్డును వరుసగా నాలుగోసారి కైవసం చేసుకొంది.  కంపెనీ డీజిల్ వాహనాల విక్రయం నుంచి

Published : 16 Feb 2021 22:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ మరోసారి సత్తా చాటింది. 2020లో అమ్ముడు పోయిన ప్రతి రెండు కార్లలో ఒకటి మారుతీదే. ఇలాంటి రికార్డును వరుసగా నాలుగోసారి కైవసం చేసుకొంది.  కంపెనీ డీజిల్ వాహనాల విక్రయం నుంచి గతేడాది వైదొలగినా.. ఈ రికార్డు నిలబెట్టుకోవడం గమనార్హం. మారుతీ కార్ల విక్రయాల్లో డీజిల్‌ వాహనాల వాటా దాదాపు 30శాతం వరకు ఉంటుంది. భారత్‌లోకి వచ్చిన సరికొత్త సంచలనాలు ఎంజీ మోటార్స్‌, కియాలను ఎదుర్కొని ఈ మార్కెట్‌ వాటా సాధించడం విశేషం.

ఇటీవల కాలంలో భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న మధ్యశ్రేణి ఎస్‌యూవీ విభాగంలో మారుతీ పూర్తిగా అడుగుపెట్టలేదు. అందుకే ఈ సెగ్మెంట్లో మాత్రం హ్యూందాయ్‌, కియా కార్లు తమ స్థానాలను సుస్థిరం చేసుకొన్నాయి. చిన్నకార్ల విభాగంలో మారుతీకి 67శాతం వాటా, సెడాన్లలో 50శాతం, ఎంయూవీల్లో 55శాతం, ఎస్‌యూవీల్లో 14శాతం, వ్యాన్లలో 98శాతం మార్కెట్‌ వాటా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మారుతీ కార్ల విక్రయాలు 35శాతం నుంచి 41శాతానికి పెరగడం విశేషం.

ఒక ఎస్‌యూవీ విభాగంలో మినహా మారుతీ మిగిలిన అన్ని విభాగాల్లో మార్కెట్‌ వాటాను పెంచుకొందని కంపెనీ ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ శశాంక్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. ‘‘కేవలం బ్రెజాతోనే ఎస్‌యూవీ విభాగంలో ముందుండటం కష్టం. ఎస్‌క్రాస్‌ విక్రయాల సంఖ్య కూడా  పెరగాలి. కేవలం వినియోగదారుల అభిరుచులకు తగ్గట్లు కార్లను ఉత్పత్తి చేయడంతోనే మేం విజయం సాధించాం. దానిని భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం’’ అని శ్రీవాస్తవ పేర్కొన్నారు.  గతేడాది మారుతీ సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయలేదు. కానీ, తాజాగా బీఎస్‌-6 నిబంధనలు అమల్లోకి వచ్చాక కొత్తమోడళ్లపై కసరత్తును ముమ్మరం చేసింది. 

ఇవీ చదవండి

నేటి నుంచి రైల్‌టెల్ ఐపీఓ

పెట్టుబడికి బంగారు బాట

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని