12న జీఎస్టీ కౌన్సిల్‌ భేటీ.. అజెండా ఇదే! 

గత నెలాఖరులో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘం నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ నెల 12న భేటీ ........

Updated : 10 Jun 2021 16:18 IST

దిల్లీ: మే నెలాఖరులో జరిగిన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో ఏర్పాటు చేసిన మంత్రివర్గ సంఘం (GoM) నివేదిక సమర్పించిన నేపథ్యంలో ఈ నెల 12న భేటీ కావాలని జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. శనివారం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరగనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ సమావేశంలో కరోనా చికిత్సకు అత్యవసర వస్తువులు, బ్లాక్‌ ఫంగస్‌ ఔషధాలపై పన్నులు తగ్గించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.

మే 28న జరిగిన సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్‌ సభ్యులు కరోనాకు చికిత్సకు వాడే సామగ్రి అయిన పీపీఈ కిట్లు, మాస్క్‌లు, వ్యాక్సిన్లు తదితరాలపై పన్ను ఉపశమనం కల్పించాలని కోరారు. అయితే, ఈ సామగ్రిపై పన్ను మినహాయించే అంశంపై అధ్యయనానికి కేంద్ర ఆర్థికశాఖ మేఘాలయా ముఖ్యమంత్రి కె. సంగ్మా నేతృత్వంలో ఓ మంత్రివర్గ సంఘాన్ని (GoM) ఏర్పాటు చేసింది. మంత్రుల బృందంతో కూడిన ఈ సంఘం జూన్‌ 7న నివేదిక సమర్పించినట్టు అధికారులు తెలిపారు. ఈ కమిటీలో తెలంగాణ ఆర్థికమంత్రి హరీశ్‌రావు కూడా ఉన్నారు.

మరోవైపు, మంత్రివర్గ సంఘంలో సభ్యుడిగా ఉన్న యూపీ ఆర్థికమంత్రి సురేశ్‌ కుమార్‌ ఖన్నా బుధవారం మాట్లాడుతూ.. కొవిడ్‌ రోగులకు ఉపశమనం కల్గించేలా కరోనా చికిత్సకు వాడే సామాగ్రిపై పన్నులు తగ్గించే అంశంపై తమ రాష్ట్రం అనుకూలంగానే ఉన్నప్పటికీ.. జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించిన పన్ను రేట్లను అంగీకరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్లపై 5శాతం జీఎస్టీ వసూలు చేస్తుండగా.. కరోనా ఔషధాలు, ఆక్సిజన్‌ కాన్‌సంట్రేటర్లపై 12శాతం జీఎస్టీ విధిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని