GST collections: వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు

జీఎస్టీ వసూళ్లు(GST collections) వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లను అధిగమించాయి....

Updated : 01 Jan 2022 16:51 IST

దిల్లీ: జీఎస్టీ వసూళ్లు(GST collections) వరుసగా ఆరో నెలా రూ.లక్ష కోట్లను అధిగమించాయి. డిసెంబరులో రూ.1.29 లక్షల కోట్లు వసూలయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 13 శాతం వృద్ధి నమోదైంది. అయితే, గత నెలలో నమోదైన రూ.1.31 లక్షల కోట్లతో పోలిస్తే మాత్రం స్వల్పంగా తగ్గాయి.

డిసెంబరు నెలకుగానూ రూ.1,29,780 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ శనివారం వెల్లడించింది. ఇందులో కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ) రూ.22,578 కోట్లు కాగా.. రాష్ట్రాల జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ) రూ.28,658 కోట్లు. సమ్మిళిత జీఎస్టీ (ఐజీఎస్టీ) కింద రూ.69,155 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.37,527 కోట్లతో కలిపి), సెస్‌ రూపంలో రూ.9,389 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ.614 కోట్లతో కలిపి) వసూలైనట్లు ఆర్థికశాఖ తెలిపింది.

గత ఏడాది నవంబరుతో పోలిస్తే ఈ సారి జీఎస్టీ వసూళ్లు 13శాతం, 2019లో ఇదే నెలతో పోలిస్తే 26 శాతం పెరిగాయి. 2021 ఏప్రిల్‌ నెలలో వసూళ్లు జీవనకాల గరిష్ఠాన్ని తాకాయి. ఆ నెల రూ.1.41లక్షల కోట్లు వసూలయ్యాయి. ఇక అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో నెలకు సగటున రూ.1.30 లక్షల కోట్లు వసూలు కావడం విశేషం. ఇది తొలి త్రైమాసికంలో రూ.1.10 లక్షల కోట్లుగా, రెండో త్రైమాసికంలో రూ.1.15 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణతో పాటు పన్ను ఎగవేత నిరోధక చర్యలు ఫలిస్తుండడం వల్లే వసూళ్లు పుంజుకుంటున్నాయని ఆర్థిక శాఖ తెలిపింది. రేట్ల హేతుబద్ధీకరణ కూడా అందుకు దోహదం చేస్తోందని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోనూ వసూళ్లు ఆశాజనకంగానే ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని