విదేశీ మారకపు నిల్వలు పెరిగాయ్
విదేశీ మారకపు నిల్వలు ఏప్రిల్ 23తో ముగిసిన వారానికి 1.701 బిలియన్ డాలర్లు పెరిగి 584.107 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు పెరగడం ఇందుకు కారణమైంది. అంతకుముందు వారం (ఏప్రిల్ 16తో ముగిసిన)లోనూ మారకపు నిల్వలు
ముంబయి: విదేశీ మారకపు నిల్వలు ఏప్రిల్ 23తో ముగిసిన వారానికి 1.701 బిలియన్ డాలర్లు పెరిగి 584.107 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు పెరగడం ఇందుకు కారణమైంది. అంతకుముందు వారం (ఏప్రిల్ 16తో ముగిసిన)లోనూ మారకపు నిల్వలు 1.193 బిలియన్ డాలర్లు పెరిగిన సంగతి తెలిసిందే. ఆర్బీఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. సమీక్షా వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 1.062 బిలియన్ డాలర్లు అధికమై 541.647 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. పసిడి నిల్వలు 615 మిలియన్ డాలర్లు పెరిగి 35.969 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 7 మిలియన్ డాలర్లు పెరిగి 1.505 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఐఎంఎఫ్ వద్ద దేశ నిల్వల స్థితి 18 మిలియన్ డాలర్లు పెరిగి 4.987 బిలియన్ డాలర్లకు చేరింది.
టీసీఎస్ సీఫీఓగా సమీర్ సెక్సారియా బాధ్యతల స్వీకరణ నేడు
దిల్లీ: టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ముఖ్య ఆర్థికాధికారి (సీఎఫ్ఓ)గా సమీర్ సెక్సారియా శనివారం (మే 1న) బాధ్యతలు స్వీకరించనున్నారు. వి.రామకృష్ణన్ స్థానంలో సమీర్ను నియమిస్తూ ఏప్రిల్ 12న జరిగిన సమావేశంలో డైరెక్టర్ల బోర్డు నిర్ణయం తీసుకుంది. రామకృష్ణన్ శుక్రవారం పదవీ విరమణచేశారు. సీఎఫ్ఓగా నియామకానికి ముందు ఫైనాన్షియల్ అనలటిక్స్, ప్లానింగ్, బిజినెస్ ఫైనాన్స్ ఫంక్షన్స్ విభాగానికి అధిపతిగా సమీర్ బాధ్యతలు నిర్వహించారు. 1999లో టీసీఎస్లో అడుగుపెట్టిన ఆయన కంపెనీ ఐపీఓలో కీలక ప్రాత పోషించారు.
కంపెనీల విదేశీ రుణాలకు ఆద్యులు..సుందర్ ఇక లేరు
దిల్లీ: భారత కంపెనీలు విదేశాల్లో వాణిజ్య రుణాలు తీసుకోవడానికి వీలు కల్పించిన మాజీ ఉన్నతాధికారి సంజీవ్ సుందర్(82) ఇక లేరు. కొవిడ్-19 కారణంగా శుక్రవారం ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1963 బ్యాచ్ గుజరాత్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన సుందర్ ప్రభుత్వ సేవల నుంచి వైదొలిగాక ద ఎనర్జీ అండ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్(టీఈఆర్ఐ)లో విశిష్ట సభ్యుడిగానూ; టీఈఆర్ఐ యూనివర్సిటీలో గౌరవ ఆచార్యులుగానూ సేవలందించారు. 1997లో ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ హోదాలో పదవీ విరమణ చేయడానికి ముందు వివిధ శాఖల్లోనూ పనిచేశారు. ఆర్థిక శాఖలో ఆయన ఉన్న సమయంలోనే ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన భారత కంపెనీలు విదేశాల్లో వాణిజ్య రుణాల ద్వారా నిధులు సమీకరించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.