పెట్రోల్‌, డీజిల్‌పై సుంకాలు తగ్గిస్తారా? 

దేశంలో ఇటీవల చమురు ధరలు ఆకాశాన్నంటాయి. మునుపెన్నడూ లేనివిధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆల్‌టైం గరిష్ఠాలను తాకాయి. దీంతో దేశంలో ఇంధన ధరలను అదుపులోకి తెచ్చి సామాన్యులకు కాస్త

Updated : 02 Mar 2021 12:31 IST

దిల్లీ: దేశంలో ఇటీవల చమురు ధరలు ఆకాశాన్నంటాయి. మునుపెన్నడూ లేనివిధంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆల్‌టైం గరిష్ఠాలను తాకాయి. దీంతో దేశంలో ఇంధన ధరలను అదుపులోకి తెచ్చి సామాన్యులకు కాస్త ఊరట కలిగించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఎక్సైజ్‌ సుంకం తగ్గింపు యోచన చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. 

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు వినియోగదారు అయిన భారత్‌ ఇంధనం కోసం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దీంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగిన ప్రతిసారి దేశీయ మార్కెట్లోనూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పరుగులు పెడుతున్నాయి. అయితే, రిటైల్‌ ధరల్లో దాదాపు 60శాతానికి పైగా పన్నులు, సుంకాలే. గతేడాది కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపడంతో పన్ను ఆదాయాన్ని పెంచి వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రభుత్వం గత 12 నెలల్లో రెండు సార్లు పెట్రోల్‌, డీజిల్‌పై సుంకాలను పెంచింది. దీంతో దేశంలో ఇంధన ధరలు పెరిగాయి. దీనికి తోడు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా చమురు వినియోగం పెరగడంతో చమురు సంస్థలు ఉత్పత్తిని తగ్గించాయి. ఫలితంగా అంతర్జాతీయ విపణిలో ధరలకు రెక్కలొచ్చాయి. 

ఈ నేపథ్యంలో దేశంలో ఇంధన ధరలను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సమాయత్తమైనట్లు సమాచారం. ఇందుకోసం రాష్ట్రాలు, చమురు సంస్థలు, చమురు మంత్రిత్వశాఖ చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలకు ఇబ్బంది కలగకుండా సామాన్యులపై పన్ను భారం తగ్గించే పరిష్కారం కనుగొనాలని ఆర్థికశాఖ కోరినట్లు సమాచారం. మార్చి రెండోవారం నాటిని సుంకాల తగ్గింపు లేదా ధరల స్థిరీకరణపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

చమురు ఉత్పత్తి చేసే ఓపెక్‌ దేశాలతో భారత్‌ త్వరలో సమావేశం కానుంది. ఈ సమావేశం తర్వాత పన్ను తగ్గింపుపై నిర్ణయానికి వచ్చే అవకాశముంది. ముడి చమురు ఉత్పత్తిని పెంచి ధరలు తగ్గేలా చూడాలని ఓపెక్‌ దేశాలను ఇప్పటికే భారత్‌ కోరింది. ఇదిలా ఉండగా.. దేశంలో ఇంధన ధరలు పెరగడంతో ఇటీవల కొన్ని రాష్ట్రాలు పెట్రోల్‌, డీజిల్‌పై పన్ను తగ్గించిన విషయం తెలిసిందే. 

ఇవీ చదవండి..

విమాన ఇంధన ధరలు 6.5శాతం పెంపు

ఫిబ్రవరిలో జీఎస్‌టీ వసూళ్లు రూ. 1.13లక్షల కోట్లు 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని