GST: రూ.లక్ష కోట్ల దిగువకు జీఎస్‌టీ వసూళ్లు

కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు, లాక్‌డౌన్ల కారణంగా జూన్‌లో కేంద్రానికి జీఎస్‌టీ(వస్తు, సేవల పన్ను) రాబడి తగ్గింది. గత ఎనిమిది నెలలుగా రూ.లక్ష కోట్ల మార్క్‌ పైనే ఉన్న

Updated : 06 Jul 2021 17:27 IST

దిల్లీ: కరోనా కట్టడి కోసం పలు రాష్ట్రాలు విధించిన ఆంక్షలు, లాక్‌డౌన్ల కారణంగా జూన్‌లో కేంద్రానికి జీఎస్‌టీ(వస్తు, సేవల పన్ను) రాబడి తగ్గింది. గత ఎనిమిది నెలలుగా రూ.లక్ష కోట్ల మార్క్‌ పైనే ఉన్న జీఎస్‌టీ వసూళ్లు.. గత నెలలో రూ.92 వేలకోట్లుగా నమోదయ్యాయి. అయితే గతేడాది జూన్‌ నెల వసూళ్లతో పోలిస్తే ఇది 2శాతం ఎక్కువ అని కేంద్ర ఆర్థికశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

జూన్‌ నెలలో రూ. 92,849కోట్ల మేర జీఎస్‌టీ వసూలైంది. ఇందులో కేంద్రం వాటా(సీజీఎస్‌టీ) రూ. 16,424కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్‌టీ(ఎస్‌జీఎస్‌టీ) రూ. 20,397కోట్లుగా ఉంది. సమ్మిళిత జీఎస్‌టీ కింద రూ. 49,079కోట్లు, సెస్‌ రూపంలో రూ. 6,949కోట్లు వసూలైనట్లు ఆర్థికశాఖ తెలిపింది. 

కరోనా రెండో దశ ఉద్ధృతి కారణంగా ఈ ఏడాది మే నెలలో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు లాక్‌డౌన్లు, కఠిన ఆంక్షలు తీసుకొచ్చాయి. దీంతో ఆ నెలలో వ్యాపార కార్యకలాపాలు తగ్గాయి. ఏప్రిల్‌లో 5.88కోట్ల ఇ-వే బిల్లులు రాగా.. మే నెలలో వాటి సంఖ్య 3.99కోట్లు మాత్రమే. దీంతో జూన్‌ నెలలో జీఎస్‌టీ వసూళ్లు తగ్గినట్లు ఆర్థికశాఖ పేర్కొంది. అయితే దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో గత నెలలో చాలా రాష్ట్రాల్లో పరిస్థితులు సాధారణానికి వచ్చాయి. వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడంతో జూన్‌లో 5.5కోట్ల ఇ-వే బిల్లులు జనరేట్‌ అయ్యాయి. దీంతో జులై నెల నుంచి మళ్లీ వసూళ్లు పెరుగుతాయని కేంద్రం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.రూ.1.41లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లతో ఏప్రిల్‌ నెల ఆల్‌టైమ్‌ రికార్డుగా నిలిచిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని