జీఎస్టీతో పన్ను రేట్లు తగ్గాయ్‌: ఆర్థిక మంత్రి

4 years of GST:  రేపటికి నాలుగేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుస ట్వీట్లు చేశారు.

Published : 30 Jun 2021 15:17 IST

దిల్లీ: వస్తు, సేవల పన్ను విధానం వల్ల సంక్లిష్టంగా ఉన్న పరోక్ష పన్ను విధానం సరళంగా మారడమే కాకుండా, వస్తువులపై పన్ను రేట్లు తగ్గాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. నాలుగేళ్లలో 66 కోట్ల జీఎస్టీ రిటర్నులు దాఖలయ్యాయని వివరించారు. జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చి నాలుగేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆమె బుధవారం వరుస ట్వీట్లు చేశారు.

జీఎస్టీ రాకముందు ఎక్సైజ్‌ ట్యాక్స్‌, సర్వీస్‌ ట్యాక్స్‌, వ్యాట్‌, మరో 13 రకాల సెస్సులు కలిపి మొత్తం 17 రకాల సుంకాలు ఉండేవని నిర్మలా సీతారామన్‌ అన్నారు. 2017 జులై 1 నుంచి ఇవన్నీ మాయమైపోయాయని చెప్పారు. జీఎస్టీ విధానం అటు వ్యాపారులకు, ఇటు వినియోగదారులకు మేలు చేకూరుస్తోందన్నారు. జీఎస్టీ విధానం సరళతరం కావడం వల్ల నిబద్ధత పెరిగిందని, సుమారు 66 కోట్ల జీఎస్టీ రిటర్నులు ఈ నాలుగేళ్లలో దాఖలయ్యాయని పేర్కొన్నారు. ఇంతకుముందు వ్యాపారులు 495 రకాల దరఖాస్తులు చేసేవారని, జీఎస్టీతో అవి 12కి తగ్గాయని తెలిపారు.

జీఎస్టీలో ప్రస్తుతం నాలుగు శ్లాబు రేట్లు ఉండగా.. అత్యవసర వస్తువులపై 5 శాతం పన్ను రేటు అమలవుతోందని, కార్ల వంటి విలాసవంతమైన వస్తువులపై 28 శాతం పన్నురేటు వర్తిస్తోందని పేర్కొన్నారు. 12, 18 శాతం పన్ను రేట్ల కింద వివిధ వస్తువులు ఉన్నాయని చెప్పారు. జీఎస్టీకి ముందు పన్నుమీద పన్ను వల్ల 31 శాతం వరకు పన్ను పడేదని, జీఎస్టీతో పన్ను రేటు తగ్గిందని చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఇప్పటి వరకు 44 సార్లు భేటీ అయ్యి వివిధ వస్తువులపై పన్ను రేట్లు తగ్గించాయని గుర్తుచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని